ETV Bharat / city

'కేసీఆర్.. తట్టబుట్ట సర్దుకొని మీరు కొంటున్న విమానంలో పారిపో..'

author img

By

Published : Oct 10, 2022, 4:06 PM IST

Rajagopal Reddy fires on CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్​పై మునుగోడు భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్​కు దమ్ముంటే మునుగోడు నుంచి పోటీ చేయాలని రాజగోపాల్​రెడ్డి సవాల్ విసిరారు. ఈసారి మునుగోడు ఫలితాలు సీఎం చెంప చెల్లుమనేలా ఉంటాయన్నారు. మునుగోడు ఎన్నిక రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుందని బండి సంజయ్ పేర్కొన్నారు.

kcr
kcr

Rajagopal Reddy fires on CM KCR: తెలంగాణలోని మునుగోడు ఉపఎన్నికకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఎన్నికల అధికారికి నామపత్రాలు సమర్పించారు. నామినేషన్‌ వేసిన అనంతరం చండూరులో మాట్లాడిన ఆయన.. సీఎం కేసీఆర్​పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌కు దమ్ముంటే మునుగోడు నుంచి పోటీ చేయాలని సవాల్‌ విసిరారు. ఈసారి మునుగోడు ఫలితాలు సీఎం చెంప చెల్లుమనేలా ఉంటాయన్నారు. నల్గొండ జిల్లా అంటేనే విప్లవాల ఖిల్లాగా పేర్కొన్న అయన.. దొంగ చాటు దెబ్బ తీసేందుకు కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ తట్టబుట్ట సర్దుకొని కొత్తగా కొంటున్న విమానంలో పారిపోవాలని తెలిపారు.

'కేసీఆర్.. తట్టబుట్ట సర్దుకొని మీరు కొంటున్న విమానంలో పారిపో..'

'మునుగోడులో పోటీకి కేసీఆర్‌ వస్తారా? కేటీఆర్‌ వస్తారా? సిద్దిపేట రోడ్లు.. మునుగోడు రోడ్లకు తేడా చూడండి. కేసీఆర్‌.. మీరు రాష్ట్ర ప్రజల సొత్తు రూ.లక్ష కోట్లు దోచుకున్నారు. మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. వచ్చే బతుకమ్మ నాటికి కవిత తీహార్‌ జైలుకు వెళ్తారు. ప్రజలందరి దృష్టి మునుగోడు ఉప ఎన్నికపైనే ఉంది. దేశం మొత్తం దీనిపై చర్చించుకుంటోంది. ఈసారి పోటీ మునుగోడు ప్రజలకు కేసీఆర్ అహంకారానికి ఉంటుంది.'-కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, మునుగోడు భాజపా అభ్యర్థి

Bandi Sanjay Comments on KCR: మునుగోడు ఉపఎన్నిక రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయిస్తోంది భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పష్టం చేశారు. మునుగోడు తీర్పు కోసం రాష్ట్రమంతా ఎదురుచూస్తోందని వ్యాఖ్యానించారు. భారీ మెజార్టీతో భాజపాను గెలిపించి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాలని చూస్తున్నారని బండి సంజయ్‌ ఆరోపించారు. ఎన్ని జిమ్మిక్కులు చేసిన ఉపఎన్నికలో కమలం గెలుపును ఆపలేరన్నారు. కేసిఆర్ పాస్​పోర్ట్​ల బ్రోకర్ అని బండి ధ్వజమెత్తారు.

'రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో కేసీఆర్ బయటికి వచ్చారు. మునుగోడు ఎన్నిక రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుంది. భారీ మెజారిటీతో భాజపాని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నా. రాజగోపాల్ రెడ్డి మొదటి నుంచి కాంట్రాక్టర్. ఎంతో మందికి ఆర్థికసహాయం చేసిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి. కేసీఆర్‌కు సొంత విమానం కొనేంత డబ్బు ఎక్కడిది?. కేసీఆర్‌ రాష్ట్రాన్ని కుదువ పెట్టాలని చూస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాతే గట్టుపల్ మండలం ఏర్పాటు అయింది.'-బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.