ETV Bharat / city

అన్న క్యాంటీన్ల మూసివేతను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా తెదేపా వంటావార్పు

author img

By

Published : Feb 24, 2020, 9:16 PM IST

Updated : Feb 24, 2020, 10:00 PM IST

vanta varpu programme at whole state for against the closing of anna canteens
అన్న క్యాంటిన్ల మూసివేతను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన వంటావార్పు కార్యక్రమం

అన్న క్యాంటీన్లు మూసివేసి ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు పునఃప్రారంభించకపోవటాన్ని నిరసిస్తూ తెదేపా రాష్ట్రవ్యాప్తంగా వంటావార్పు కార్యక్రమాన్ని చేపట్టింది. క్యాంటీన్లు ఏర్పాటు చేసినచోట, ప్రధాన కూడళ్లలో ఆ పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమం నిర్వహించాయి.

అన్న క్యాంటీన్ల మూసివేతను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా తెదేపా వంటావార్పు

రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా వంటావార్పు కార్యక్రమం నిర్వహించింది. అన్న క్యాంటీన్ల మూసివేతను నిరసిస్తూ తెదేపా శ్రేణులు ఈ నిరసను దిగాయి. విజయవాడ రాణిగారితోటలోని అన్న క్యాంటీన్​ వద్ద గద్దె రామ్మోహన్​ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. అల్పాహారం, భోజనం అందిస్తున్న క్యాంటీన్లను మూసివేయడం అన్యాయమని నాయకులు మండిపడ్డారు.సెంట్రల్ నియోజకవర్గంలో మూసివేసిన అన్న క్యాంటీన్ల వద్ద మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరావు ఆధ్వర్యంలో వంటావార్పు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 203 అన్న క్యాంటీన్ల వద్ద ధర్నాలు చేసినట్లు తెదేపా రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు అన్నారు.

విజయనగరం జిల్లా సాలూరులో ప్రజాచైతన్య యాత్రను ప్రారంభించారు. వైకాపా తొమ్మిది నెలల పాలనలో అభివృద్ధి శూన్యమని తెదేపా శ్రేణులు దుయ్యబట్టాయి.

విశాఖలోనూ మూతబడిన అన్న క్యాంటీన్ల వద్ద వంటావార్పు నిర్వహించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదవాడి కడుపు మీద కొట్టిందని ఎమ్మెల్యే వెలగపూడి ఆవేదన వ్యక్తం చేశారు.

చిత్తూరు జిల్లా మదనపల్లెలో అన్న క్యాంటీన్​ వద్ద వంటచేసి పేద ప్రజలకు వడ్డించారు. వైకాపా పేదవాడి కడుపుపై కొట్టిందని తేదేపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తూర్పుగోదావరి జిల్లాలోను అన్నక్యాంటీన్ల వద్ద నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెదేపా నాయకులు నినదించారు. క్యాంటీన్లను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ వంటావార్పు ఏర్పాటు చేశారు.

నెల్లూరు జిల్లావ్యాప్తంగా తేదేపా శ్రేణులు అన్న క్యాంటీన్ల ముందు వంటలు చేశారు. పేదల ఆకలి తీర్చే క్యాంటీన్లు మూసివేసి వైకాపా దౌర్జన్యం చేస్తోందని నాయకులు మండిపడ్డారు.

కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు, నంద్యాలలో అన్న క్యాంటీన్లు వెంటనే తెరవాలని డిమాండ్ చేస్తూ క్యాంటీన్ల ఎదుట వంటవార్పు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు.

గుంటూరు జిల్లాలో ప్రజాచైతన్యయాత్రలో భాగంగా అన్నక్యాంటీన్ ఎదుట వంటావార్పు నిర్వహించారు. జేఏసీ అధ్యక్షుడు చెదలవాడ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అతి తక్కువ ధరలో పేదల ఆకలితీర్చే క్యాంటీన్లను మూసివేసి ఏం సాధించారని ప్రశ్నించారు.

కడప జిల్లా జమ్మలమడుగు, రాజంపేటలో మూసివేసిన క్యాంటీన్ల ఎదుట వంటలు చేశారు. పేదలకు పట్టెడన్నం పెట్టే అన్న క్యాంటీన్లను మూసివేయడం చాలా దారుణమని తెదేపా నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లపైనే పేదలకు ఆహారాన్ని వడ్డించారు.

అనంతపురం జిల్లాలో అన్న క్యాంటీన్లు వెంటనే తెరవాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపైనే వంటవార్పు కార్యక్రమం చేపట్టారు. పుట్టపర్తి, హిందూపురంలోనూ నిరసనలు హోరెత్తాయి.

ఇదీ చూడండి సీఏఏ నిరసనల్లో మళ్లీ హింస- హెడ్​ కానిస్టేబుల్​ మృతి

Last Updated :Feb 24, 2020, 10:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.