ETV Bharat / city

YCP Vs TDP: రాష్ట్రంలో హైవోల్టెజ్ రాజకీయం.. తగ్గేదేలే అంటున్న అధికార, ప్రతిపక్షం

author img

By

Published : Oct 22, 2021, 10:28 PM IST

ఓ వైపు యాక్షన్.. మరోవైపు నుంచి రియాక్షన్... అటువైపు నుంచి కామెంట్స్.. ఇటువైపు నుంచి కౌంటర్..! వీళ్లు ధర్నా అంటే.. వాళ్లు నిరసన అంటున్నారు..! ఇటు దీక్షకు దిగితే.. అటు ప్రజాగ్రహ దీక్షలంటూ రోడ్లపైకి వచ్చేశారు. ఇదీ ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి! ముఖ్యమంత్రిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించమంటూ అధికార పార్టీ నేతలు విధ్వంసానికి దిగటంతో మొదలైన రాజకీయ రగడ.. రోజురోజుకూ హీట్​ పెంచుతోంది..! తెదేపా పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడికి నిరసనగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు.. 36 గంటల దీక్ష చేపట్టారు. అధికార పార్టీ తీరుపై ఓ స్థాయిలో ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలపై కేంద్రం దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. అయితే తాము కూడా హస్తినకు వెళ్తామంటోంది వైకాపా. మొత్తంగా ఏపీ కేంద్రంగా నెలకొన్న రాజకీయ వేడి.. హస్తినలో సెగలు పుట్టించేలా కనిపిస్తోంది..!

political tensions flared up in andhrapradesh
political tensions flared up in andhrapradesh

రాష్ట్ర రాజకీయాలు భగ్గుమంటున్నాయి. అధికార వైకాపా.. ప్రతిపక్ష తెదేపాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. పట్టాభి వ్యాఖ్యలతో మొదలైన వివాదం.. ధర్నాలు, నిరసనలు, దీక్షల వరకు చేరింది. ఇరుపార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. తెదేపా రాష్ట్ర కార్యాలయంపై అధికార పార్టీ తీరును ఖండిస్తూ చంద్రబాబు 36 గంటల దీక్ష చేస్తే.. సీఎంపై వ్యాఖ్యలకు నిరసగా రెండు రోజుల పాటు వైకాపా ఆధ్వర్యంలో ప్రజాగ్రహ దీక్షలు చేపట్టారు. వ్యుహాలు, ప్రతివ్యూహాలు రచిస్తూ.. ఎక్కడా తగ్గటం లేదు..! ఇరు పార్టీలు దిల్లీ పర్యటనకు సిద్ధం కావటంతో.. రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది.

గల్లీ టూ దిల్లీ..!

దెబ్బకు దెబ్బ అన్నట్లు సాగుతున్న రాష్ట్ర రాజకీయం... గల్లీ నుంచి దిల్లీకి చేరేలా కనిపిస్తోంది. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడుల అంశాన్ని దిల్లీ స్థాయిలో చర్చకు దారి తీసేలా తెలుగుదేశం పార్టీ పావులు కదుపుతోంది. అందుకు తగ్గట్లే చంద్రబాబు దీక్షకు దిగారు. అంతకుముందే.. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్రహోంశాఖకు లేఖలు రాశారు. వైకాపా పాలన తీరును వివరించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని.. కేంద్ర బలగాలను పంపాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం నేతల బృందంతో దిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రపతి సమయం ఖరారైంది. ఏపీలో నెలకొన్న పరిణామాలతో పాటు రాష్ట్రంలో ఆర్టికల్ 356ని అమలు చేయాలని కోరనున్నారు. కేంద్రహోంమంత్రి అమిత్ షా దృష్టికి కూడా ప్రస్తుత పరిస్థితులను తీసుకెళ్లనున్నారు.

ఎత్తుకు పైఎత్తులు..

తెదేపా ఆందోళనలు, నిరసనలపై వ్యూహాత్మక వైఖరితో ముందుకెళ్తోంది వైకాపా. ఏ మాత్రం తగ్గకుండా.. వారికి ధీటుగా నిరసన కార్యక్రమాలను చేపడుతోంది. ప్రస్తుత పరిణామాలు ఏ మాత్రం ప్రతిపక్ష పార్టీకి కలిసిరాకుండా పావులు కదుపుతూ.. ఆ పార్టీ నేత వ్యాఖ్యలకు తీవ్ర స్థాయిలో కౌంటర్లు ఇస్తోంది. చంద్రబాబు దిల్లీ టూర్​పై అప్రమత్తమైన వైకాపా పెద్దలు.. హస్తిన పర్యటనకు సిద్ధమయ్యారు. తెలుగుదేశాన్ని నిషేధించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఆ పార్టీ నేత సజ్జల ప్రకటించారు.

'ముఖ్యమంత్రి జగన్​పై తెలుగుదేశం పార్టీ నేతలు బూతులు తిట్టడంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం. తెలుగుదేశం పార్టీ గుర్తింపును రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరతాం. చంద్రబాబు దీక్ష ఓ డ్రామా.. ఇప్పటికైనా చంద్రబాబు చేసిన తప్పుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలి' - సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు

మరోవైపు ఇరు పార్టీల నేతలు ఏ మాత్రం తగ్గటం లేదు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్...సీఎంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. చంద్రబాబును ఏమైనా అంటే ఏపీకి బీపీకే వస్తుందంటూ ముఖ్యమంత్రి జగన్​కు కౌంటర్లు విసిరారు. అధికారంలోకి వచ్చాక.. అందరీ లెక్కలు తేలుస్తామని.. వడ్డీతో సహా చెల్లిస్తామంటూ హెచ్చరించారు. ఇక వైకాపా సర్కార్ ను గద్దే దించేతే తెదేపాను విలీనం చేసేందుకు భాజపాకు చంద్రబాబు ప్రతిపాదనలు పంపారని ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్రలో మాదకద్రవ్యాలకు పురుడు పోసింది తెదేపా నేతలే అని అన్నారు. ఇక భాజపా, జనసేన, సీపీఐ, సీపీయం పార్టీలు కూడా అధికార పార్టీ తీరును తప్పుబడుతున్నాయి. ప్రతిపక్ష పార్టీ ఆఫీసుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించాయి. మొత్తంగా కొద్దిరోజులుగా సైలెంట్​గా ఉన్న రాష్ట్ర రాజకీయాలు.. తాజా పరిణామాలతో అట్టుడికిపోతున్నాయి.

అసలేం జరిగిందంటే..

ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన తెదేపా నేత పట్టాభి.. ముఖ్యమంత్రి జగన్ పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. డ్రగ్స్ కేసులో మాజీ మంత్రి నక్కా ఆనందబాబుకు నోటీసులివ్వటంపై ప్రశ్నించిన ఆయన.. సీఎంపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో వైకాపా శ్రేణులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాయి. పట్టాభి ఇంటిపై దాడి చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యాలయాలపై దాడులకు దిగారు. ఇదే సమయంలో మంగళగిరిలో పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఈ దాడులకు ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ నిరసనలు చేపట్టింది. అదే కార్యాలయంలో చంద్రబాబు.. 36 గంటల దీక్షను చేపట్టారు.

ఇదీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.