ETV Bharat / city

Kishan reddy comments on KCR: 'ధాన్యం కొనేదిలేదని కేంద్రం ఎప్పుడు చెప్పిందో నిరూపించండి'

author img

By

Published : Nov 29, 2021, 8:53 PM IST

Kishan reddy comments on KCR
Kishan reddy comments on KCR

Kishan reddy press meet: పుత్రవాత్సల్యం కోసం రైతులను ఆగం చేయొద్దని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ మొండివైఖరి వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లలో లేని సమస్యను పట్టుకుని ఆందోళన చేస్తున్నారని విమర్శించారు.

Union minister Kishan reddy comments on KCR: తెలంగాణ సీఎం కేసీఆర్‌ మొండివైఖరి వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ధాన్యం సేకరణ విషయంలో లేని సమస్యను పట్టుకుని తెరాస ఆందోళన చేస్తోందని విమర్శించారు. ధాన్యం కొనేదిలేదని కేంద్రం ఎప్పుడు, ఎలా చెప్పిందో నిరూపించాలని సవాల్‌ చేశారు. ఈ సీజన్‌లో ఒప్పందం మేరకు అన్ని రకాల ధాన్యం కొంటామని స్పష్టం చేశారు. హుజురాబాద్‌ ఓటమి తర్వాత కేసీఆర్‌కు నిద్రపట్టట్లేదన్న కిషన్ రెడ్డి.. పుత్ర వాత్సల్యం కోసం రైతులను ఆగం చేయొద్దని అన్నారు. దిల్లీలో నిర్వహించిన ప్రెస్​మీట్​లో ఈ మేరకు వ్యాఖ్యానించారు.

'రైతులు అలర్ట్​గా ఉండాలి'

బాయిల్డ్ రైస్‌ ఇవ్వబోమని రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్‌ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా- ఎఫ్​సీఐకి రాసిచ్చిందన్న కిషన్‌రెడ్డి.. దానికి కట్టుబడి ఉండాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఫుడ్‌ సెక్యూరిటీ బియ్యాన్ని తెరాస ఎమ్మెల్యేల అండతో.. ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు రీ-సైక్లింగ్‌ చేసి, ఎఫ్​సీఐకి చేర్చే విధంగా కుట్రలు జరుగుతున్నాయని కిషన్‌రెడ్డి ఆరోపించారు. రైతులు అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయమూ అందట్లేదని అన్నారు. గత ప్రభుత్వాలు మే నెలలో పంటల ప్రణాళిక విడుదల చేశాయన్న కేంద్రమంత్రి.. వ్యవసాయంపై కేసీఆర్‌కు స్థిరమైన అభిప్రాయం, అవగాహన లేదని విమర్శించారు. 'ఒకసారి పత్తి వద్దన్నారు, మరోసారి వరి వద్దన్నారన్న కిషన్‌రెడ్డి.. బాయిల్డ్ రైస్ విషయంలో కేంద్రం నాలుగేళ్లుగా హెచ్చరిస్తూనే ఉందని పేర్కొన్నారు. కొత్త వంగడాలు ఇచ్చి, రైతులను "రా రైస్‌" దిశగా మళ్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.

ఈ ఉత్తరంలో రాష్ట్రప్రభుత్వం రాసిచ్చింది. మేము బాయిల్డ్ రైస్ ఇవ్వము అని. దానికి కట్టుబడి ఉండండి. బాయిల్డ్ రైస్ ఉత్పత్తి జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కానీ అందులో విఫలమై... కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడున్న సీజన్​లో అన్నిరకాల రైస్​ను కేంద్రప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. మీరెవ్వరూ ఆందోళన చెందవద్దు. చివరి బస్తా వరకు ఈ సీజన్​లో కొంటాం. ఇంకా ప్రొక్యూర్​మెంట్ చేయాల్సి చాలా ఉంది. ఇంకా టార్గెట్ ఇచ్చింది కూడా రాష్ట్ర ప్రభుత్వం చేరుకోలేదు. రైతులు అలర్ట్​గా ఉండాలి. కేంద్రప్రభుత్వం ఇస్తున్న ఫుడ్ సెక్యూరిటీ బియ్యాన్ని తెరాస నాయకులు రీసైక్లింగ్ చేసి.. ఎఫ్​సీఐకి చేర్చే విధంగా కుట్రలు జరుగుతున్నాయి. -కిషన్ రెడ్డి, కేంద్రమంత్రి

భాజపాపై వ్యతిరేకత పెంచేందుకే..

భాజపాపై వ్యతిరేకత పెంచేందుకు తెలంగాణ కేసీఆర్‌ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. చివరి బస్తా వరకు కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్న కేంద్రమంత్రి.. ధాన్యం సేకరణకు గత ప్రభుత్వం రూ.3,404 కోట్లు మాత్రమే వెచ్చించిందని వెల్లడించారు. కానీ.. మోదీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు రూ.26,640 కోట్లు వెచ్చించిందని వివరించారు.

ధాన్యం మొలకలు వస్తోంది. రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? పంజాబ్​లో కొంటాం.. తెలంగాణలో కొనబోమని ఏ ప్రభుత్వమైనా చెప్పిందా? వ్యవసాయ రంగం మీద అవగాహన ఉన్న వాళ్లు ఎవరూ ఇలా మాట్లాడరు. ధాన్యం సేకరణలో పాలసీ ఒకటే ఉంటుంది. అది పంజాబ్ అయినా, తెలంగాణ అయినా ఒకటే. మీరు గజ్వేల్​ లో ఒక రకంగా.. దుబ్బాకలో మరో రకంగా వ్యవహరిస్తారు. పక్షపాతవైఖరి అవలంభించేది తెరాస. అధికార దుర్వినియోగం చేసేది తెరాస ప్రభుత్వం. రైతులతో ముఖ్యమంత్రి మాట్లాడుకోవాలి. కేంద్రం తరఫున పూర్తి సహాయసహకారాలు అందిస్తాం. చివరి బియ్యం వరకు కొంటాం. ఈ పంటవరకు బాయిల్డ్ రైస్ కూడా కొంటాం. -కిషన్ రెడ్డి, కేంద్రమంత్రి

ఇదీ చదవండి: Cricket betting gang arrest: క్రికెట్‌ బెట్టింగ్‌ గ్యాంగ్ గుట్టురట్టు.. రూ.2.05 కోట్లు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.