ETV Bharat / city

RRR: ఆర్ఆర్ఆర్​పై భారీ అంచనాలు.. బాహుబలి రికార్డులు బద్దలయ్యేనా..!

author img

By

Published : Mar 23, 2022, 6:01 AM IST

RRR
RRR

ఆర్ఆర్ఆర్‌... ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా సందడే కనిపిస్తుంది. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటించిన ఆర్ఆర్​ఆర్​పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొవిడ్ కష్టాలను ఎదుర్కొంటూ నాలుగేళ్లపాటు శ్రమించి... సుమారు 500 కోట్ల బడ్జెట్‌తో చిత్రాన్ని నిర్మించారు. మార్చి 25న 5 భాషల్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఆర్ఆర్​ఆర్​ గత రికార్డులను బద్దలు కొట్టేందుకు సిద్ధమైంది.

ఆర్ఆర్ఆర్.. రౌద్రం... రణం.. రుధిరం. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీస్థాయి చారిత్రక చిత్రం. బాహుబలి తర్వాత రాజమౌళి ఎలాంటి కథతో వస్తాడోనని ఊహించిన ప్రేక్షకుల అంచనాలను తలకిందులు చేస్తూ.... ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. 2017 నవంబర్ 18న చరణ్, తారక్‌లతో దిగిన ఫొటోను ట్విట్టర్‌లో పంచుకొని ఊహించని విధంగా ఆశ్చర్యపరిచారు. మన్యం వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురంభీమ్‌ జీవిత నేపథ్యంతో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక అంతే.. యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ.. మరోసారి రాజమౌళి వైపు చూసింది.

చిరంజీవి చేతుల మీదుగా ఆర్ఆర్ఆర్​ ప్రారంభం

తారక్, చరణ్‌లతో మల్టీస్టారర్ సినిమా అనగానే టాలీవుడ్ సైతం ఆశ్చర్యపోయింది. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ చిత్రానికి పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చారు. అనుకున్నట్లుగానే కథ మొత్తం సిద్ధం చేసుకున్న రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ హ్యాష్‌ ట్యాగ్‌తోనే సినిమాను మొదలుపెట్టారు. 2018 నవంబర్ 11న హైదరాబాద్‌లోని అల్యుమినియం ఫ్యాక్టరీలో మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఆర్ఆర్ఆర్​ను లాంఛనంగా ప్రారంభించారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సహా ప్రముఖులంతా హాజరయ్యారు. 2018 నవంబర్ 19న యాక్షన్ సన్నివేశంతో షూటింగ్‌ను ఆరంభించారు. అల్యూమినియం ఫ్యాక్టరీ, రామోజీ ఫిల్మ్ సిటీ, వికారాబాద్ ప్రాంతాల్లో ఏకధాటిగా షూటింగ్ జరిపారు. ఆ తర్వాత గుజరాత్, పుణే, మహాభలేశ్వరం, ఉక్రెయిన్‌లోనూ ఆర్ఆర్ఆర్ సినిమాను చిత్రీకరించారు.

ఆర్ఆర్ఆర్ అర్థం వచ్చేలా టైటిల్

ఇద్దరు స్టార్ హీరోలతో సినిమా చేస్తున్నప్పుడు అదే స్థాయిలో పేరు ఉండాలని భావించారు. మొదట్లో ఆర్ఆర్ఆర్ వర్కింగ్ టైటిల్ తో సినిమాను మొదలుపెట్టారు. ప్రేక్షకులంతా అదే టైటిల్‌గా భావించారు. కానీ 2019 మార్చి 18న తమ చిత్రానికి ఆర్ఆర్ఆర్ అర్థం వచ్చేలా టైటిల్ పెట్టాలంటూ చిత్ర బృందం ప్రేక్షకులను కోరింది. ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభించింది. రకరకాల టైటిల్స్ పోటెత్తాయి. చివరకు అందులో నుంచి "రౌద్రం రణం రుధిరం" పేరుతో మార్చి 25న టైటిల్ ప్రకటిస్తూ రాజమౌళి మోషన్ పోస్టర్ విడుదల చేశారు. అనూహ్యంగా రెండేళ్ల తర్వాత అదే మార్చి 25న సినిమా విడుదల అవుతుండటం విశేషం.

ప్రపంచ వ్యాప్తంగా 5 భాషల్లో విడుదల

రాజమౌళి ఏ సినిమా చేసినా ప్రేక్షకులు సంతృప్తి పడే వరకు తీయడం అలవాటు. అందువల్లే బాహుబలి కోసం ఐదేళ్లు పట్టింది. అయితే ఆర్ఆర్ఆర్ విషయంలోనూ కోవిడ్ కారణంగా సినిమా ఆలస్యమైంది. 2018లో మొదలైన సినిమా పూర్తి కావడానికి నాలుగేళ్లు పట్టింది. 200 కోట్ల రూపాయల బడ్జెట్‌తో పూర్తవుతుందనుకున్న సినిమా... ఏకంగా 500 కోట్లు దాటింది. నటీనటుల పారితోషకాలు కాకుండానే ఈ స్థాయిలో బడ్జెట్ కావడం దర్శక నిర్మాతలను కలవరానికి గురిచేసింది. అయినా సినిమాపై నమ్మకంతో ఎక్కడా వెనుకడుగు వేయకుండా చిత్రాన్ని అన్ని హంగులతో తీర్చిదిద్దారు. కరోనాతో దొరికిన సమయాన్ని సద్వినియోగం చేసుకొని ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచేలా 3డీతోపాటు ఐమ్యాక్స్, డాల్బీ విజన్ ఫార్మాట్లలోనూ ఆర్ఆర్ఆర్‌ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా 5 భాషల్లో విడుదల చేస్తున్నారు.

కొవిడ్ వల్ల వాయిదాలు

ఆర్ఆర్ఆర్ విడుదల తేదీలు ప్రేక్షకులను కొంత అసంతృప్తికి గురిచేశాయి. రెండేళ్లలో సినిమాను పూర్తి చేసి 2020 జులై 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించారు. చిత్రీకరణ ఆలస్యం కావడంతో విడుదల తేదీని 2021 జనవరి 8కి వాయిదా వేశారు. ఆ తర్వాత కోవిడ్ కల్లోలంతో చిత్రపరిశ్రమ స్తంభించింది. ఎక్కడికక్కడ థియేటర్లు మూతపడ్డాయి. ప్రభుత్వ ఆంక్షలు, ప్రజల్లో నెలకొన్న భయం కారణంగా సినిమాకు నష్టం రాకూడదని ఆర్ఆర్ఆర్​ను 2021 అక్టోబర్ 13కు వాయిదా వేశారు. ఆ తేదీ వరకు కూడా కొవిడ్ కేసులు తగ్గకపోవడంతో 2022 జనవరి 7కు మార్చారు. రాజమౌళితోపాటు రామ్ చరణ్, ఎన్టీఆర్ సహా చిత్ర బృందం... విస్తృతంగా ఆర్ఆర్ఆర్ ప్రచారం నిర్వహించింది. అప్పటికే విడుదలైన టీజర్లు, పాటలు సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి.

సినిమా విడుదల తేదీలు మారుతుండటం, విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న క్రమంలో ఇంకోసారి మూడో ముప్పు ఎదురైంది. తెలుగుతోపాటు ఉత్తరాది రాష్ట్రాల్లో కొవిడ్ ఆంక్షలు ఎక్కువయ్యాయి. ఈసారి రెండు తేదీలను పరిశీలనలో పెట్టుకున్న రాజమౌళి... మార్చి 18న లేదా ఏప్రిల్ 28న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ అనూహ్యంగా మరోసారి తమ నిర్ణయాన్ని మార్చుకొని పక్కాగా మార్చి 25నే ఆర్ఆర్ఆర్ ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రేక్షకులు కూడా ఏ మాత్రం నిరాశపడకుండా ఆర్ఆర్ఆర్ కోసం ఎదురుచూస్తుండటం మరో విశేషం.

బాహుబలి తర్వాత అదే స్థాయిలో నిర్మించిన ఈ చిత్రం భావోద్వేగభరితంగా ఉంటుందని రాజమౌళి తెలిపారు. ఇందుకోసం తీర్చిదిద్దిన పాత్రలు... ఆర్ఆర్ఆర్ చిత్ర కథకు ప్రాణం పోశాయనే చెబుతున్నారు. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ నటీనటుల సంగమంగా ఆర్ఆర్ఆర్​ను మలిచారు. బాలీవుడ్ నుంచి ఆలియా భట్, అజయ్ దేవగన్‌తోపాటు హాలీవుడ్ నటీనటులు ఒలివియో మోరీస్, రే స్టీవెన్ సన్, అలిసన్ డూడీ, ఎడ్వర్డ్ సోనెన్ బ్లిక్‌లు సందడి చేయబోతున్నారు. వీరితో పాటు అరుణ్ సాగర్, శ్రియా శరణ్, ఛత్రపతి శేఖర్, రాజీవ్ కనకాల, సముద్రఖనిలు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నట్లు దర్శకుడు రాజమౌళి తెలిపారు.

ఆర్ఆర్ఆర్ గత చిత్రాల వసూళ్లును దాటుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. సినిమాపై ప్రేక్షకుల్లో రెట్టింపు అంచనాలు, టికెట్ ధరలను పెంచుతూ ప్రభుత్వాలు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేయడం ఆర్ఆర్ఆర్‌కు బాగా కలిసి వచ్చే అవకాశంగా ఉంది. అలాగే విదేశాల్లో మార్చి 24నే 1200 థియేటర్లలో ఆర్ఆర్ఆర్​ను ముందస్తుగా ప్రదర్శిస్తున్నారు. విడుదలకు ముందే 1000 కోట్ల వ్యాపారం చేసిన ఆర్ఆర్ఆర్... విడుదలైన మొదటి మూడు రోజుల్లో బాహుబలి-2 పేరుతో ఉన్న 500 కోట్ల రూపాయల రికార్డును తిరగరాస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తొలివారంలోనే ఈ సినిమా సుమారు 3వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టడం ఖాయమని చెబుతున్నారు. ఇదే జరిగితే ప్రపంచ సినిమా చరిత్రలో తెలుగు సినిమా అగ్రభాగాన నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.


ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.