ETV Bharat / city

Accident: మెడికల్ సీటు వచ్చింది... కానీ అంతలోనే..

author img

By

Published : Mar 14, 2022, 9:12 AM IST

Updated : Mar 14, 2022, 1:00 PM IST

Road Accident: పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలిద్దరూ అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన వారి కుమారుడిని గోపాలపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Road Accident
Road Accident

Car Accident: తాను కలలు కన్న వైద్య విద్యలో సీటు వచ్చిన ఆనందం ఆ విద్యార్థికి ఎంతో సేపు నిలవలేదు. తమ కూమారుడిని వైద్యుడిగా చూడకుండానే ఆ తల్లిదండ్రులు శాశ్వతంగా వెళ్లిపోయారు. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఈ విషాద ఘటన జరిగింది.

వివరాలు...

పశ్చిమ గోదావరి జిల్లా మండల కేంద్రమైన బుట్టాయిగూడెంకు చెందిన దంపతులు రాజనాల మురళీకృష్ణ (54), ఊర్మిళాదేవి (42) ఇద్దరూ కలిసి తమ కుమారుడు గుణశేఖర్ మెడికల్ సీటు కౌన్సిలింగ్ కోసం ఆదివారం విశాఖపట్నం వెళ్లారు. కౌన్సెలింగ్ లో సీటు సంపాదించిన ఆనందంలో ఉండగానే తిరిగి ప్రయాణం అవుదామని భావించారు. హైవేపై రాత్రి ప్రయాణం ప్రమాదమని తలచి సోమవారం తెల్లవారుజామున తమ సొంత కారులో తిరుగు ప్రయాణమయ్యారు.

గోపాలపురం వరకు వారి ప్రయాణం సజావుగానే సాగింది. సరిగ్గా...ఇంకో 30నిముషాల్లో సొంతూరు బుట్టాయిగూడెం చేరుకునేలోపే..అంతా జరిగిపోయింది.రహదారిపై అతి వేగంగా ఎదురుగా వస్తున్న లారీ వారి పాలిట మృత్యుశకటంగా మారింది. మెరుపు వేగంతో వచ్చి ఒక్కసారిగా వారి కారుని ఢీకొట్టింది. ఏం జరిగిందో తెలిసే లోపే ముందు కూర్చున్న భార్య భర్తలిద్దరూ అక్కడికక్కడే అసువులు బాసారు. వెనుక సీట్లో కూర్చొన్న వారి కుమారుడు గుణశేఖర్ తీవ్రగాయాలపాలయ్యాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని స్థానికులు రాజమండ్రి ఆస్పత్రికి తరలించారు. కుమారుని ఉన్నత చదువుల కోసం ఎన్నో కలలు కన్న ఆ తల్లిదండ్రులు చివరకు ఆ సమయానికి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో బంధువులు, మిత్రులు కన్నీటిపర్యంతమయ్యారు.

ఇదీ చదవండి :

శిశువు తల నోట కరచుకొని పరిగెత్తిన కుక్క.. ఎక్కడంటే?

Last Updated :Mar 14, 2022, 1:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.