ETV Bharat / city

పేదోడికి మళ్లీ పట్టెడన్నం.. అన్నక్యాంటీన్లు తిరిగి తెరుస్తున్న తెదేపా నేతలు

author img

By

Published : Jul 31, 2022, 4:43 AM IST

Updated : Jul 31, 2022, 6:15 AM IST

పేదలకు పట్టెడన్నం పెట్టలేని ప్రభుత్వాలు ఎందుకని నిలదీసిన ఎన్టీఆర్ స్ఫూర్తితో అన్న క్యాంటీన్ల నిర్వహణను తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో విజయవంతంగా నిర్వహించిన వీటిని.. అధికారంలోకి రాగానే వైకాపా సర్కారు మూసేసింది. ప్రభుత్వం పేదవాడి నోటి దగ్గర కూడు లాగేసినా.. మేమున్నామంటూ తెలుగుదేశం నేతలు ముందుకొచ్చారు. స్థానిక నేతలు, ప్రవాసాంధ్రుల చొరవతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పార్టీ తరపున అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. అధికార పార్టీ నాయకులు, అధికారుల అడ్డంకుల్ని అధిగమిస్తూ పేదోడికి పట్టెడన్నం పెడుతున్నారు.

ప్రభుత్వం మూసేసినా తిరిగి తెరుస్తున్న తెదేపా నేతలు
ప్రభుత్వం మూసేసినా తిరిగి తెరుస్తున్న తెదేపా నేతలు

పేదోడికి మళ్లీ పట్టెడన్నం

నిరుపేదలు, అత్యంత అట్టడుగు స్థాయి ప్రజలకు మూడుపూటలా ఆకలి తీర్చేందుకు గత ప్రభుత్వం అన్నక్యాంటీన్లను అందుబాటులోకి తెచ్చింది. వివిధ రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న క్యాంటీన్ల తీరుతెన్నుల్ని పరిశీలించాక రాష్ట్రంలో అన్నక్యాంటీన్లు ప్రారంభించింది. 2018-19లో 200 కోట్లు ఖర్చుచేసింది. 2019-20 బడ్జెట్‌లో 300 కోట్లు కేటాయించింది. ఒక్కో అన్నక్యాంటీన్‌కు 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 40 లక్షలతో భవనాలు నిర్మించింది. 2019 ఎన్నికల నాటికి...మొత్తం గ్రామాలు, పట్టణాల్లో 368 క్యాంటీన్లు మంజూరవగా, వాటిలో 249 క్యాంటీన్లు అప్పటికే పేదల ఆకలి తీరుస్తున్నాయి. వీటిలో రోజుకు రెండున్నర లక్షల మందికిపైగా భోజనం చేసేవారు. వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నక్యాంటీన్లను మూసేసి...పేదోడిని పస్తుల పాలుజేసింది.

తిరిగి క్యాంటీన్లను వైకాపా ప్రభుత్వం తెరవదని నిర్ధారణకు వచ్చి తొలి క్యాంటీన్‌ని తెలుగుదేశం నాయకులు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చొరవతో 2019 ఆగస్టు 1న అన్నక్యాంటీన్‌ ప్రారంభమైంది. కొవిడ్‌ ఉద్ధృతంగా ఉన్నప్పుడు, లాక్‌డౌన్‌ సమయంలో కొన్నిరోజులు నిలిచిపోయినా.. ఆ తర్వాత మళ్లీ అన్నార్తుల ఆకలి తీరుస్తోంది. 588 రోజులుగా ఈ క్యాంటీన్‌లో పేదలకు ఉచితంగా భోజనం పెడుతూనే ఉన్నారు.

గుంటూరు జిల్లా మంగళగిరిలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ నేతృత్వంలో అన్నక్యాంటీన్‌ను ప్రారంభించారు. అయితే క్యాంటీన్‌కు అనుమతి లేదంటూ రాత్రికి రాత్రే టెంట్లు కూల్చేశారు. తిరిగి తర్వాత రోజే తెలుగుదేశం నేతలు మళ్లీ క్యాంటీన్‌ను ఏర్పాటుచేశారు. మళ్లీ అనుమతులు లేవంటూ అధికారులు తొలగించేశారు. పట్టువదలని తెలుగుదేశం నేతలు కూల్చేసిన ప్రాంతంలోనే టెంట్లు వేసి మళ్లీ ప్రజలకు ఆకలి తీరుస్తున్నారు.

విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ దాతల సహకారంతో నియోజకవర్గంలో క్యాంటీన్లను తిరిగి ప్రారంభించారు. NTR శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆ మహానేత అభిమానులైన ప్రవాసాంధ్రులు ఉయ్యాల శ్రీనివాస్, జొన్నలగడ్డ వినయ్, వారి మిత్రబృందం ఆర్థిక సాయంతో....గుంటూరు స్వర్ణభారతినగర్‌, పాత బస్టాండు ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌ కూడలిలో మే 27 నుంచి అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. ఒక్కో క్యాంటీన్‌లో రోజుకు 500 మందికి 2రూపాయలకే భోజనం అందిస్తున్నారు. రాజమహేంద్రవరం క్వారీ మార్కెట్‌ సెంటర్‌లో అన్న క్యాంటీన్‌ను మూసేసిన ప్రాంతంలోనే.. తెలుగుదేశం నగరశాఖ ఆధ్వర్యంలో తిరిగి ప్రారంభించారు. రోజుకు సగటున 150 మందికి 5రూపాయలకే భోజనం పెడుతున్నారు. 15 మంది వరకు పార్టీ ముఖ్య నేతలు ప్రతి నెలా విరాళాలు ఇస్తున్నారు. ఇంకా ఎక్కువ ఖర్చైతే... ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని కుటుంబం భరిస్తోంది.

చిత్తూరు జిల్లా కుప్పంలో ఎన్టీఆర్‌ ట్రస్టు, తెలుగుదేశం ఆధ్వర్యంలో జూన్‌ 5 నుంచి అన్న క్యాంటీన్‌ ప్రారంభమైంది. అక్కడ రోజుకు 400 నుంచి 500 మందికి ఉచితంగా భోజనం పెడుతున్నారు. అమెరికాలోని ఎన్టీఆర్, బాలకృష్ణ అభిమానుల సహకారంతో శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో మే 28న అన్న క్యాంటీన్‌ను ఏర్పాటు చేశారు. రోజుకు 400 మంది పేదలకు భోజనం పెట్టేందుకు 18 వేల వరకు ఖర్చవుతోందని నిర్వాహకులు తెలిపారు.విజయనగరం జిల్లా బొబ్బిలిలో నియోజకవర్గ తెలుగుదేశం ఇన్‌ఛార్జి బేబీనాయన ఆధ్వర్యంలో జూన్‌ 24న అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు.

ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో, మైలవరంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో 2 వారాలుగా అన్న క్యాంటీన్‌ను నిర్వహిస్తున్నారు. రోజుకి 300 నుంచి 400 మంది ఆకలి తీరుస్తున్నారు. జగ్గయ్యపేటలో మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య ఆధ్వర్యంలో, అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి నేతృత్వంలో, తిరుపతి జిల్లా వెంకటగిరిలో మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సహకారంతో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 14 చోట్ల తిరిగి అన్నక్యాంటీన్లను తెలుగుదేశం నేతలు తిరిగి ప్రారంభించారు. త్వరలోనే మరిన్ని చోట్ల క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని.. 2024లో తెలుగుదేశం అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని క్యాంటీన్లను తిరిగి తెరుస్తామని స్పష్టంచేస్తున్నారు.

ఇవీ చూడండి

Last Updated : Jul 31, 2022, 6:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.