తెలంగాణలో డెంగీ విజృంభణ.. ఏజెన్సీని వణికిస్తున్న మలేరియా

author img

By

Published : Jul 31, 2022, 10:45 AM IST

seasonal fevers

తెలంగాణలో డెంగీ విజృంభిస్తోంది. హైదరాబాద్​ సహా 9 జిల్లాల్లో విష జర్వాలు పంజా విసురుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాలను మలేరియా వణికిస్తోంది. ప్రధానంగా హైదరాబాద్‌పై 'ఏడిస్‌ ఈజిప్టి' దోమ విరుచుకుపడుతోంది. గతేడాది జులై 20 వరకూ హైదరాబాద్‌లో 140 డెంగీ కేసులు నమోదవ్వగా.. ఈ ఏడాదిలో అదేరోజుకు రాజధానిలో 696 కేసులున్నట్లు నిర్ధారణ కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

తెలంగాణలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా డెంగీ కోరలు చాస్తోంది. ప్రధానంగా హైదరాబాద్‌పై 'ఏడిస్‌ ఈజిప్టి' దోమ విరుచుకుపడుతోంది. గతేడాది జులై 20 వరకూ హైదరాబాద్‌లో 140 డెంగీ కేసులు నమోదవ్వగా.. ఈ ఏడాదిలో అదేరోజుకు రాజధానిలో 696 కేసులున్నట్లు నిర్ధారణ కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రాష్ట్రం మొత్తమ్మీద నమోదైన డెంగీ కేసుల్లో 66 శాతం హైదరాబాద్‌లోనివే. గతేడాది జులై 20 నాటికి రాష్ట్రంలో 356 కేసులు నిర్ధారణ కాగా.. ఈ ఏడాదిలో ఇదే తేదీనాటికి మొత్తంగా 1,501 మంది డెంగీ బాధితులను గుర్తించడం గమనార్హం. ప్రస్తుతం రంగారెడ్డి(144), కరీంనగర్‌(90), మేడ్చల్‌ మల్కాజిగిరి(76), ఆదిలాబాద్‌(62), మహబూబ్‌నగర్‌(57), పెద్దపల్లి(43), ఖమ్మం(36), వికారాబాద్‌(24) తదితర జిల్లాల్లో అధిక సంఖ్యలో డెంగీ కేసులు నమోదవుతున్నాయి. గత 7 వారాలుగా కేసుల సంఖ్య పెరిగినట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి మే31 వరకు 397 మంది డెంగీకి చికిత్స పొందగా.. జూన్‌లో 565 మంది.. ఈనెల(జులై)లో 20నాటికి మరో 539 మంది.. 7 వారాల వ్యవధిలో 1,104 మంది డెంగీ కోరల్లో చిక్కుకున్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

మలేరియాతో పాట్లు: భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాలను మలేరియా వణికిస్తోంది. ఈ ఏడాదిలో జులై 20 వరకూ 252 మలేరియా కేసులు నమోదయ్యాయి. ఇందులో మే నెలలో 69, జూన్‌లో 30, ఈ నెలలో 20వతేదీ నాటికి 51 మంది చొప్పున దీని బారినపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెంలో ఈ ఏడాదిలో ఇప్పటివరకూ 138 మందికి మలేరియా సోకగా.. ములుగులో 51 మందికి నిర్ధారణ అయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గనిర్దేశాల ప్రకారం.. అధికారికంగా ఒక కేసును గుర్తిస్తే.. గుర్తింపునకు నోచుకోకుండా సమాజంలో పదింతలు ఎక్కువ కేసులున్నట్లు భావించాలని నిపుణులు చెబుతున్నారు.

ఆసుపత్రుల కిటకిట: రాష్ట్ర వ్యాప్తంగా ఆసుపత్రులు జ్వరపీడితులతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్‌లోని ఫీవర్‌ ఆసుపత్రికి రోజూ 600-800 మంది వస్తున్నారు. తరచూ వర్షాలు కురవడం, పారిశుద్ధ్య నిర్వహణలోపం వల్ల దోమలు ప్రబలడానికి కారణమని, పట్టణాలు, పల్లెల్లో విషజ్వరాలతో బాధపడుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని వైద్యవర్గాలు అంచనా వేస్తున్నాయి. సాధారణంగా ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో అత్యధిక జ్వరాలు నమోదవుతాయని వైద్యవర్గాలే చెబుతున్నాయి. రానున్న నెలల్లో డెంగీ, మలేరియా కేసులు అధికంగా నమోదయ్యే అవకాశాలున్నాయి. 2019లో వలె ఈఏడాదీ డెంగీ కేసులు విజృంభించినట్లు వైద్యఆరోగ్యశాఖే చెబుతోంది. 2019లో 13,361 కేసులు నమోదు కాగా.. ఏడుగురు డెంగీతో చనిపోయినట్లుగా వైద్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. రానున్నది వ్యాధుల సీజన్‌ కావడంతో ఇప్పట్నుంచే నివారణ చర్యలపై దృష్టి పెట్టాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

నివారణ ఎలా ?: డెంగీ కారక ‘ఏడిస్‌ ఈజిప్టి’ దోమ అన్ని దోమల్లాంటిది కాదు. పగటిపూటే కుడుతుంది. మన ఇళ్లు, కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో నిల్వ ఉంచే మంచినీటిలోనే పుట్టి.. పునరుత్పత్తి చేస్తుంది. ఎయిర్‌ కూలర్లు, నిల్వ ఉంచిన డ్రమ్ములు, పాత టైర్లు, రేకు డబ్బాల్లో నిల్వ ఉండే నీటిలో ఈ దోమ వృద్ధి చెందుతుంది. అందుకే ఎక్కడ కొద్దిపాటి నీటి నిల్వలున్నా వాటి దృష్టిపెట్టాలి. మలేరియా దోమ అయితే మురుగునీటిలో వృద్ధి చెందుతుంది. అందుకే పరిసరాల్లో మురుగు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

"రాష్ట్రంలో గత కొన్ని వారాలుగా మలేరియా, డెంగీ జ్వరాల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా 9 జిల్లాల్లో డెంగీ, 2 జిల్లాల్లో మలేరియా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. రాష్ట్రం మొత్తమ్మీద నమోదైన కేసుల్లో 88% కేవలం హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లో నిర్ధారణ అవుతున్నాయి. మలేరియా మొత్తం కేసుల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే 73%, ములుగులో 27% కేసులు నమోదవుతున్నాయి. తీవ్రత అధికంగా ఉండే గ్రామాలను గుర్తించి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్తున్నాం. దోమల నిర్మూలనకూ, రక్షిత తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. 5లక్షల ర్యాపిడ్‌ కిట్లను అందుబాటులో ఉంచాం. ప్రజలు కూడా పరిసరాల ప్రాంతాల్లో దోమలు వృద్ధి చెందకుండా జాగ్రత్తలు పాటించాలి." -డాక్టర్‌ జి.శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకులు

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.