ETV Bharat / city

రాష్ట్రాల అప్పులపై కేంద్రం జోక్యం అవసరం.. ఆర్థిక ఎమర్జెన్సీకీ వెనకాడొద్దు!

author img

By

Published : Apr 26, 2022, 7:55 AM IST

Duvvuri Subbarao Interview : "ఆర్‌బీఐ నివేదిక చూశా. గ్యారంటీల పెరుగుదల ఎక్కువగా ఉన్న మొదటి అయిదు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఒకటి. జీఎస్‌డీపీతో పోల్చి చూసినపుడు ఏపీలో ఈ పెరుగుదల గత ఏడాది కంటే ఎక్కువ. ప్రభుత్వం చేసే అప్పులే కాదు. గ్యారంటీ ఇచ్చి తీసుకొనే రుణాలు తీర్చే బాధ్యతా సర్కారు మీదే ఉంటుంది. రాష్ట్రాల అప్పుల భారం ఎంత ఉందో అధ్యయనం చేయాలంటే బడ్జెట్‌లో పేర్కొనని అదనంగా చేసిన అప్పులు, పద్దులో కనపడకుండా కార్పొరేషన్లకు గ్యారంటీ ఇచ్చే అప్పులు, కంటింజెంట్‌ లయబిలిటీస్‌ కలిపి తీసుకొంటే చాలా రాష్ట్రాలు అనుకొన్నదానికంటే అధ్వానంగా ఉన్నాయి. సంక్షోభం పొంచి ఉంది." - దువ్వూరి సుబ్బారావు , రిజర్వ్‌బ్యాంకు మాజీ గవర్నర్‌

duvvuri subbarao
duvvuri subbarao

Duvvuri Subbarao Interview : ‘‘రాష్ట్రాలు పెట్టుబడి వ్యయం కోసం అప్పు చేయవచ్చు. రోజువారీ ఖర్చులు, జీతాలు, సబ్సిడీలు, ప్రజాకర్షక పథకాలకు సైతం రుణం తీసుకునే పరిస్థితి ఏర్పడటం ఆందోళనకరం. ఇదే కొనసాగితే శ్రీలంక లాగా మనం కూడా సమస్యల్లో పడే అవకాశం ఉంది. రాష్ట్రాలు ఓ పరిమితికి మించి అప్పులు చేయకుండా ఉండేందుకు ద్రవ్య వినిమయ చట్టాన్ని (ఎఫ్‌.ఆర్‌.బి.ఎం) తెస్తే, ప్రభుత్వాలు దాని కళ్లుగప్పి బడ్జెట్‌కు బయట తీసుకొనే రుణాలు ఎక్కువయ్యాయి. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకొని మొత్తం అప్పులను కలిపి చూసి తగ్గించుకోమని సూచించాలి. అవసరమైతే షరతులు విధించాలి. ఇంకా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే రాష్ట్రాలపై ఆర్థిక ఎమర్జెన్సీని విధించేందుకూ వెనుకాడరాదు’అని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు.

Duvvuri Subbarao About Debts : రాష్ట్రాల అప్పులు భారీగా పెరిగి, వడ్డీల చెల్లింపు ఎక్కువైందని.. రుణాల వినియోగ పద్ధతిలోనూ మార్పు వచ్చిందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీలంక సంక్షోభం, రాష్ట్రాలు అధిక మొత్తంలో చేస్తోన్న అప్పులపై చర్చ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ మాజీ కార్యదర్శిగా, ప్రపంచబ్యాంకులో ప్రధాన ఆర్థికవేత్తగా, రిజర్వ్‌బ్యాంకు గవర్నర్‌గా పనిచేసిన దువ్వూరి సుబ్బారావు ‘ఈనాడు-ఈటీవీ భారత్‌’కు ఇచ్చిన ముఖాముఖిలో వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.

  • మనదేశంలో ప్రభుత్వాలకు మితిమీరి అప్పులు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తోంది. సొంత ఆదాయ వనరులను సమకూర్చుకోవడం, పెంచుకోవడంపై ఎందుకు దృష్టి సారించడం లేదు?

ఆర్థిక నిర్వహణలో భాగంగా అప్పులు చేయాల్సి రావచ్చు. దానికి ఓ పరిమితి అంటూ లేకపోవడమే సమస్య. రుణం తీసుకొని పెట్టుబడి వ్యయం కింద ఖర్చుచేస్తే ఆదాయం వస్తుంది. తిరిగి కట్టే పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా పన్నులు తగ్గించి, సబ్సిడీలకు పెంచి, ప్రజాకర్షక పథకాలకు వ్యయం చేస్తూ పోతే సమస్యలొస్తాయి. ఇలా చేసే శ్రీలంక సమస్యల్లో పడింది. మన దేశంలోనూ కొన్ని రాష్ట్రాలు ఇలా చేస్తున్నాయి.
ఆర్‌బీఐ తాజా నివేదిక ప్రకారం అత్యధికంగా అప్పులు చేసిన అయిదు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ కూడా ఉంది. ఇది ఆందోళనకరమేనా? కార్పొరేషన్ల ద్వారా రాష్ట్రాలు చేసే రుణాలు అదనంగా ఉంటున్నాయి. మొత్తం కలిపి చూస్తే గ్రాస్‌ స్టేట్‌ డొమెస్టిక్‌ ప్రొడక్ట్‌(జీఎస్‌డీపీ)లో 50

  • శాతానికి మించి అప్పులుండే రాష్ట్రాలున్నాయి. రుణ పరిమితిని తుంగలో తొక్కుతున్నాయి. ఇలాంటప్పుడు ఆర్‌బీఐ ఏం చేస్తోంది?

ఆంధ్రప్రదేశ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పలేను. రాష్ట్రాలన్నింటికి కలిపి ఆర్‌బీఐ నివేదిక ఇచ్చింది. దీనిని బట్టి రాష్ట్రాల అప్పులు పెరుగుతున్నాయి. చెల్లించాల్సిన వడ్డీలూ పెరిగాయి. దీంతో అభివృద్ధి పనులకు డబ్బులుండటం లేదు. బడ్జెట్‌ బయటి అప్పుల గురించి మీరన్నది వాస్తవం. ఏదైనా నివేదికను బడ్జెట్‌ అంకెలను బట్టి చూస్తాం. ఆర్థిక నిర్వహణ, చెల్లింపులు లాంటివన్నీ బాగానే ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ తెరవెనక ఏం జరుగుతుందో మనకు తెలియడం లేదు. అప్పు అంటే బడ్జెట్‌లో చూపని గ్యారంటీ ఇచ్చి కార్పొరేషన్ల ద్వారా తీసుకునే రుణాలనూ పరిగణనలోకి తీసుకోవాలి.

  • శ్రీలంక ఆర్థిక సంక్షోభానికి కారణాలేంటి?

శ్రీలంక ఆర్థిక సంక్షోభానికి రెండు కారణాలున్నాయి. విదేశీ ఆదాయం తగ్గిపోవడం, ప్రభుత్వ ప్రజాకర్షక పథకాలు. శ్రీలంక ఎక్కువగా విదేశీ పర్యాటకులు, ఇతర దేశాల్లో పని చేసే తమ దేశస్థులు పంపే డబ్బుపై ఆధారపడి ఉంది. 2019లో జరిగిన బాంబుదాడులు, కరోనా కారణంగా ఈ రెండింటిపైనా ప్రభావం పడింది. కొవిడ్‌ కారణంగా టీ, టెక్స్‌టైల్స్‌ ఎగుమతులు తగ్గిపోయాయి. దీంతో చైనాతో సహా ఇతర దేశాల నుంచి అధిక వడ్డీలకు తీసుకొన్న రుణాలు చెల్లించలేకపోయింది. మరోవైపు ప్రజాకర్షక పథకాలకు తోడు కొవిడ్‌కు ముందుగా పన్నులు బాగా తగ్గించడం, వడ్డీలేని రుణాలు ఇవ్వడం చేసింది. రసాయనిక ఎరువుల దిగుమతిపై నిషేధం వల్ల ఆహార ధాన్యాల ధరలు బాగా పెరిగాయి. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం వల్ల దిగుమతి చేసుకొనే ఆయిల్‌ ధరలు పెరిగాయి. ఆదాయం తగ్గింది, ఖర్చు పెరిగింది. వృద్ధిరేటు ధ్వంసమైంది. ద్రవ్యోల్బణం తీవ్రరూపం దాల్చి కరెన్సీ విలువ పతనమైంది. రుణాలు తిరిగి చెల్లించలేక డిపాల్ట్‌ కావడంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయి.
చేసే అప్పుల్లో పెట్టుబడి వ్యయానికి ఎంత, తాత్కాలిక లేదా రెవెన్యూ వ్యయాలకు ఎంత అనే దానికి నిబంధనలేమీ లేవా? ఇలాంటివి ఉంటే అధికారంలో ఉన్న రాజకీయపార్టీ తన ఎన్నికల ప్రయోజనాలకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా అడ్డుకునేందుకు

  • ఆస్కారం ఉంటుంది కదా?

అధికారంలో ఉన్న పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలవడానికి అనేక ప్రజాకర్షక పథకాలను చేపడుతుంది. ఇందుకోసం భారీగా బడ్జెట్‌లో కనిపించని అప్పులు చేస్తోంది. ఆర్టికల్‌ 293 ప్రకారం ఏ రాష్ట్రప్రభుత్వమైనా అప్పులు చేయాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి కావాలి. అప్పుడు కేంద్రం అన్నీ పరిశీలించి కొన్ని షరతులు పెట్టొచ్చు. ఆర్థిక ఎమర్జెన్సీ కూడా విధించవచ్చు. ఇప్పటివరకు మనదేశంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. అయితే ఆ భయం ఉండాలి.

  • కార్పొరేట్లకు భారీగా సబ్సిడీలు, అంతా ఉచితం లేదా పథకాల పేరుతో మూలధన ఆస్తులు సృష్టించి ఇవ్వలేని పరిస్థితిని కల్పిస్తున్న ప్రభుత్వాలకు అడ్డుకట్ట వేయడం ఎలా?

రాష్ట్రాలు క్రమశిక్షణ పాటించేలా చూడాల్సిన బాధ్యత కేంద్రానిదే. ఆర్‌.బి.ఐ మేనేజర్‌ పాత్ర పోషిస్తోంది. కేంద్రానికి నివేదికలిస్తుంది. అన్ని రాష్ట్రాల విషయంలో కేంద్రం ఒకే విధంగా వ్యవహరించినపుడు ఎలాంటి సమస్యా ఉండదు. అమెరికాలోని రాష్ట్రాలు బడ్జెట్‌ను బ్యాలన్స్‌ చేసుకొంటాయి. అప్పులు చేయరు.

  • ప్రభుత్వాల ఖర్చులపై సోషల్‌ ఆడిట్‌ కనిపించడం లేదు, ప్రభుత్వం తన ఇష్టానుసారం కేటాయింపులు చేసుకొంటూ పోవచ్చా? ప్రజల తరఫున దాన్ని ప్రశ్నించి నియంత్రించే అవకాశం లేదా?

ప్రజాస్వామ్యంలో ఇది శాసనసభ బాధ్యత. బడ్జెట్‌ను శాసనసభ ఆమోదిస్తుంది. ప్రజాకర్షక పథకాలు, సబ్సిడీలు ప్రకటించినపుడు ప్రతిపక్షాలు కూడా ఏమీ మాట్లాడవు. ఎందుకంటే ఇవన్నీ ఓట్లతో ముడిపడి ఉండేవి. అసలు కొన్ని అప్పుల గురించి సమాచారమే ఉండదు. దీంతో చెక్స్‌ అండ్‌ బ్యాలెన్సెస్‌కు అవకాశం లేకుండా పోయింది.

  • శ్రీలంక నుంచి మనం నేర్చుకోవాల్సిన అనుభవం ఏమిటి? ఇప్పటికే దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఉద్యోగులకు జీతాలు కూడా సకాలంలో ఇవ్వలేకపోతున్నాయి?

శ్రీలంక నుంచే కాదు 1991లో మన సొంత అనుభవం నుంచీ పాఠాలు నేర్చుకోవాలి. ఆర్థిక, ద్రవ్య నిర్వహణ అన్నది చాలా ముఖ్యం. అధికలోటు, అప్పులు దేశాన్ని, రాష్ట్రాలను సంక్షోభంలోకి నెట్టి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగజేస్తాయి. తెచ్చిన రుణాలను మౌలిక వసతులు, అభివృద్ధి పనులకు ఖర్చు చేయకుండా ప్రజాకర్షక పథకాలకు వెచ్చిస్తూ పోతే ప్రభుత్వ ఆదాయం పెరగకపోగా వడ్డీలు అధికమై రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోతాయి. జీతాలు, పింఛన్లు లాంటి కచ్చితంగా చెల్లించాల్సిన వాటితో పాటు అధిక మొత్తంలో వడ్డీలు కట్టాల్సి రావడంతో పెట్టుబడి వ్యయానికి నిధులుండవు.

ఆర్థికపరమైన అంశాలపై కాగ్‌ నివేదికలు ఇస్తుంది. ఇవి చాలా ఆలస్యంగా వస్తుండటంతో బ్యూరోక్రసీ పట్టించుకోవడం లేదు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌ను తీసుకోండి. 2019-20వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నివేదికను కాగ్‌ ఇప్పుడు ఇచ్చింది. రెండేళ్ల క్రితంది కదా ఏం పట్టించుకొంటాంలే అని పక్కనపడేస్తారు. 2019-20లో తీసుకొన్న రుణాల్లో 80 శాతం రెవెన్యూ అకౌంట్స్‌ బ్యాలన్స్‌ కోసం వినియోగించారు. దీనివల్ల రాష్ట్రంలో ఆస్తుల కల్పనపై ప్రభావం పడిందని కాగ్‌ పేర్కొంది. అయినా తర్వాత ఏమైనా మార్పు ఉందా? ఆడిట్‌కు ఉండాల్సిన పదును లేకుండా పోయింది.

ఇవీ చదవండి :

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.