ETV Bharat / city

SHARMILA: 'సీఎం కేసీఆర్​ స్పందించే వరకు దీక్ష కొనసాగిస్తా..'

author img

By

Published : Sep 15, 2021, 5:16 PM IST

Updated : Sep 15, 2021, 9:29 PM IST

SHARMILA
SHARMILA

సైదాబాద్​లో అత్యాచారానికి గురైన చిన్నారి తల్లిదండ్రులను వైఎస్​ షర్మిల పరామర్శించారు. గుండెలవిసేలా రోదిస్తున్న ఆ తల్లిదండ్రులను ఓదార్చి.. ధైర్యం చెప్పారు. వీలైనంత తొందరగా నిందితున్ని పట్టుకుని.. కఠినంగా శిక్షించాలని షర్మిల డిమాండ్​ చేశారు.

హైదరాబాద్​లోని సైదాబాద్ సింగరేణికాలనీలో వైఎస్​ షర్మిల దీక్షకు కూర్చున్నారు. మృగాడి చేతిలో అత్యాచారనికి(హత్యకు కూడా గురైంది) గురైన బాలిక కుటుంబసభ్యులను పరామర్శించిన షర్మిల.. బాధతో కుంగిపోతున్న చిన్నారి తల్లిదండ్రులను ఓదార్చారు. ఆత్మీయంగా దగ్గరికి తీసుకుని ధైర్యం చెప్పారు. తాము అందరం అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఘటన జరిగి ఇన్ని రోజులైనా... నిందితున్ని పట్టుకోకపోవటంపై ప్రభుత్వంపై మండిపడ్డారు. బాధిత కుటుంబంతో కలిసి దీక్ష ప్రారంభించారు. హత్యాచార ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించే వరకూ దీక్ష చేస్తానని షర్మిల స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి పదికోట్ల పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్ దత్తత తీసుకున్న ప్రాంతమే.. ఇలా ఉంటే రాష్ట్ర పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

5 గంటలుగా షర్మిల దీక్ష-సంఘీభావం తెలిపిన విజయమ్మ

వైఎస్ విజయమ్మ
వైఎస్ విజయమ్మ

చిన్నారి ఇంటి సమీపంలో 5 గంటలుగా షర్మిల దీక్ష కొనసాగుతోంది. చంపాపేట వద్ద సాగర్‌ రోడ్డుపై వైతెపా కార్యకర్తలు బైఠాయించారు. చంపాపేట్‌, కర్మన్‌ఘాట్‌ మధ్య భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. చిన్నారి తల్లిదండ్రులను వైఎస్ విజయమ్మ పరామర్శించి.. ఓదార్చారు. అనంతరం షర్మిల చేపట్టిన దీక్షకు వైఎస్ విజయమ్మ (Ys Vijayamma) సంఘీభావం తెలిపారు.

కేసీఆర్‌కు తొత్తుల్లా వ్యవహరిస్తున్న పోలీసులు..

ప్రగతిభవన్‌లో కుక్క చనిపోతే చర్యలు తీసుకున్నారని... కానీ ప్రజలు అంటేనే లెక్కలేదని షర్మిల దుయ్యబట్టారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌, మద్యం ఏరులై పారుతుందని విమర్శించారు. బంగారు తెలంగాణ కాదని... బారులు, బీర్ల తెలంగాణగా మారిపోయిందని ఆరోపించారు. ఈ ప్రాంతంలో నీళ్లు దొరకవు కానీ.. మద్యం దొరుకుతుందని మండిపడ్డారు. ఈ ఘటన పోలీసుల వైఫల్యమేనని.. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులకు లేదా అని ప్రశ్నించారు. లాఠీఛార్జీ చేసి చిన్నారి శవాన్ని తీసుకెళ్లి.. తల్లిదండ్రుల అనుమతి లేకుండా పోస్టుమార్టం చేయించారని.. ఇంతవరకూ ఆ నివేదిక ఇవ్వలేదని ఆక్షేపించారు. పోలీసులు ప్రజల కోసం పనిచేయకుండా కేసీఆర్‌కు తొత్తుల్లా వ్యవహారిస్తున్నారని ఆరోపించారు.

ఈ నెల 9న చిన్నారిపై పాశవికంగా రాజు అనే కామాంధుడు.. అత్యాచారం చేసి అనంతరం హత్య చేసిన విషయం తెలిసిందే. రాజును పట్టుకునేందుకు పోలీసులు ముమ్మర గాలింపు చేస్తున్నా.. పట్టుబడకపోవటం పలు విమర్శలకు తావిస్తోంది. మరోవైపు.. నిందితుడు రాజును పట్టిస్తే పది లక్షల రివార్డును అందిస్తామని పోలీసులు మంగళవారం ప్రకటించారు.

ఇదీ చదవండి: స్నేహితుడి కోరిక తీర్చమంటూ యువతిపై దాడి

Last Updated :Sep 15, 2021, 9:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.