ETV Bharat / city

ఏపీ అభివృద్ధిపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలు.. మండిపడ్డ రాష్ట్ర మంత్రులు

author img

By

Published : Apr 30, 2022, 5:11 AM IST

Updated : Apr 30, 2022, 6:19 AM IST

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిని ఉద్దేశించి తెలంగాణ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కాకరేపాయి. కేటీఆర్ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రులు సీరియస్‌గా స్పందించారు. ఏపీ అభివృద్ధిని కేటీఆర్‌ కళ్లారా చూసి మాట్లాడాలని హితవు పలికారు. అటు తెలంగాణ మంత్రులు సైతం ఎదురు దాడికి దిగారు. కేటీఆర్ ఉన్నదే మాట్లాడారని బదులిచ్చారు.

తెలంగాణ మంత్రి కేటీఆర్‌
తెలంగాణ మంత్రి కేటీఆర్‌

పక్క రాష్ట్రంలో కరెంటు, నీళ్లు లేవని.. రోడ్లన్నీ ధ్వంసమయ్యాయంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్‌ శుక్రవారం చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడి పుట్టించాయి. తన స్నేహితుడు ఒకరు సంక్రాంతికి ఆ రాష్ట్రానికి వెళ్లి వచ్చి అక్కడి పరిస్థితిని చెప్పారంటూ పరోక్షంగా ఆంధ్రప్రదేశ్‌ను గురించి ఆయన ప్రస్తావించారు. అక్కడ రహదారులు, నీళ్లు, విద్యుత్‌ పరిస్థితి అధ్వానంగా ఉందని మిత్రుడు చెప్పారన్నారు. దీనిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెంటనే స్పందించారు. హైదరాబాద్‌లోనూ కరెంటు కోతలున్నాయని, తాను జనరేటర్‌ వేసుకుని ఉన్నానని వ్యాఖ్యానించారు. కరెంటు కోతలు అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నాయని, అది జాతీయ సమస్య అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అమర్‌నాథ్‌ తదితరులూ కేటీఆర్‌ వ్యాఖ్యలపై సీరియస్‌గా స్పందించారు. బొత్స మాటలపై తెలంగాణలో మరికొందరు నేతలు స్పందిస్తూ.. ఏపీలో ఉన్నదే కేటీఆర్‌ చెప్పారని అన్నారు.

హైదరాబాద్‌లో శుక్రవారం క్రెడాయ్‌ 11వ ప్రాపర్టీ షోను ప్రారంభించిన అనంతరం తెలంగాణ మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. ‘నా స్నేహితుడు ఒకాయన సంక్రాంతికి పక్క రాష్ట్రానికి వెళ్లారు. అక్కడ ఆయనకు తోటలు, ఇళ్లు ఉన్నాయి. వెళ్లొచ్చాక నాకు ఫోన్‌ చేశారు. అక్కడ నాలుగు రోజులు ఉంటే కరెంట్‌ లేదు.. నీళ్లు లేవు.. రహదారులు ధ్వంసమై ఉన్నాయి. అన్యాయంగా, అధ్వానంగా ఉంది.. తిరిగి వచ్చాకే ఊపిరి పీల్చుకున్నట్లు ఉంది. దయచేసి మనవాళ్లందర్నీ అక్కడికి ఒకసారి పంపండి.. అప్పుడే మన విలువ ఏంటో.. మన ప్రభుత్వం చేస్తున్నదేంటో తెలిసి వస్తుందన్నారు. నేను చెబుతున్నది అతిశయోక్తి అనిపిస్తే, సొంత డబ్బా కొట్టుకోవడానికి ఎక్కువ చెబుతున్నా అనుకుంటే.. కారు తీసుకుని పక్క రాష్ట్రానికి వెళ్లి రండి. కొన్ని మాటలు కొందరికి నచ్చకపోవచ్చు కానీ ఇవి వాస్తవాలు’ అని కేటీఆర్‌ అన్నారు. బెంగళూరు నుంచి కూడా తనకు ఫోన్లు వస్తుంటాయని.. విమానాశ్రయం నుంచి గమ్యస్థానం చేరడానికి ఎన్ని గంటలు పడుతుందో చెప్పలేమని, హైదరాబాద్‌లో అరగంటలోనే వెళ్లిపోగలుగుతున్నామని చెబుతుంటారని వివరించారు. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా మౌలిక వసతుల కల్పనలో దేశంలోనే హైదరాబాద్‌ అత్యుత్తమ నగరమని స్పష్టం చేశారు. కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని నగరాల్లో భవనాలు కట్టాలంటే ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి చదరపు అడుగుకు ఇంత అని లంచమివ్వాలన్నారు. మన రాష్ట్రంలో లంచం ఇచ్చి అనుమతి తీసుకునే పరిస్థితి లేదని.. ఎంతో పారదర్శకంగా, ప్రగతిశీలంగా ముందుకెళుతున్నామని కేటీఆర్‌ చెప్పారు. ఈ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి, అమర్‌నాథ్‌, రోజా తదితరులు వెంటనే స్పందించారు.

హైదరాబాద్‌లోనూ జనరేటర్‌ వాడాను: బొత్స
‘హైదరాబాద్‌లోనూ కరెంటు లేదు. అక్కడ జనరేటర్‌ వాడాల్సి వచ్చింది. ఇది నా స్వీయానుభవం’ అని పేర్కొన్నారు. ‘కేటీఆర్‌కు ఆయన స్నేహితుడు ఫోన్‌లో ఏదో చెప్పి ఉండొచ్చు. కానీ నేను స్వయంగా హైదరాబాద్‌లో ఉండి వస్తున్నా. అక్కడ కరెంటే లేదు. జనరేటర్‌ వినియోగించాం. ఆ పరిస్థితి నేను అనుభవించాను కాబట్టి చెబుతున్నా. మరి దీనికి కేటీఆర్‌ ఏం సమాధానం చెబుతారు? కేటీఆర్‌ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నా’ అని మంత్రి బొత్స అన్నారు.

"ఏపీలో ఉన్నదే కేటీఆర్‌ చెప్పారు" : ఆంధ్రప్రదేశ్‌ గురించి ఉన్న నిజాన్నే మంత్రి కేటీఆర్‌ చెప్పారని తెలంగాణ మంత్రి ప్రశాంత్‌రెడ్డి విలేకర్లతో అన్నారు. ‘ఆంధ్రప్రదేశ్‌లోని పరిస్థితులపై ఒక స్నేహితుడన్న వ్యాఖ్యలను కేటీఆర్‌ ప్రస్తావించారు. దీనిపై అక్కడి మంత్రి బొత్స సత్యనారాయణ హైదరాబాద్‌లో కరెంటు పోతే జనరేటర్‌ వేసుకోవాల్సి వచ్చిందని చెప్పడం పచ్చి అబద్ధం. విజయవాడ నుంచి స్థిరాస్తి వ్యాపారులంతా తెలంగాణకు వస్తున్నది అక్కడి మంత్రులకు కనిపించడం లేదా?’ అని అన్నారు.

"బొత్స కరెంటు బిల్లు కట్టలేదేమో" : తెలంగాణ బాగా అభివృద్ధి చెందుతోందని, ఈ రాష్ట్రంతో పోల్చి అక్కడి (ఏపీ) వారు ఏమైనా అంటారేమోనని భయపడి ఏపీ మంత్రులు వ్యాఖ్యలు చేస్తున్నారని తెలంగాణ ఎంపీ రంజిత్‌రెడ్డి విమర్శించారు. ఆ రాష్ట్రంలోని పరిస్థితులపై మంత్రి కేటీఆర్‌ మాట్లాడితే ఎందుకంత ఉలిక్కిపడుతున్నారన్నారు. ‘కేటీఆర్‌ వ్యాఖ్యల్లో తప్పు లేదు. బొత్స సత్యనారాయణ కరెంటు బిల్లు కట్టలేదేమో! అందుకే కట్‌ చేసి ఉంటారు. జగన్‌ సహా వైకాపా నాయకులు, వారి కుటుంబాలు మొత్తం ఇక్కడే ఉంటున్నాయి. వారినడిగితే వాస్తవాలు చెబుతారు. కేసీఆర్‌ పాలన బాగుంది.. అందరమూ ఆయన అభిమానులమని వైకాపా ఎంపీలు నాతో చెప్పారు’ అని ఎంపీ అన్నారు.

కాంక్రీట్‌ నిర్మాణాలుంటేనే అభివృద్ధా?: సజ్జల
కాంక్రీట్‌ నిర్మాణాలుంటేనే అభివృద్ధిగా పరిగణిస్తే.. హైదరాబాద్‌ ఉమ్మడి రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సామాజిక అభివృద్ధిని కొలమానంగా తీసుకుంటే దేశంలో ఏ రాష్ట్రంతో పోల్చినా ఆంధ్రప్రదేశ్‌ చాలా చాలా ముందుందన్నారు. తెలంగాణ మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలపై సజ్జల స్పందించారు.

ఓట్ల కోసమే అలా మాట్లాడారు: మంత్రి పెద్దిరెడ్డి
‘త్వరలో తెలంగాణలో ఎన్నికలు వస్తున్నాయి. ఓట్లు పడతాయన్న ఉద్దేశంతోనే తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఏపీపై వేలెత్తి చూపిస్తున్నారు. పొరుగు రాష్ట్రంలో రహదారులు బాగాలేవు.. నీరు, కరెంటు సమస్యలు ఉన్నాయంటూ వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే అలా మాట్లాడి ఉంటారేమో’.. అని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం అనంతపురంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ కరెంటు కష్టాలు ఉన్నాయి. తెలంగాణలో బొగ్గు ఎక్కువగా ఉన్నందునే విద్యుత్తు కొరత లేదు. మన రాష్ట్రంలోనూ ఎక్కడా కోతలు లేవు. ప్రజలకు 24 గంటలూ ఇస్తున్నాం. కేవలం పరిశ్రమలకు కొంత సమయం ఆపేస్తున్నాం. 10 వేల కిలోమీటర్లు పంచాయతీరాజ్‌ రహదారులు వేశాం. రహదారులు తెలంగాణలోనూ వేయలేదన్న విషయాన్ని గుర్తించాలి’ అని మంత్రి వివరించారు.

కేటీఆర్‌ మాట్లాడింది ఏపీపై కాదు: మంత్రి రోజా
ఆంధ్రప్రదేశ్‌ గురించి కేటీఆర్‌ ఎక్కడా మాట్లాడలేదని పర్యాటక మంత్రి ఆర్కే రోజా అన్నారు. పొరుగు రాష్ట్రాలు అని ప్రస్తావించారే కానీ.. ఏపీ ప్రస్తావన ఎక్కడా తీసుకురాలేదని చెప్పారు. ఏపీ గురించే కేటీఆర్‌ మాట్లాడి ఉంటే ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నానన్నారు. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కుటుంబసమేతంగా కలిసిన అనంతరం రోజా ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మంత్రిగా కేటీఆర్‌ను సాదరంగా ఏపీకి ఆహ్వానిస్తున్నా. జగన్‌ తీసుకొచ్చిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను, విప్లవాత్మక మార్పులను ఆయనకు దగ్గరుండి చూపిస్తాను. అవన్నీ చూశాక తెలంగాణలోనూ ఇటువంటి విప్లవాత్మక సంక్షేమ పథకాలను అమలు చేయాలనుకుంటారు’ అని రోజా చెప్పారు.

ఏపీ అభివృద్ధిని కేటీఆర్‌ కళ్లారా చూసి మాట్లాడాలి: మంత్రి దాడిశెట్టి రాజా
కేటీఆర్‌ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని కళ్లారా చూడాలని రహదారులు, భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా) అన్నారు. కేటీఆర్‌ రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రి జగన్‌ చేస్తున్న సంక్షేమంతోపాటు అభివృద్ధి పనులు కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయన్నారు. ఎవరో స్నేహితుడు చెప్పాడని మా రాష్ట్రం గురించి, తప్పుగా మాట్లాడి తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టవద్దని సూచించారు. హైదరాబాద్‌ మీరు కానీ, కేసీఆర్‌ కానీ అభివృద్ధి చేయలేదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే అభివృద్ధి జరిగిందన్నారు. వర్షాలొస్తే ఎప్పుడు మునిగిపోతుందోనని హైదరాబాద్‌ ప్రజలు ఆందోళన చెందుతున్నారని, ముందు ఆ సమస్యపై దృష్టిసారించాలని కేటీఆర్‌కు హితవు పలికారు.

ఆర్థిక ఇబ్బందులున్నా.. రహదారుల అభివృద్ధి: మంత్రి విశ్వరూప్‌
తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెంది, మిగులు బడ్జెట్‌తో ఉందని.. ఆంధ్రప్రదేశ్‌ లోటు బడ్జెట్‌, కరోనాతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని రవాణాశాఖ మంత్రి పినిపె విశ్వరూప్‌ అన్నారు. సంక్రాంతికి ముందు వరకు ఏపీలో రహదారులు బాగోలేదన్నారు. అప్పటి నుంచి రోడ్ల నిర్మాణాలు, మరమ్మతులు జరుగుతున్నాయని చెప్పారు.

వాపును చూసి బలుపు అనుకుంటున్నారేమో: ఐటీ శాఖ మంత్రి అమర్‌నాథ్‌
ఒక నగరాన్ని చూసుకొని వాపును చూసి బలుపనుకుంటే ఏం సమాధానం చెప్పలేమని ఆంధ్రప్రదేశ్‌ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. రాష్ట్రమంటే ఒక నగరం కాదనే విషయాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ గమనించాలన్నారు. ఒక నగరాన్ని చూసి రాష్ట్రమంతా బ్రహ్మాండంగా ఉందనే అపోహలో ఆయన ఉంటే ఆయనను, ఆ రాష్ట్ర ప్రజలను దేవుడే కాపాడాలన్నారు. రాష్ట్రం బాగుండటం అంటే అందులోని నగరమో.. ఆ ప్రభుత్వంలోని పెద్దలు బాగుండటమో కాదన్నారు. ఆ రాష్ట్రంలోని పేదలు బాగున్నారా లేదో చూడాలని వ్యాఖ్యానించారు. దిల్లీలోని ఏపీ భవన్‌లో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. వేదికపై ఉన్న పెద్ద మనుషులను నవ్వించడానికో, పక్కవాళ్లను కించపర్చుతూ తాము గొప్పవాళ్లమని అనిపించుకోవడానికో అలా మాట్లాడడం సమంజసం కాదన్నారు. ఏ రాష్ట్రమైనా, మాట్లాడిన ఏ నాయకుడైనా, వ్యక్తులైనా జగన్‌తో పోటీపడగలరా అని అమర్‌నాథ్‌ ప్రశ్నించారు.

రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు: లోకేశ్‌
ఒక్క అవకాశం అని అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ను సర్వనాశనం చేశారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. ఏపీలో విద్యుత్తు కోతలు ఎక్కువగా ఉన్నాయని, నీటి సౌకర్యం లేదని, రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని ఏపీకి వెళ్లొచ్చిన తన స్నేహితుడు చెప్పాడని కేటీఆర్‌ పేర్కొన్న వీడియోను ఆయన ట్వీట్‌కు జత చేశారు.

చేతకాని ప్రభుత్వం ఏం జవాబిస్తుంది?

చేతకాని జగన్‌ ప్రభుత్వం తెలంగాణ మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలకు ఏం సమాధానం చెబుతుంది? ఏపీ వాస్తవ పరిస్థితులనే కేటీఆర్‌ చెప్పారు. ఏపీలో భూముల ధరలు గణనీయంగా పడిపోతే.. తెలంగాణలో పెరిగాయి. జగన్‌ పాలనలో ఏపీలో శాంతిభద్రతలు క్షీణించడం, అభివృద్ధి లేకపోవడంతో అందరూ తెలంగాణ సురక్షితమని భావిస్తున్నారు. - ట్విటర్‌లో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

కేటీఆర్‌ వ్యాఖ్యలకు సిగ్గుపడాలి :

జగన్‌, కేటీఆర్‌లు అన్నదమ్ముల్లాంటివారు. అన్న పాలన గురించి తమ్ముడు చేసిన వ్యాఖ్యలకు వైకాపా నేతలు సిగ్గుపడాలి. - నక్కా ఆనంద్‌బాబు, మాజీ మంత్రి

జగన్‌ సమాధానం చెప్పాలి :

ఆంధ్రప్రదేశ్‌లో పాలనను కించపరుస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఆ రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావులు చేస్తున్న వ్యాఖ్యలకు సీఎం జగన్‌ సమాధానం చెప్పాలి. ఏపీలో అభివృద్ధి నిల్‌.. కరెంట్‌ కోతలు, అవినీతి ఫుల్‌ అని కేటీఆర్‌ అన్న మాటలు ముమ్మాటికీ వాస్తవం. - తెదేపా ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి

రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నదే కేటీఆర్‌ చెప్పారు: రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి జగన్‌ పాలన తీరు పట్ల అనుకుంటున్నదే తెలంగాణ మంత్రి కేటీఆర్‌ చెప్పారని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాల కోటయ్య పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యల పట్ల సీఎం జగన్‌ సిగ్గుపడాలన్నారు.

నా వ్యాఖ్యల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదు: తాను ఈ రోజు ఇక్కడ క్రెడాయ్‌ సమావేశంలో అన్యాపదేశంగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్‌లోని నా స్నేహితులకు తెలియకుండానే కొంత బాధ కలిగించి ఉండొచ్చని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని, ఎవరినో బాధ పెట్టాలనో, కించపరచాలనో అలా మాట్లాడలేదని వివరించారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో ట్వీట్‌ చేశారు. ‘‘నేను ఏపీ సీఎం జగన్‌ను సోదర సమానుడిగా భావిస్తున్నా. ఆయన నాయకత్వంలో ఆ రాష్ట్రం అభివృద్ధిచెందాలని మనసారా కోరుకుంటున్నా’’ అని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి: Roja meets KCR: తెలంగాణ సీఎం కేసీఆర్​తో మంత్రి రోజా భేటీ

Last Updated : Apr 30, 2022, 6:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.