ETV Bharat / city

real estate cheatings: ఇళ్లు, స్థలం కొంటున్నారా?.. అప్రమత్తమవండి!

author img

By

Published : Dec 20, 2021, 8:28 AM IST

సొంతిల్లు కట్టుకోవాలనుకునే సామాన్య, మధ్యతరగతి వారి ఆశే వారికి పెట్టుబడి. ఎక్కడా స్థలాలు లేకపోయినా, కాగితాలపై మాత్రం ఉన్నట్లు చూపిస్తారు. భారీ స్థాయిలో వెంచర్లు వేస్తామని నమ్మిస్తారు. వందల మంది నుంచి అడ్వాన్సులు తీసుకుని ఆపై బోర్డు తిప్పేస్తారు. ఈ తరహా మోసాలు ఇటీవల బాగా పెరిగాయి.

real estate cheatings
real estate cheatings

వరైనా తమ దగ్గర డబ్బులుంటే స్థలమో, ఓ ఇల్లో, ఫ్లాటో కొనుక్కోవాలి అనుకుంటారు.. అందులో పెట్టుబడి పెడితే భవిష్యత్తుకు భరోసాగా ఉంటుందని మరికొందరు ఆలోచిస్తారు. ఇదే అవకాశంగా స్థిరాస్తి వ్యాపారం మాటున కొందరు మోసాలకు తెగబడుతున్నారు. లేని భూమి ఉన్నట్లు చూపించి అమ్మేయటం, ఒకరితో ఒప్పందం చేసుకుని మరొకరికి రిజిస్ట్రేషన్‌ చేయటం, వెంచర్ల పేరిట డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేయటం వంటి నేరాలకు పాల్పడుతున్నారు.

మోసం-1 : లేని భూమి ఉన్నట్లు చూపించి

సొంతిల్లు కట్టుకోవాలనుకునే సామాన్య, మధ్యతరగతి వారి ఆశే వారికి పెట్టుబడి. ఎక్కడా స్థలాలు లేకపోయినా, కాగితాలపై మాత్రం ఉన్నట్లు చూపిస్తారు. భారీ స్థాయిలో వెంచర్లు వేస్తామని నమ్మిస్తారు. వందల మంది నుంచి అడ్వాన్సులు తీసుకుని ఆపై బోర్డు తిప్పేస్తారు. ఈ తరహా మోసాలు ఇటీవల బాగా పెరిగాయి.

* విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించిన ఎంకే కన్‌స్ట్రక్షన్‌ అండ్‌ డెవలపర్స్‌ సంస్థ.. ఆగిరిపల్లి, ముస్తాబాద, గన్నవరం, గుండిమెడ, ఉదయగిరి, కనిగిరి తదితర ప్రాంతాల్లో వెంచర్లు వేస్తామని ప్రకటించింది. ముందుగా డబ్బు కట్టినవారికి తక్కువ ధరలకే ఇల్లు కట్టించి ఇస్తామని రూ.కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. పటమట పోలీసుస్టేషన్‌లో ఈ సంస్థ ప్రతినిధులపై కేసు నమోదైంది.

మోసం-2: ఒప్పందం ఒకరితో.. రిజిస్ట్రేషన్‌ మరొకరికి

డెవలప్‌మెంట్‌ పేరిట ఒకరి వద్ద స్థలం తీసుకుని అపార్ట్‌మెంట్‌ కడతారు. నిర్మాణ సమయంలోనే ఫ్లాట్లను అమ్మకానికి పెట్టి, అడ్వాన్సులు తీసుకుంటారు. చివరిలో వాటినే వేరొకరికి రిజిస్ట్రేషన్‌ చేసి.. ముందుగా అడ్వాన్సు ఇచ్చిన వారిని మోసగిస్తారు. భూ యజమానికి వాటా కింద ఇవ్వాల్సిన ఫ్లాట్లను కూడా వేరేవాళ్లకు అమ్మేస్తున్న సందర్భాలు ఉన్నాయి. కృష్ణా జిల్లా చల్లపల్లిలో ఇలా మోసగించిన నలుగురు స్థిరాస్తి వ్యాపారులను పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు.

మోసం-3: ఫ్లాట్లు విక్రయిస్తామంటూ వసూళ్లు..ఆపై కుచ్చుటోపీ

గుంటూరు నగరానికి చెందిన ఓ స్థిరాస్తి వ్యాపారి పెదపరిమిలో వెంచర్‌ వేశానని, అందులో ప్లాట్లు అమ్ముతానని దాదాపు 300 మంది నుంచి భారీగా సొమ్ములు వసూలు చేశారు. ప్లాట్లు రిజిస్టర్‌ చేయాలని బాధితులు అడుగుతుంటే పరారయ్యారు. రూ.50 కోట్ల వరకు వసూలు చేసి, మోసగించారంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. విశాఖపట్నం, విజయవాడ సహా పలు నగరాల్లో గతంలోనూ ఇలాంటి ఉదంతాలు నమోదయ్యాయి.

మోసం-4: మీకు తెలియకుండానే మీ భూమి అమ్మకం

అమెరికాలోని ఓ ప్రవాసాంధ్రుడు విశాఖకు చెందిన ఓ స్థిరాస్తి వ్యాపారికి కొన్నేళ్ల కిందట కొంత భూమి విక్రయించాడు. ఆ లావాదేవీల సమయంలో ప్రవాసాంధ్రుడికి కొమ్మాదిలో 12 ఎకరాల భూమి ఉందని స్థిరాస్తి వ్యాపారి తెలుసుకున్నాడు. ఆ భూమికి తన పేరిట నకిలీ జీపీఏ, స్పెషల్‌ జీపీఏ పత్రాలు తయారు చేయించాడు. వాటి ఆధారంగా ఆ భూమిని రూ.18.7 కోట్లకు విక్రయించేందుకు ఓ పెద్ద స్థిరాస్తి సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని డబ్బులు కూడా తీసేసుకున్నాడు. స్థిరాస్తి సంస్థ ఆ భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడానికి పత్రికా ప్రకటన ఇవ్వడంతో మోసం బయటపడింది. ఇలాంటి మోసాలు అనేకం వెలుగుచూస్తున్నాయి.

మోసం-5: ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించేసి..

అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలను ఆనుకుని ఉన్న ప్రైవేటు స్థలాల్ని గుర్తించి వాటిలో స్థిరాస్తి వెంచర్లు వేస్తారు. అందులో ప్రభుత్వ భూమిని కలిపేసి ప్లాట్లుగా మార్చి అమ్మేస్తారు. అధికారులు తనిఖీ చేసి అందులో ప్రభుత్వ భూమి ఉందని తేల్చినప్పుడు.. బాధితులు మోసపోయామని గుర్తిస్తున్నారు.

చిత్తూరు జిల్లా పుత్తూరులో రూ.12 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కొందరు స్థిరాస్తి వ్యాపారులు తమ వెంచర్‌లో కలిపేసి అమ్మేశారు. ఆ భూమి కొనుక్కున్న వందల మంది మోసపోయారు. విశాఖ జిల్లా చోడవరంలోనూ ఈ తరహా మోసాలపై విజిలెన్స్‌ విచారణ జరిపింది. హిందూపురంలోని బెంగళూరు రోడ్డుకు ఆనుకుని ఉన్న ఓ లే అవుట్‌లో ఆర్‌అండ్‌బీ, సాగునీటి శాఖ భూమిని కలిపేసి అమ్మేశారు.

మరికొన్ని మోసాలు

* కొందరు వ్యాపారులు ఒకరి భూమిని మరొకరికి అమ్మేస్తున్నారు. కొనుగోలుదారులు స్థలం స్వాధీనానికి ప్రయత్నించినప్పుడు అసలు యజమానులు రంగంలోకి దిగుతున్నారు.

* ‘స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నాం.. పెట్టుబడి పెట్టండి.. వెంచర్‌ పూర్తయితే భారీగా లాభాలు చూడొచ్చు’ అంటూ వలలోకి లాగుతారు. పెట్టిన డబ్బు తిరిగివ్వకుండా మోసగిస్తారు.

* నిర్మాణం ప్రారంభించకముందే కొంటే తక్కువ ధరకే ఫ్లాటు ఇస్తామంటూ ప్రచారం చేసి కొన్ని సంస్థలు ఎలాంటి అనుమతులు రాని వెంచర్లకు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. ఆ తర్వాత వాటికి అనుమతులు రాకపోవడంతో డబ్బులు కట్టినవాళ్లు మునిగిపోతున్నారు. విశాఖ తదితర ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు వెలుగుచూశాయి.

ముందస్తు పరిశీలనే ముఖ్యం

* ఆస్తులు కొనే ముందు వాటి వివరాలు, దస్త్రాలు క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి.
* పంచాయతీ, పురపాలక సంస్థల అనుమతులున్నాయో లేదో చూసుకోవాలి.
* లే అవుట్‌లో ప్రభుత్వ భూములున్నాయా, నిషేధిత భూముల జాబితాలో గానీ ఉందా అనేది పరిశీలించుకోవాలి.
* లింకు డాక్యుమెంట్లన్నీ ముందే చూసుకోవాలి. వాటిలో పేరు, ఆస్తి వివరాలు, సర్వే నెంబర్లు ఒకేలా ఉన్నాయో, లేదో పరిశీలించాలి. అమ్మకందారు వారసులందరి సమ్మతి తీసుకోవాలి. సదరు ఆస్తి తాకట్టులో లేదని నిర్ధారించుకోవాలి.
* జీపీఏ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో నమోదయిందో, లేదో తెలుసుకోవాలి. కొనే ముందే స్థలం సర్వే చేయించుకోవాలి. కొనగానే సరిహద్దు రాళ్లు పాతించుకోవాలి.
* వెంచర్లలో పెట్టుబడి పెట్టే ముందు ఆ సంస్థ గతంలో చేపట్టిన నిర్మాణాల గురించి ఆరా తీయాలి. ఒప్పందపత్రం పూర్తిగా చదివాకే సంతకాలు పెట్టాలి.
* స్థిరాస్తి ప్రాజెక్టును రెరాలో రిజిస్టర్‌ చేయించారా? రెరా నెంబర్‌ ఉందా? అనేది చూసుకోవాలి.

ఇదీ చదవండి: CM Jagan Kurnool Tour: ఈనెల 22న కర్నూలు జిల్లాకు ముఖ్యమంత్రి జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.