ETV Bharat / city

Andhra Pradesh: అధికార పక్షం అలా..ప్రతిపక్షాలు ఇలా.. రాష్ట్రంలో ఏం జరుగుతోంది..!

author img

By

Published : Nov 8, 2021, 5:59 PM IST

Updated : Nov 8, 2021, 7:50 PM IST

ఆంధ్రప్రదేశ్.. గత కొద్దిరోజులుగా కీలక సమస్యలకు కేంద్రబిందువుగా మారుతోంది. ఓవైపు అమరావతి రైతులు, మహిళలు.. తమ గళం వినిపించేందుకు పాదయాత్ర చేపట్టారు. మరోవైపు మిగిలిన స్థానాల్లో స్థానిక సంస్థల ఎన్నికల జరుగుతున్నాయి. ఫలితంగా కుప్పం, గురజాల లాంటి ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. పెట్రో మంటలపై ప్రతిపక్ష పార్టీలు రోడ్డెక్కాయి. ఉత్తరాంధ్ర వేదికగా ఉక్కు ఉద్యమం ఉద్ధృతమవుతోంది. ఎయిడెడ్ పాఠశాలల విలీనం కాక రేపుతుండగా.. గంజాయి సరఫరాకు ఏపీనే కేంద్ర బిందువని విమర్శలు జోరుగా సాగుతున్నాయి. మొత్తంగా బహుముఖ సమస్యలతో రాష్ట్ర సర్కార్​ ఉక్కిరిబిక్కిరవుతోంది.

Andhrapradesh
Andhrapradesh

రాష్ట్రంలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తరువాత కాస్త.. స్తబ్ధుగా ఉన్న పరిణామాలు.. వేగంగా మారుతున్నాయి. గడిచిన కొద్దిరోజుల్లోనే ప్రభుత్వానికి పలు సమస్యలు సవాల్ విసురుతున్నాయి. 'న్యాయస్థానం నుంచి దేవస్థానం' పేరుతో అమరావతి రైతుల పాదయాత్రకు కదం తొక్కారు. ఒకదశలో సర్కార్ అనుమతి ఇవ్వకపోవటంతో.. కోర్టును ఆశ్రయించి అనుమతి పొందారు. జిల్లాల మీదుగా సాగుతున్న ఈ యాత్రను ఆంక్షల పేరుతో పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి.

పెట్రో మంటలు.. వైకాపా వర్సెస్ ప్రతిపక్షాలు

పెట్రో ధరల విషయంలోనూ రాష్ట్ర రాజకీయం రసవత్తరంగా మారుతోంది. దీపావళి సందర్భంగా కేంద్రంలోని భాజపా సర్కార్.. పెట్రోల్​పై రూ.5, డీజిల్ పై రూ.10లను తగ్గించింది. ఈ పరిణామం... రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలకు ఆయుధంగా మారింది. కేంద్రం రేట్లు తగ్గించిన పరిస్థితుల్లో.. రాష్ట్ర ప్రభుత్వం విధించే వ్యాట్​ను వెంటనే తగ్గించాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంలో ఓ అడుగు ముందుకేసిన భాజపా రాష్ట్ర నాయకత్వం.. సర్కార్​పై యుద్ధాన్ని ప్రకటించింది. ప్రభుత్వ తీరును ఖండిస్తూ 2 రోజల నిరసన కార్యక్రమాలను భాజపా నేతలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించకపోతే.. ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. తెలుగుదేశం, జనసేన పార్టీలు.. ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నాయి. మంగళవారం రాష్ట్రవ్యాప్త నిరసనలకు కూడా పిలుపునిచ్చారు తెదేపా అధినేత చంద్రబాబు.

'పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ పూర్తిగా రద్దు చేస్తామని జగన్ అన్నారు. హామీ ప్రకారం పెట్రోల్‌పై రూ.16, డీజిల్‌పై రూ.17 తగ్గించాలి. అనేక రాష్ట్రాలు తగ్గించినా ఏపీలో మొండిచేయి చూపారు. పెట్రో ధర ఎక్కువున్న రాష్ట్రానికి పరిశ్రమలు, ఉద్యోగాలు రావు. డీజిల్ ధర వల్ల ఖర్చు పెరిగి వ్యవసాయం దెబ్బతింటుంది'- చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ అధినేత

ఇక వామపక్ష పార్టీలు.. కేంద్రంలోని భాజపా, రాష్ట్రంలోని వైకాపా సర్కార్​ను టార్గెట్ చేస్తున్నాయి. మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత పెంచిన పెట్రో, డీజిల్ ధరలను తగ్గించాలని.. రాష్ట్ర సర్కార్​ కూడా వ్యాట్​ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

'భాజపా అధికారం వచ్చిన నాటి నుంచి 40 రూపాయల వరకు పెట్రోల్ ధరలు అధికమయ్యాయి. దసరా ఆఫర్ లా పది రూపాయలు తగ్గించటమేంటి..? చిత్తశుద్ధి ఉంటే ఆ మొత్తాన్ని తగ్గించాలి. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై వైకాపాకు చిత్తశుద్ది ఉంటే కేంద్రాన్ని నిలదీయాలి' - నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి

అయితే ప్రభుత్వ వాదన మరోలా ఉంది. రూ. 40 పెంచి.. నామమాత్రంగా ఐదు రూపాయలను తగ్గిస్తే లాభమేంటని ప్రశ్నిస్తోంది. ఇష్టానుసారంగా కేంద్రమే ధరలు పెంచిందని మంత్రులు ఆరోపిస్తున్నారు. కేంద్రలోని భాజపా సర్కార్.. డ్రామాలు చేస్తోందని ఘాటుగా బదులిస్తున్నారు.

'పెట్రోల్‌ ధరను రూ.116 వరకు ఎవరు తీసుకెళ్లారు? పెట్రో ధరలు పెంచిన వాళ్లే రోడ్లపై ధర్నాలు చేస్తారా? రూ.70 ఉండాల్సిన పెట్రోల్ ధరను ఎక్కడికి తీసుకెళ్లారు? ప్రజలకు ఏమీ గుర్తుండదని భాజపా నేతలు భావిస్తున్నారా? పెంచిన పెట్రో ధరలు మొత్తం తగ్గించాలి. కొన్ని నెలలుగా వీరబాదుడు బాది ఇప్పుడు రూ.5 తగ్గిస్తారా? రూ.5, రూ.10 ఎందుకు.. లీటర్‌కు రూ.30 తగ్గించాలి ' - పేర్ని నాని, రాష్ట్ర సమాచార శాఖ మంత్రి

స్థానిక సంస్థల ఎన్నికలు.. కుప్పంలో ఉద్రిక్తత

ఓవైపు రాష్ట్రంలో వివిధ కారణాలతో ఎన్నికలు జరగని స్థానిక సంస్థలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది(ap sec notification schedule for pending local body elections news). ఈ నెల 14వ తేదీన పంచాయతీలకు, 15న మున్సిపాల్టీలు, కార్పొరేషన్లకు, 16న ఎంపీటీసీ ,జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో తెదేపా అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తోన్న కుప్పం మున్సిపాల్టీలో ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల తొలి రోజు నుంచి కుప్పం పరిధిలో.. పలు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నామినేషన్ల చివరి రోజున 14వ వార్డులో తెదేపా తరఫున నామినేషన్ వేసేందుకు వెళ్తున్న మాజీ ఏంపీపీ వెంకటేష్​పై అధికార పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. అనంతరం నామినేషన్ పత్రాలను లాక్కొని చింపివేశారు. కుప్పంతో పాటు పలు ప్రాంతాల్లోనూ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

ఎయిడెడ్ పాఠశాలల విలీనం.. ఆందోళనలో విద్యార్థులు

ఎయిడెడ్‌ విద్యాసంస్థల విలీనం.. అక్కడ చదువుకునే విద్యార్థులకు కష్టాలను తెచ్చిపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 2,500 ఎయిడెడ్‌ పాఠశాలలను విలీన ప్రక్రియ చేసేందుకు ప్రభుత్వం జీవో ఇచ్చింది. అయితే ఈ పాఠశాలల్లో సుమారు రెండు లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అయితే విలీన ప్రక్రియను ఆపాలని తల్లిదండ్రులు, విద్యార్థులు ప్రతిరోజూ ఏదో ఒకచోట ఆందోళన చేస్తున్నారు. ఈ అంశంపై స్పందించిన సీఎం జగన్.. విలీన ప్రక్రియ పాఠశాలల నిర్ణయం మేరకే జరుగుతుందని వివరణ ఇచ్చారు. అయినా కూడా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.

ఇవన్నీ ఇలా ఉంటే కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయం మొత్తం గంజాయి చుట్టూ తిరుగుతోంది. గంజాయి సరఫరాను ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఎక్కడ గంజాయి, డ్రగ్స్ పట్టుబడినా దానికి మూలం ఏపీ పేరే వినిపిస్తోంది.

మరోవైపు విశాఖ ఉక్కు పరిశ్రమను వ్యతిరేకిస్తూ కార్మికులు చేపట్టిన నిరసనలు కొనసాగిస్తున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్.. సంఘీభావ సభ పేరుతో భారీ సభను చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సీఎం జగన్​తో పాటు ఎంపీలు కేంద్రంపై పోరాడాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

వలంటీర్​ అరాచకం- చోరీ ఆరోపణతో యువకుడిపై కిరాతకంగా దాడి

Last Updated :Nov 8, 2021, 7:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.