ETV Bharat / city

AP POWER PLANTS: రాష్ట్రంలో తగ్గిన విద్యుదుత్పత్తి.. సర్దుబాటుకు ఇబ్బందులు

author img

By

Published : Sep 6, 2021, 7:26 AM IST

రాష్ట్రంలో విద్యుదుత్పత్తి ఒక్కసారిగా తగ్గిపోయింది. జెన్‌కో నుంచి 57 ఎంయూలే విద్యుత్‌ మాత్రమే అందుబాటులో ఉంటోంది. డిమాండ్‌ సర్దుబాటు కోసం రోజూ 25 ఎంయూల విద్యుత్​ను కొనుగోలు చేయాల్సి వస్తోందని అధికారులు చెబుతున్నారు.

reduced-power-generation-in-the-state-of-ap
రాష్ట్రంలో తగ్గిన విద్యుదుత్పత్తి.. సర్దుబాటుకు ఇబ్బందులు

రాష్ట్రంలో విద్యుదుత్పత్తి అనూహ్యంగా తగ్గింది. దీంతో డిమాండ్‌ సర్దుబాటు చేసేందుకు ఎక్స్చేంజీల నుంచి రోజూ 25 మిలియన్‌ యూనిట్ల(ఎంయూ) విద్యుత్‌ను ఇంధన శాఖ కొనుగోలు చేస్తోంది. దేశవ్యాప్తంగా ఒక్కసారిగా విద్యుత్‌కు డిమాండ్‌ ఏర్పడటంతో పీక్‌ సమయంలో బహిరంగ మార్కెట్‌లో దొరకడం కష్టంగా మారిందని అధికారులు పేర్కొంటున్నారు. భారీ వర్షాల కారణంగా బొగ్గు గనుల్లో ఉత్పత్తి తగ్గడంతో థర్మల్‌ విద్యుత్‌పై దీని ప్రభావం పడింది. వాతావరణంలో మార్పులతోనూ పునరుత్పాదక విద్యుత్‌ ఆశించిన స్థాయిలో లేదు. దీంతో డిమాండ్‌ సర్దుబాటుకు అన్ని రాష్ట్రాలూ బహిరంగ మార్కెట్‌ నుంచి కొంటున్నాయి. ఫలితంగా పీక్‌ సమయంలో (సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల మధ్య) డిమాండ్‌ సర్దుబాటు చేయడానికి ఇబ్బంది పడుతున్నట్లు ఒక అధికారి తెలిపారు.

డిమాండ్‌ పడిపోయినా.. సర్దుబాటు కష్టమే

రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం 190-195 మిలియన్‌ యూనిట్ల (ఎంయూ) నుంచి 175 ఎంయూలకు తగ్గింది. అయినా డిమాండ్‌ సర్దుబాటుకు బహిరంగ మార్కెట్‌లో రోజూ సుమారు 25 ఎంయూలను పీక్‌, ఆఫ్‌ పీక్‌ సమయాల్లో కొనాల్సి వస్తోంది. పీక్‌ సమయంలో ఒక యూనిట్‌కు సగటున రూ.3.5 చెల్లిస్తున్నారు. ఏపీ జెన్‌కో నుంచి ఆశించిన స్థాయిలో ఉత్పత్తి లేకపోవడమే రాష్ట్రంలో విద్యుత్‌ కొరతకు కారణంగా ఉంది. జెన్‌కో థర్మల్‌, సౌర, జల విద్యుత్‌ ప్లాంట్ల ఉంచి 57 ఎంయూల విద్యుత్‌ మాత్రమే వస్తోంది. వాటి ద్వారా రోజుకు 100 ఎంయూలు రావాలి. ప్రస్తుతం బొగ్గు కొరత కారణంగా అయిదు ప్లాంట్లలో ఉత్పత్తిని నిలిపేయడంతో 5వేల మెగావాట్ల సామర్థ్యమున్న జెన్‌కో ప్లాంట్ల నుంచి సుమారు 2,800 మెగావాట్లు మాత్రమే అందుతోంది. సాధారణంగా వర్షాకాలంలో బొగ్గు గనుల నుంచి ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. దీనికి అనుగుణంగా రెండు వారాలకు సరిపడా నిల్వలను జెన్‌కో పెంచుకోవాలి. ప్రణాళికాలోపం కారణంగా వీటీపీఎస్‌లో ఒక్కరోజుకు సరిపడా నిల్వలు కూడా లేవు.

పవన, సౌర విద్యుత్‌ కూడా 50% తగ్గి 40-42 ఎంయూలు మాత్రమే గ్రిడ్‌కు అందుతోంది. కేంద్ర విద్యుత్‌ ఉత్పత్తి సంస్థల నుంచి పీపీఏ ప్రకారం సుమారు 35 ఎంయూల విద్యుత్‌ వస్తోంది. ప్రస్తుతం ఎన్‌టీపీసీ ప్లాంట్లలో కూడా బొగ్గు కొరత ఏర్పడిందని.. అక్కడా ఉత్పత్తి తగ్గే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

ఇదీ చూడండి: telangana:విమానం బాత్‌రూమ్‌లో భారీగా బంగారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.