ETV Bharat / city

విలాసాల మోజులో బంధం నిర్లక్ష్యం.. భర్తను హత్య చేయించిన భార్య..

author img

By

Published : Jan 31, 2022, 9:56 AM IST

Wife gives supari to kill husband: ఉన్నదాంతో తృప్తి చెందకపోతే జీవితాలు ఛిన్నాభిన్నమవుతాయనేందుకు ఇదో చక్కని ఉదాహరణ. అనాథ అయినా కష్టపడ్డాడు. అట్టడుగు స్థాయి నుంచి ఉన్నతస్థితికి చేరాడు. ఈ క్రమంలో విలాసాలకు అలవాటుపడి కుటుంబ బంధాన్ని నిర్లక్ష్యం చేశాడు. చివరికి ఇది సొంత భార్యే అతడిని అడ్డుతొలగించుకునే పరిస్థితికి తెచ్చింది. సుపారీగ్యాంగ్ సాయంతో కట్టుకున్న భార్యే అతడిని హత్య చేయించింది.

విలాసాల మోజులో బంధం నిర్లక్ష్యం.. భర్తను హత్య చేయించిన భార్య..
విలాసాల మోజులో బంధం నిర్లక్ష్యం.. భర్తను హత్య చేయించిన భార్య..

Wife gives supari to kill husband: తెలంగాణలోని నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం కనకాపూర్ సమీపంలోని వాగులో ఈనెల 23న గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులు కేసు నమోదుచేసి చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లు, పొరుగు జిల్లాలైన జగిత్యాల, ఆర్మూర్, నిజామాబాద్, ఆదిలాబాద్ తదితర పోలీసులకు సమాచారం అందించారు. సామాజిక మాధ్యమాల్లోనూ చేసిన ప్రచారం ఫలించింది. జగిత్యాల జిల్లా మెట్​పల్లి మండలం వేంపేట్ గ్రామవాసి అయిన కంచికట్ల శ్రీనివాస్ అని తెలియడంతో పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారణ ప్రారంభించారు.

ఎదిగినా.. ఒదిగుండలేక...

శ్రీనివాస్ (42) స్వస్థలం రాష్ట్రంలోని తిరుచానూరు ప్రాంతం. అనాథ కావడంతో ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డాడు. ఈ క్రమంలో తొలుత ఆటో నడిపేవాడు. ఉప్పల్ ప్రాంతంలో బట్టల దుకాణంలో పనిచేసే స్వప్నతో (వేంపేటకు చెందిన ఈమెకు ఇదివరకే వివాహం జరిగి, ఒక కుమారుడు జన్మించాక భర్తతో మనస్పర్ధలు వచ్చి విడాకులు తీసుకుంది) పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీసింది. ఇద్దరూ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె జన్మించారు. పొదుపరి కావడంతో డబ్బులు కూడబెట్టుకొని ఆర్థికంగా నిలదొక్కుకున్నాడు. మరో ఆటో కొనుగోలుచేశాడు. స్నేహితుల సాయంతో రియల్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. బాగా కలిసిరావడంతో విలాసాల మోజులో పడ్డాడు. ఉప్పల్, వేంపేట్​లో ఇల్లు కట్టుకున్నారు. ఈ క్రమంలో నందిని అనే మరో మహిళతో సంబంధం. ఏర్పరచుకున్నాడు. విషయం తెలిసి భార్య ఆత్మహత్యకు యత్నించింది. అప్పట్నుంచి నందినికి దూరంగా ఉన్నాడు. భార్యవల్లే తను ఇష్టపడిన మహిళ దూరమైందన్న కోపంతో తరచూ భార్యాభర్తలు గొడవపడేవారు. అప్పట్నుంచి భార్యాపిల్లలను నిర్లక్ష్యం చేస్తూ వచ్చాడు. నందినితో పాటు కలిసి ఉందామని భార్యను వేధించసాగాడు. విషయం పెద్ద మనుషుల వద్దకు చేరింది. కోపంతో భార్యాపిల్లలను చితకబాదాడు. దీంతో ఆగ్రహించిన స్వప్న, తన భర్తను చంపేస్తేనే సమస్య పరిష్కారమవుతుందని నిర్ణయించుకుంది. తమ కుమారుడైన తరుణ్​తో కలిసి తన మొదటి భర్తకు పుట్టిన కుమారుడు రాజ్​ కుమార్, అక్క కొడుకైన పోశెట్టికి విషయం వివరించింది.

సుపారీ గ్యాంగ్​తో..

శ్రీనివాస్​ను చంపడం తమవల్ల కాదని, సుపారీ గ్యాంగ్​ను మాట్లాడదామని చెప్పి వారిద్దరు ఆమెను ఒప్పించారు. ఈ మేరకు పోశెట్టి తమ్ముడు చిక్కా అలియాస్ ప్రవీణ్​కుమార్​ను​ వేంపేట్​కు పిలిపించారు. ఈనెల 22న రాత్రి 9 గంటల ప్రాంతంలో బాణాల అనిల్, కంచర్ల మహవీర్, మ్యాతరి మధు, కొలనురి సునీల్, పొన్నం శ్రీకాంత్, పూసల రాజేందర్ అక్కడకు చేరుకున్నారు. రూ. 5 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. విషయం బయటపడకుండా ముందు జాగ్రత్తగా ఆమె తన కుమార్తెను పక్కింట్లో పడుకోబెట్టింది. బాగా మద్యం తాగిన అనంతరం రాత్రి 11 గంటల సమయంలో పడుకున్న శ్రీనివాస్​ను రోకలిబండతో దాడిచేశారు. లేచేందుకు యత్నించిన అతడిపై మరిన్ని దెబ్బలు వేశారు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.

తనిఖీలకు భయపడి.. వాగులో పడేసి..

సుపారీ గ్యాంగ్ వెళ్లిపోవడంతో శవాన్ని ఆ రాత్రికి రాత్రే అక్కడ్నుంచి మాయం చేయాలనుకున్నారు. పోశెట్టి, రాజ్​కుమార్, చిక్కా.. ముగ్గురు కలిసి మృతదేహాన్ని బట్టలో చుట్టి కారులో తీసుకెళ్లారు. నిర్మల్ ప్రాంతంలోని అటవీప్రదేశంలో పూడ్చేయాలని భావించారు. లక్ష్మణచాంద మండలం కనకాపూర్ వద్ద అటవీశాఖ తనిఖీ కేంద్రం వద్ద సోదాలు జరుగుతుండటం గమనించి భయపడ్డారు. అక్కడే ఉన్న వాగులో పడేసి పారిపోయారు. ఆ తర్వాత చుట్టుపక్కల ఎవరికీ అనుమానం రాకుండా శ్రీనివార్​ భార్య తన భర్త హైదరాబాద్ వెళ్లినట్లు చుట్టుపక్కల వారికి చెప్పింది..

నిందితుల అరెస్టు.. రిమాండ్​కు తరలింపు

ఘటనలో మొత్తం 13 మందిని నిందితులుగా గుర్తించారు. ఇందులో 10 మందిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. వెంకటేశ్, పొన్నం శ్రీకాంత్, పూసల రాజేందర్ అనే మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు నిర్మల్​ డీఎస్పీ ఉపేందర్ రెడ్డి వివరించారు. హత్యకు ఉపయోగించిన కారు, టాటా మ్యాజిక్, రెండు ద్విచక్రవాహనాలు, 10 చరవాణులు, 73 గ్రాముల బంగారు ఆభరణాలు, రోకలిబండ, రెండు కర్రలు, 2 బండరాళ్లను, రూ.75 వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. తక్కువ వ్యవధిలో కేసును ఛేదించిన సీఐ రాంనర్సింహారెడ్డి, లక్ష్మణచాంద, మామడ, నిర్మల్ గ్రామీణ ఎస్సైలు రాహుల్, వినయ్, అశోక్, సిబ్బందిని అభినందించారు. రివార్డులు అందిస్తామన్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.