ETV Bharat / city

family planning వికటించిన కుని ఆపరేషన్, ఇద్దరు మృతి, ఒకరి పరిస్థితి విషమం

author img

By

Published : Aug 29, 2022, 12:59 PM IST

ఇబ్రహీంపట్నం ప్రభుత్వాస్పత్రిలో నిత్యం ఎంతోమందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఆపరేషన్‌ చేయించుకున్న ముగ్గురు మహిళలు అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఇద్దరు చనిపోవటం స్థానికంగా ఆందోళనకు గురి చేసింది. మరోవైపు ఈ ఘటనపై వైద్యాధికారులు స్పందించారు. ఆపరేషన్లతో ఎలాంటి ఇబ్బందులూ రాలేదని, అందరి ఆరోగ్య పరిస్థితులను పరిశీలించాకే ఇంటికి పంపించినట్లు చెబుతున్నారు.

Two died after family planning operation goes freak out in rangareddy district
వికటించిన కుని ఆపరేషన్, ఇద్దరు మృతి, ఒకరి పరిస్థితి విషమం

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వాసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకున్న మహిళల్లో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లో చికిత్స అందిస్తున్నారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ సివిల్‌ ఆసుపత్రిలో 27 మంది మహిళలకు ఈ నెల 25న కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. వీరిలో ముగ్గురు మహిళలు అస్వస్థతకు గురి కాగా.. వారిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోవటం ఆందోళనకు గురి చేసింది.

మాడ్గుల మండలం నర్సాయిపల్లికి చెందిన మమత, మంచాల మండలం లింగంపల్లి చెందిన సుష్మతో పాటు ఇబ్రహీంపట్నం పరిధిలోని సీతారాంపేట్‌కు చెందిన లావణ్యలు ఈ నెల 25న కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకున్నారు. ఇంటికి వెళ్లిన తర్వాత వీరు ముగ్గురూ అస్వస్థతకు గురి కాగా.. మమతను బీఎన్‌రెడ్డిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె ఆదివారం మృతి చెందింది. పరిస్థితి విషమించిన సుష్మను ఇబ్రహీంపట్నంలోని మరో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకు రాగా.. చికిత్స పొందుతూ ఆమె తెల్లవారుజామున ప్రాణాలు విడిచింది. సీతారాంపేటకు చెందిన లావణ్యను హైదరాబాద్‌లోని ఓవైసీ ఆస్పత్రికి తరలించారు.

స్థానికంగా ఆందోళనలు..: ఇబ్రహీంపట్నం ప్రభుత్వాస్పత్రిలో నిత్యం ఎంతోమందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరుగుతుండగా.. ఒకేసారి ముగ్గురు మహిళలు అస్వస్థతకు గురి కావటం.. వారిలో ఇద్దరు చనిపోవటం స్థానికంగా ఆందోళనకు గురి చేసింది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించినందునే ఇలా జరిగిందని బంధువులు ఆరోపిస్తున్నారు.

ఆపరేషన్లతో ఎలాంటి ఇబ్బందులు రాలేదు..: మరోవైపు ఈ ఘటనపై వైద్యాధికారులు స్పందించారు. ఆపరేషన్లతో ఎలాంటి ఇబ్బందులూ రాలేదని, అందరి ఆరోగ్య పరిస్థితులను పరిశీలించాకే ఇంటికి పంపించినట్లు చెబుతున్నారు. ముగ్గురు మహిళలు సైతం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఆరోగ్యంగా వెళ్లారని చెప్పారు.

ఇవీ చూడండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.