ETV Bharat / city

తెదేపా జాతీయ భావాలతో ముందుకెళ్లిందన్న చంద్రబాబు

author img

By

Published : Aug 15, 2022, 12:03 PM IST

Updated : Aug 16, 2022, 2:11 AM IST

దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని తెదేపా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గుంటూరు జిల్లాలో పార్టీ అధినేత చంద్రబాబు జాతీయ పతాకాన్ని ఎగరేశారు. ఒకప్పటి పేదరికం నుంచి ఇప్పుడు ప్రపంచ దేశాలతో పోటీపడే స్థాయికి భారత్ ఎదిగిందని బాబు అన్నారు. భవిష్యత్ లో ప్రపంచంలోనే భారత్ ను అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు.

chandra babu
chandra babu

గుంటూరు జిల్లాలో నిర్వహించిన స్వాతంత్య్రదిన వేడుకల్లో తెదేపా అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం సందేశం ఇచ్చారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చేందుకు చాలామంది తమ ప్రాణాలను, ఆస్తులను త్యాగం చేశారని.. వారి త్యాగాలను గుర్తుచేసుకుంటూ ముందుకెళ్దామని పిలుపునిచ్చారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు ఘనంగా జరుపుతున్నామని.. దేశ సేవకు ప్రజలంతా పునరంకితం కావాల్సిన సమయమిదని చంద్రబాబు అన్నారు.

పేదరికం నుంచి.. నేడు ప్రపంచ దేశాలతో పోటీపడే స్థాయికి భారత్ ఎదిగిందని చంద్రబాబు చెప్పారు. రక్షణ రంగంలో ఎంతో పురోభివృద్ధి సాధించామని, సొంతగా ఆయుధాలు తయారు చేసుకునే స్థాయికి చేరామని అన్నారు. స్వాతంత్య్ర స్ఫూర్తిని, క్రమశిక్షణను అందరిలో పెంచాలని, ప్రతి ఒక్కరిలోనూ దేశ భక్తి రగిల్చేలా పనిచేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. విలువలతో కూడిన సమాజం ఏర్పాటుకు కృషిచేయాలని, ఆర్థిక అసమానతలు తొలగించే వ్యవస్థకు శ్రీకారం చుట్టాలని సూచించారు. నాడు విదేశీ పాలనలో పేదరికం, కరవు కాటకాలు అనుభవించామన్న బాబు.. ఇప్పుడు దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపేందుకు అందరం కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు.

ప్రపంచంలో మేటైన మేధావులు ఉండే దేశం.. భారతదేశమని అన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు.. ప్రపంచంతో పోటీపడేలా చేశాయని అన్నారు. ప్రస్తుతం నరేంద్ర మోదీ ఎన్నో విషయాల్లో ముందున్నారని చెప్పారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ను కూడా స్మరించుకోవాలని అన్నారు. పేద ప్రజల మేలుకోసమే ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వచ్చారని, తెలుగుదేశం ప్రాంతీయ పార్టీ అయినా.. జాతీయ భావాలతో ముందుకెళ్లిందని గుర్తు చేశారు. దేశ సమైక్యత విషయంలో తెదేపా ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. టెలీకమ్యూనికేషన్ రంగంలో మార్పులకు తెదేపా నాంది పలికిందని, విమానాశ్రయాలు, నౌకాశ్రయాల నిర్మాణానికి కృషి చేశామని, తెదేపా చేసిన కృషి కారణంగా ఐటీ రంగం అభివృద్ధి చెందిదని అన్నారు.

అయితే.. అవినీతి అనేది చీడలా మారి నాశనం చేస్తుందని.. అవినీతి ఉన్నచోట అభివృద్ధి శూన్యమని అన్నారు. ప్రజా జీవితం కలుషితమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ డిజిటల్ యుగంలోనూ అవినీతి ఆమోదయోగ్యం కాదని అన్నారు. నదుల అనుసంధానం ఈ దేశంలో చిరకాల వాంఛ అన్న చంద్రబాబు.. నదీ జలాలు సముద్రంలో కలవకుండా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జన్మభూమి అభివృద్ధి కోసం ప్రవాసులు కూడా కృషి చేయాలని కోరారు. అందరూ కలిసి భారతదేశాన్ని నవశకం వైపు నడిపించాలని పిలుపునిచ్చారు.

ప్రవాసాంధ్రులు సంపద సృష్టికర్తలు కావాలి: ప్రవాసాంధ్రులు సంపద సృష్టికర్తలు కావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. అనేక దేశాల్లో భారతీయులు ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లో ప్రతిభ చాటుతున్నారని వీరిలో తెలుగు వారి పాత్ర మరింత ఎక్కువగా ఉందన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల సందర్భంగా వివిధ దేశాల్లోని తెలుగు వారితో చంద్రబాబు.. వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రపంచంలో తెలుగు వారు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే స్థాయి వెళ్లారని.. మరింత ఉన్నత స్థితికి వెళ్లాలని ఆకాంక్షించారు. దేశంలో పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటు, సొంత గ్రామాల, ప్రాంతాల అభివృద్దికి కృషి చేయాలని కోరారు. గతంలో తెదేపా ప్రభుత్వం పిలుపు మేరకు జన్మభూమిలో ఎన్​ఆర్​ఐల భాగస్వామ్యం వాటి ఫలితాలను.. చంద్రబాబు గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీకి, ప్రవాసాంధ్రులకు వారధిగా ఉండేందుకు తెదేపా ఎన్​ఆర్​ఐ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రవాసాంధ్రులకు అవసరమైన సాయం, పలు అంశాల్లో సూచనలు, సలహాలు ఇచ్చేందుకు కూడా తెదేపా ఎన్​ఆర్​ఐ విభాగం పనిచేస్తుందన్నారు. గత మూడేళ్లలో రాష్ట్రం ఎలా నష్టపోయింది తాము చూస్తున్నామని పలువురు ఎన్నారైలు చెప్పారు. రాష్ట్రం కోసం తమ వంతు పాత్ర పోషించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు.

Last Updated : Aug 16, 2022, 2:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.