విశ్రాంత ఐఏఎస్‌ చిన వీరభద్రుడికి జైలుశిక్ష, జరిమానా

author img

By

Published : May 3, 2022, 10:09 PM IST

Updated : May 4, 2022, 4:27 AM IST

హైకోర్టు

High Court News: ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ఉన్నత విద్యాభ్యాసానికి అడ్డం పడేలా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ఇచ్చిన మెమో ఉందని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. వారి ప్రయోజనాల కోసం ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలకు విరుద్ధంగా మెమో ఇచ్చారంటూ రద్దు చేసింది. కోర్టు ఆదేశాలు అమలు చేయనందుకు విశ్రాంత ఐఏఎస్ అధికారి చిన వీరభద్రుడిని బాధ్యుడిగా పేర్కొంటూ.. జైలు శిక్ష విధించింది. కౌంటర్​లో క్షమాపణలు కోరుతున్నట్లు అధికారి పేర్కొన్నప్పటికీ .. ఆ క్షమాపణలను అంగీకరించడం లేదని న్యాయమూర్తి స్పష్టంచేశారు.

ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు జీతభత్యాలు పొందుతూ, పదోన్నతికి అవసరమైన డిగ్రీ/ ఉన్నత విద్య చదివేందుకు అడ్డం పడేలా పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌/డైరెక్టర్‌ 2021 జనవరిలో ఇచ్చిన మెమోను హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. 1977లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయానికి విరుద్ధంగా ఆ మెమో ఉందంటూ.. దాన్ని రద్దుచేసింది. వారి ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నమంటూ మండిపడింది.

న్యాయస్థానం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులకు అనుగుణంగా సకాలంలో పిటిషనర్లను బీపీఈడీ కోర్సుకు పంపడంలో విఫలమైనందుకు పాఠశాల విద్యాశాఖ పూర్వ డైరెక్టర్‌, విశ్రాంత ఐఏఎస్‌ వాడ్రేవు చినవీరభద్రుడిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆయనకు నాలుగు వారాల జైలుశిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తూ జస్టిస్‌ బట్టు దేవానంద్‌ తీర్పు ఇచ్చారు. న్యాయవాది అభ్యర్థన మేరకు తీర్పు అమలును రెండు వారాలు నిలుపుదల చేశారు. సాంఘిక సంక్షేమశాఖ 1977 ఆగస్టు 30 జారీచేసిన జీవో 342కి అనుగుణంగా పిటిషనర్లు ప్రయోజనాలు పొందేందుకు అర్హులని స్పష్టంచేశారు. పిటిషనర్లకు జీతభత్యాలు చెల్లిస్తూ.. స్కూల్‌ అసిస్టెంట్‌ (ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌) పోస్టులకు అవసరమైన బీపీఈడీ అర్హత/శిక్షణ పొందేందుకు అనుమతించాలని అధికారులను ఆదేశించారు.

1977లో జారీచేసిన జీవోకు అనుగుణంగా..:ఎస్జీటీలుగా పనిచేస్తున్న తమకు బీపీఈడీ కోర్సు చేసేందుకు అధికారులు అనుమతి నిరాకరించారంటూ విజయనగరం జిల్లాకు చెందిన బి.రాజేశ్‌, మరో ముగ్గురు గతేడాది మార్చిలో హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది జీవీఎల్‌ మూర్తి వాదనలు వినిపించారు. ‘పిటిషనర్లు డీఈడీ అర్హతతో ఎస్సీ కోటాలో ఎస్జీటీ పోస్టుల్లో నియమితులయ్యారు. స్కూల్‌ అసిస్టెంట్‌(ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌)గా పదోన్నతి పొందాలంటే బీపీఈడీ అర్హత సాధించాలి. 1977లో జారీచేసిన జీవో 342 ప్రకారం.. జీతభత్యాలు పొందుతూ పదోన్నతి కోసం ఉన్నతచదువు అభ్యసించేందుకు అర్హులు కాబట్టి, బీపీఈడీ చేసేందుకు అనుమతి ఇవ్వాలన్న వారి విజ్ఞప్తిని తిరస్కరిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ 2021 జనవరిలో మెమో జారీచేశారు. దానిని రద్దు చేయండి’ అని కోరారు.

విద్యాశాఖ అధికారులు కౌంటరు దాఖలు చేస్తూ..: బ్యాచిలర్‌ డిగ్రీ ఉన్న పిటిషనర్లు.. సంబంధిత ప్రత్యేక సబ్జెక్టుల ఆధారంగా స్కూల్‌ అసిస్టెంట్‌, ఇతర పోస్టుల్లో పదోన్నతి పొందవచ్చన్నారు. బీపీఈడీ చదివేందుకు అనుమతి కోరడం సరికాదన్నారు. వారిని రెండేళ్లు అలా పంపితే విద్యాబోధనపై తీవ్ర ప్రభావం, రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడతాయన్నారు.

పిటిషనర్లను అధికారులు నిర్దేశించడానికి వీల్లేదు- న్యాయమూర్తి: అధికారుల వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. ‘ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు పదోన్నతికి కావల్సిన విద్యను అభ్యసించే సమయంలో జీతభత్యాలు చెల్లించాలని 1977లో ప్రభుత్వం జీవో 342 జారీచేసింది. అది ప్రశంసనీయం. ప్రస్తుతం అధికారులు పిటిషనర్లను బీపీఈడీ కాకుండా బీఈడీ చేసేలా ఒత్తిడి చేయడం సరికాదు. ఫలానా విధానంలోనే పదోన్నతి పొందాలని పిటిషనర్లను అధికారులు నిర్దేశించడానికి వీల్లేదు. జీవోను కాదని.. పిటిషనర్లకు అనుమతి నిరాకరించడం వారి హక్కులను నిరాకరించడమే. విద్యాశాఖ జారీచేసిన మెమో పిటిషనర్లను అన్యాయానికి గురిచేస్తుంది. 1977లో తీసుకున్న నిర్ణయాన్ని నిర్వీర్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న యత్నంపై న్యాయస్థానం తీవ్ర ఆవేదన, అసంతృప్తి వ్యక్తంచేస్తోంది. పిటిషనర్లకు అనుమతి నిరాకరిస్తూ పాఠశాల విద్య కమిషనర్‌/డైరెక్టర్‌ 2021 జనవరి 11న జారీచేసిన మెమో... చట్టం ముందు నిలబడదు. దానిని రద్దుచేస్తున్నాం’ అని తీర్పులో పేర్కొన్నారు.

మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా.. : పిటిషనర్లకు జీతభత్యాలు చెల్లిస్తూ బీపీఈడీ చదివేందుకు అనుమతించాలని 2021 మార్చి 8న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. అనుమతి నిరాకరిస్తూ అధికారులు జారీచేసిన మెమోను తాత్కాలికంగా సస్పెండ్‌ చేసింది. కానీ, కోర్టు ఉత్తర్వులను సకాలంలో అమలు చేయకపోవడంపై ఎస్జీటీలు బి.రాజేశ్‌ మరో ముగ్గురు కోర్టుధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. కౌంటరును పరిశీలించిన న్యాయమూర్తి.. కోర్టు ఉత్తర్వులను 2021 డిసెంబర్లో అమలుచేసినట్లు పేర్కొన్నారని గుర్తుచేశారు. ఆదేశాల అమలులో జాప్యం చోటు చేసుకుందన్నారు. అందుకు బాధ్యులుగా విశ్రాంత ఐఏఎస్‌ అధికారి వాడ్రేవు చిన వీరభద్రుడిని పేర్కొంటూ జైలుశిక్ష విధించారు. కౌంటర్లో క్షమాపణలు కోరుతున్నట్లు అధికారి పేర్కొన్నా.. అంగీకరించడం లేదని న్యాయమూర్తి స్పష్టంచేశారు. ఆ క్షమాపణ నిజాయతీతో చెప్పినట్లు భావించడం లేదని తీర్పులో పేర్కొన్నారు.

ఇదీ చదవండి: నాగార్జున వర్సిటీ పూర్వ రిజిస్ట్రార్‌ రోశయ్యకు జైలుశిక్ష, జరిమానా

Last Updated :May 4, 2022, 4:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.