ETV Bharat / city

Minister KTR : 'విమర్శలు చేయడం సులభం.. సేవ చేయడమే కష్టం'

author img

By

Published : Nov 8, 2021, 1:45 PM IST

telangana-minister-ktr-and-bollywood-actor-sonu-sood-felicitated-covid-warriors-in-hyderabad-2021
'విమర్శలు చేయడం సులభం.. సేవ చేయడమే కష్టం'

సోషల్ మీడియాలో విమర్శలు చేయడం చాలా సులభమని కానీ.. బాధ్యతగా సేవ చేయడం చాలా కష్టమని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్(Telangana minister KTR) ఉద్ఘాటించారు. అలా సేవచేయాలంటే ఎంతో గొప్ప మనసుండాలని ఆ గొప్పమనసు వల్లే సోనూసూద్(Bollywood actor Sonu sood) ఎంతో మందికి సాయం చేశారని అన్నారు. ఆయన సేవ చేయడమే గాక.. తన బాటలో ఎంతో మందిని నడిపించారని చెప్పారు. కొవిడ్ కష్టకాలంలో ప్రభుత్వానికి చేయూతగా.. బాధితులకు అండగా నిలిచి నిస్వార్థంగా సేవలందించిన సంస్థలను అభినందించారు. వారి సేవలను కొనియాడారు.

'విమర్శలు చేయడం సులభం.. సేవ చేయడమే కష్టం'

కరోనా మహమ్మారి విలయతాండవం సృష్టించిన సమయంలో.. ప్రజలకు, కరోనా రోగులకు వారి కుటుంబాలకు అండగా నిలిచిన వారియర్స్​ను తెలంగాణ సర్కార్ సత్కరించింది. హైదరాబాద్​ హెచ్​ఐసీసీలో తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ ఆధ్వర్యంలో కరోనా వారియర్లకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరైన రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్(Telangana Minister KTR), బాలీవుడ్ నటుడు సోనూ సూద్(Bollywood actor sonu sood), తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల కార్యదర్శి జయేశ్ రంజన్ కొవిడ్ వారియర్లను పురస్కారాలతో సన్మానించారు.

కేటీఆర్​ లాంటి నేతలుంటే.. తనలాంటి వాళ్ల అవసరం ఉండదని బాలీవుడ్ నటుడు సోనూసూద్(Bollywood actor sonu sood) అన్నారు. కరోనా సమయంలో జమ్మూ నుంచి కన్యాకుమారి వరకు సేవా కార్యక్రమాలు చేశానన్న సోనూ.. తెలంగాణ నుంచి మాత్రమే ప్రతిస్పందించే వ్యవస్థ కనిపించిందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం కొవిడ్ సమయంలో బాధితులు, వారి కుటుంబాలకు అండగా నిలిచిందని తెలిపారు. అందువల్లే రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తక్కువగా ఉందన్నారు. ఆ మహమ్మారి నుంచి రాష్ట్రం, ప్రజలు త్వరగా కోలుకున్నారంటే అది కేటీఆర్ లాంటి సమర్థ నాయకులు తెలంగాణలో ఉండటం వల్లేనని సోనూసూద్(Bollywood actor sonu sood) అభిప్రాయపడ్డారు.

"కొవిడ్ వల్ల ఎంతో మంది ఉద్యోగాలు, ఆత్మీయులను కోల్పోయారు. బాధితులకు సహాయపడటమే మన ముందున్న సవాలు. కరోనా మొదటి, రెండు దశలు సృష్టించిన విలయం నుంచి బయటపడటమే ప్రస్తుతం మన ముందున్న ఛాలెంజ్. కొవిడ్ సమయంలో నేను చాలా మందికి సాయం చేశాను. ఆ టైంలో చాలా మంది నన్ను నిరుత్సాహపరిచారు. ఏదో కారణంతో నేను ఆ పనిచేస్తున్నానని అన్నారు. ఎవరైనా మంచి పని చేసేటప్పుడు.. ఆపడానికి చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. కానీ మీరు వాళ్లకి భయపడి ఆ పని ఆపొద్దు. మీ సాయం కోసం ఎదురుచూసే వాళ్లు ఎంతో మంది ఉంటారు. వాళ్లకి సాయం చేయడమే మీ జీవితపరమార్థం అవ్వొచ్చు. అందుకే ఎవరికైనా సాయం చేసేటప్పుడు.. ఎన్ని అడ్డంకులొచ్చినా ఎంత మంది నిరుత్సాహపరిచినా వెనకడుగువేయొద్దు."

- సోనూసూద్, బాలీవుడ్ నటుడు

సామాజిక మాధ్యమాల్లో విమర్శ చేయడం చాలా సులభం కానీ.. బాధ్యతగా సేవ చేయడమే గొప్ప అని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఉద్ఘాటించారు. కరోనా కాలంలో సోనూసూద్ సేవ చేస్తుంటే బెదిరించాలని చూశారని.. ఆయన ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ, ఈడీ సోదాలు జరిపారని అన్నారు. సోనూ వ్యక్తిత్వాన్ని తగ్గించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. సోనూసూద్ రియల్ హీరో అని.. ఆయన భయపడాల్సిన పనిలేదన్న కేటీఆర్.. సోనూ వెంట తెలంగాణ ప్రజలున్నారని చెప్పారు. కరోనా సమయంలో.. సేవలు చేసిన సంస్థలకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. విపత్తు సమయాల్లో ప్రభుత్వమే అన్ని పనులు చేయాలన్న నియమం లేదని.. ఇలాంటి సంస్థలు మంచి చేయడానికి ముందుకొస్తే సర్కార్ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. కొవిడ్ మహమ్మారి విలయతాండవం చేసిన కాలంలో.. ముందుండి నిస్వార్థంగా సేవలందించిన సంస్థలు, సమాజసేవలకు కేటీఆర్ సలాం చేశారు.

"కొవిడ్ కష్టకాలంలో ఎటువంటి స్వార్ధం లేకుండా మానవవత్వంతో సోనూసూద్ సేవాభావం చాటుకున్నారు. తన పని, సేవతో ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. తనతో పాటు సేవామార్గంలో ఎంతో మందిని నడిపించారు. ఆయణ్ను చూసి ఎంతో మంది యువత స్ఫూర్తి పొందారు. ఆయన ద్వారా సాయం పొందిన వారంతా ఓ సైన్యంలా ఏర్పడి.. ఇతరులకు సాయం చేయడం ప్రారంభించారు. సోనూ తన సేవలను దేశమంతా విస్తరించారు."

- కేటీఆర్, తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.