ETV Bharat / city

సీడ్‌ యాక్సెస్‌ పక్కనే రోడ్డు తవ్వి, కంకర తరలింపు

author img

By

Published : Aug 2, 2021, 8:53 AM IST

అమరావతిలో రహదారుల తవ్వకాలు, ఇసుక, మట్టి తరలింపు ఘటనలు ఆగడం లేదు. తాజాగా మోదుగులింగాయపాలెం గ్రామానికి ఉత్తర దిశగా సీడ్‌ యాక్సెస్‌ పక్కన ఉన్న రోడ్డును గుర్తు తెలియని వ్యక్తులు తవ్వి కంకర తరలించారు.

roads in amaravathi
roads in amaravathi

అమరావతిలో రహదారుల తవ్వకాలు, ఇసుక, మట్టి తరలింపు ఘటనలు ఆగడం లేదు. తాజాగా మోదుగులింగాయపాలెం గ్రామానికి ఉత్తర దిశగా సీడ్‌ యాక్సెస్‌ పక్కన ఉన్న రోడ్డును గుర్తు తెలియని వ్యక్తులు తవ్వి కంకర తరలించారు. ఇటీవల ఉద్దండరాయునిపాలెం వద్ద తవ్వేసిన ఎన్‌10 రహదారికి ఇది అర కిలోమీటరు దూరంలోనే ఉంది. ఆ ఘటన జరిగినప్పుడే రైతులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. తాజా ఉదంతం ఆదివారం వెలుగులోకి వచ్చినా.. పది రోజుల క్రితమే జరిగినట్లుగా భావిస్తున్నారు. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాస సముదాయం వరకు ఉన్న రహదారి ఇది. నాలుగు అడుగుల లోతు, 200 మీటర్ల పొడవునా తవ్వారు. సుమారు 100 టిప్పర్ల కంకర తరలించి ఉంటారని అంచనా.

రైతులకు ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వాల్సిన ప్రదేశానికి వెళ్లేందుకు గతంలో ఈ రోడ్డు వేశారు. పనులు నిలిచిపోవడంతో చుట్టూ కంప పెరిగింది. పెద్దగా జనసంచారం ఉండదు. తవ్విన ప్రదేశంలో టిప్పర్లు, జేసీబీలు తిరిగిన ఆనవాళ్లు ఉన్నాయి. కంకర పొర లేకుండా అడుగున మట్టి కన్పిస్తోంది. దారికి ఇరువైపులా అంచుల్లో మిగిలిన కంకర రాళ్లు గుర్తుగా మిగిలాయి. అర్ధరాత్రి జేసీబీలతో తవ్వి, తరలించడం వల్ల బయటకు పొక్కలేదని తెలుస్తోంది.

  • దళిత ఐకాస, స్థానికుల నిరసన..

అమరావతి దళిత ఐకాస నాయకులు, వెలగపూడి రైతులు రోడ్డు తవ్వేసిన ప్రాంతానికి వచ్చి పరిశీలించారు. అమరావతిని దెబ్బతీయడానికే వైకాపా ప్రభుత్వం కంకణం కట్టుకుందని, ఆ పార్టీలోని చోటామోటా నాయకులు రోడ్లను ధ్వంసం చేస్తూ, వస్తువులను అపహరిస్తూ రాజధాని నామరూపాల్లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు, నిఘా వ్యవస్థల కళ్లుగప్పి నిర్మాణ సామగ్రి చోరీ కావడంపై న్యాయస్థానాలు సుమోటోగా తీసుకుని విచారణ జరపాలని కోరారు. ఈ వరుస ఘటనలపై సీఐడీతో విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. దళిత ఐకాస నేత ముళ్లముడి రవి మాట్లాడుతూ ‘ప్రభుత్వం ఏదైనా రాజధానిగా అమరావతి కొనసాగుతుందనే ఉద్దేశంతోనే గుత్తేదార్లు యంత్రాలు తీసుకొచ్చి కంకర యూనిట్లు ఏర్పాటు చేశారు. భారీగా సామగ్రిని నిల్వ చేసుకున్నారు. కొన్ని రహదారులు, భవనాల నిర్మాణాలు మధ్యలో వదిలేశారు. ఇప్పుడవన్నీ దెబ్బతీస్తున్నార’ని మండిపడ్డారు. రోడ్లు తవ్వి గుంతలు పూడ్చుకుంటున్నారని పోలీసులు ఇటీవల చెప్పడాన్ని స్థానిక రైతు సీతారామయ్య ఖండించారు.

ఇదీ చదవండి: HCU: హెచ్​సీయూలో అతిపెద్ద ల్యాబ్ ఏర్పాటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.