ETV Bharat / city

TS DALITHA BANDHU: '150 మంది దళితులు ఉంటే.. 8 మందినే ఎంపిక చేస్తారా?'

author img

By

Published : Aug 13, 2021, 8:24 PM IST

PROTEST FOR TS DALITHA BANDHU
తెలంగాణ దళితబంధు

తెలంగాణ రాష్ట్రం హుజూరాబాద్​ నియోజకవర్గంలో పైలెట్​ ప్రాజెక్టుగా చేపట్టిన 'దళితబంధు' పథకానికి ఆదిలోనే నిరసనలు ఎదురవుతున్నాయి. నియోజకవర్గంలోని కందుగుల గ్రామంలో కొంతమందిని మాత్రమే ఈ పథకానికి ఎంపిక చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్సీలు.. రోడ్డుపై ఆందోళనకు దిగారు.

హుజూరాబాద్​ నియోజకవర్గంలో దళితబంధు కోసం ఎస్సీల ధర్నా

తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న దళితబంధు పథకానికి ఆదిలోనే ఆటంకాలు, నిరసనలు ఎదురవుతున్నాయి. ఈ పథకాన్ని కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్​లో పైలెట్​ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. అయితే కందుగుల గ్రామంలో దళిత బంధు పథకంలో కొంతమందిని మాత్రమే ఎంపిక చేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈనెల 16న శాలపల్లిలో జరిగే సీఎం సభలో లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేయనున్నారని తెలిసి.. ఎంపిక కాని వారు నిరసనకు దిగారు.

హుజూరాబాద్​ మండలం కందుగుల గ్రామం నుంచి 8 మందిని మాత్రమే ఎంపిక చేయడంపై ఆ గ్రామంలోని ఎస్సీలు రగిలిపోతున్నారు. లబ్దిదారుల జాబితాతో దళితవాడకు వచ్చిన అధికారి నుంచి జాబితాను లాక్కొని చింపివేశారు. గ్రామంలో 150 మంది వరకు ఎస్సీలు ఉండగా కేవలం 8 మందిని మాత్రమే అర్హులుగా గుర్తించడమేమిటని తమ పేర్లు ఎందుకు చేర్చలేదని ధర్నాకు దిగారు. హుజూరాబాద్‌-పరకాల రహదారిపై ఎస్సీ కాలనీ వాసులు బైఠాయించటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పథకంలో తమ పేర్లు చేర్చాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. అటు వీణవంక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఎస్సీలు ఆందోళన చేశారు. దళితబంధు లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. అనర్హులను ఎంపిక చేశారని ఆరోపిస్తూ తహసీల్దార్‌తో వాగ్వాదానికి దిగారు.

ఇదీ చదవండి:

దిల్లీలో 'పంద్రాగస్టు' సందడి- భద్రత కట్టుదిట్టం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.