ETV Bharat / city

CONTRACT FACULTY: ఎయిడెడ్‌ సిబ్బంది, సాధారణ బదిలీలతో ఒప్పంద అధ్యాపకులకు గండం

author img

By

Published : Oct 9, 2021, 6:49 AM IST

ఎయిడెడ్‌ అధ్యాపకులు, రెగ్యులర్‌వారి బదిలీలతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోని ఒప్పంద అధ్యాపకుల ఉద్యోగాలకు గండం ఏర్పడింది. పోస్టులు క్రమబద్దీకరిస్తారని ఇన్నాళ్లు వేచి చూసిన వారికి... ఉద్యోగమే పోయే పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగాలు కాపాడాలంటూ అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు.

problems-for-contract-faculty-jobs-with-aided-staff-regular-transfers
ఎయిడెడ్‌ సిబ్బంది, సాధారణ బదిలీలతో ఒప్పంద అధ్యాపకులకు గండం

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోని 268 మంది ఒప్పంద అధ్యాపకుల ఉద్యోగాలకు గండం ఏర్పడింది. తమ పోస్టులను క్రమబద్ధీకరిస్తారనే ఆశతో వారు ఇంతకాలం నిరీక్షిస్తున్నారు. ఎయిడెడ్‌ అధ్యాపకులు, రెగ్యులర్‌వారి బదిలీలతో వారు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. తమ ఉద్యోగాలను కాపాడాలంటూ ఒప్పంద అధ్యాపకులు కళాశాల విద్య కమిషనరేట్‌ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునేవారు లేరు. దీంతో శుక్రవారం రాష్ట్రంలో ఆర్జేడీ కార్యాలయాలు, కళాశాలల ఎదుట వారు ఆందోళనలు చేపట్టారు. ఎయిడెడ్‌ అధ్యాపకులకు పోస్టింగులను ఇచ్చేందుకు కౌన్సెలింగ్‌లో ఒప్పంద, పార్ట్‌టైం సిబ్బంది పని చేస్తున్న అన్ని పోస్టులనూ అధికారులు ఖాళీగా చూపారు. దీంతో ఎయిడెడ్‌ సిబ్బంది వెబ్‌ ఐచ్ఛికాలనిచ్చారు. ఎయిడెడ్‌ అధ్యాపకులను ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల తాము ఉద్యోగాలు కోల్పోతామని, తమను కాపాడాలంటూ ఇటీవల ఒప్పంద సిబ్బంది ఆందోళనలకు పిలుపునిచ్చారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వీరితో చర్చించి ఎలాంటి ఇబ్బంది ఉండబోదని సముదాయించారు. ఆయన హామీ అమలు కావడం లేదని ఒప్పంద అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వందలాది ఉద్యోగాలు హుష్‌కాకి!

ఖాళీగా చూపిన ఒప్పంద అధ్యాపకుల పోస్టుల్లోకి ఇప్పటికే 150 మంది రెగ్యులర్‌ ఉద్యోగులను చేర్చుకున్నారు. ఉద్యోగాలు కోల్పోయిన ఒప్పంద అధ్యాపకులను కళాశాల విద్య కమిషనరేట్‌కు సరెండర్‌ చేశారు. 15-20 రోజులుగా విధుల్లేక వారి పరిస్థితి గాలిలో దీపంలా మారింది. ఎయిడెడ్‌ విద్యాసంస్థల నుంచి సిబ్బందిని వెనక్కి తీసుకోవడంతో 1,091 మంది ప్రభుత్వంలోకి వచ్చారు. ఒప్పంద అధ్యాపక పోస్టులను మినహాయిస్తే ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 500 వరకు మాత్రమే ఖాళీలున్నాయి. ఎయిడెడ్‌ నుంచి వచ్చిన వారిలో 145 మందికి స్వయంప్రతిపత్తి కళాశాలల్లో పోస్టింగులనిచ్చారు. దీంతో 30మంది ఒప్పంద అధ్యాపకులు తమ పోస్టులను కోల్పోయారు. తాజాగా మిగతా ఎయిడెడ్‌ బోధన సిబ్బందికి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. వారిని చేర్చుకునేందుకు ఒప్పంద అధ్యాపకుల పోస్టులను చూపారు. దీని కారణంగా మరో 88మంది ఉద్యోగాలను కోల్పోయే పరిస్థితులేర్పడ్డాయి.

ఇదీ చూడండి: HYDERABAD RAINS: భాగ్యనగరాన్ని ముంచెత్తిన వర్షం.. నాలాలో పడిన వ్యక్తి సురక్షితం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.