గడప గడపలో... నిరసన, సమస్యల స్వాగతం.. ప్రశ్నిస్తే మంత్రుల మౌనం..

author img

By

Published : May 12, 2022, 5:10 AM IST

గడప గడపకు మన ప్రభుత్వం

'గడప గడపకు మన ప్రభుత్వం' అంటూ వైకాపా నాయకులు చేపట్టిన కార్యక్రమానికి తొలిరోజే సమస్యలు స్వాగతం పలికాయి. ఎక్కడికక్కడ ప్రజలు సమస్యలను ఏకరవుపెట్టారు. పథకాలు తమకు అందడం లేదంటూ ప్రజాప్రతినిధులను నిలదీశారు. రహదారులు వంటి మౌలిక వసతులు కల్పించలేరా? అంటూ ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమానికి బుధవారం తొలిరోజే నిరసనల సెగ తగిలింది. ప్రజల ఇళ్లకు వెళ్లిన మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలకు సమస్యలు స్వాగతం పలికాయి. కొన్నిచోట్ల చేదు అనుభవాలూ ఎదురయ్యాయి. ఈ మూడేళ్లలో ఏం చేశారని పలువురు వారిని ముఖం మీదే నిలదీశారు. ఏళ్లు గడుస్తున్నా తమ కష్టాలకు పరిష్కారాలు చూపడంలేదని, అర్హతలున్నా సంక్షేమ పథకాలు అందడంలేదని, రోడ్లు అధ్వానంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. పలుచోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు రెండు, మూడు ఇళ్లు తిరిగి వెళ్లిపోయారు. ఇంకొన్నిచోట్ల దాన్ని పార్టీ కార్యక్రమంగా మార్చేశారు. ఎమ్మెల్యేలకు బదులు వారి బంధువులు పాల్గొన్నారు. సమస్యలపై గట్టిగా నిలదీసిన వారిని తెదేపా వారంటూ... స్థానిక నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో మంత్రి అంబటి రాంబాబు... ఆసరా పథకం అంటే ఏమిటో తెలియక పక్కవాళ్లను అడగడం ఆశ్చర్యపరిచింది. తుపాను ప్రభావంతో వర్షాలు పడుతున్న జిల్లాల్లో కార్యక్రమం చేపట్టలేదు.

మాట దాటేసిన మంత్రి జయరాం : ఆలూరు నియోజకవర్గంలోని హత్తిబెళగల్‌లో మంత్రి గుమ్మనూరు జయరాంకు ప్రజలు సమస్యలతో స్వాగతం పలికారు. తన భర్త, బిడ్డ చనిపోయారని పింఛను కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా ఇవ్వడం లేదని జయనమ్మ అనే వృద్ధురాలు గోడు వెళ్లబోసుకున్నారు. ‘రైతు భరోసా, ఆసరా వస్తున్నాయి కదా... ఇంకోటి కావాలంటే ఎలా తల్లీ. మీ పిల్లలకు, మీకు భరోసా ఇవ్వడానికే కదా ముఖ్యమంత్రి ఇన్ని పథకాలు అమలు చేస్తున్నారు’ అని చెప్పి ఆయన ముందుకు వెళ్లిపోయారు. ఎనిమిది రోజులకోసారి నీటిని ఇస్తున్నారని, బోర్లు చెడిపోయాయని, రోడ్డుపై మురుగు నీరు పారుతుంటే, జారి పడుతున్నామని మదర్‌బీ అనే మహిళ చెప్పగా... మంత్రి దానికి సమాధానం చెప్పకుండా, పింఛన్‌, చేయూత, భరోసా వస్తున్నాయా? అంటూ మాట దాటేశారు.

‘ఉపాధి హామీ’ కూలి డబ్బులు రాలేదు : ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బేతంచర్ల పరిధిలోని హెచ్‌.కొట్టాలలో రెండు ఇళ్లను సందర్శించి వెనుదిరిగారు. ఆర్థిక మంత్రి వస్తున్నారని తెలిసి... పెద్ద సంఖ్యలో మహిళలు అక్కడికి చేరుకుని, తమ సమస్యలు వివరించారు.

మీకో నమస్కారం... మీరు రానక్కర్లేదు : ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఎమ్మెల్యే తన ఇంటి వద్దకు రాగానే, వీరమ్మ అనే మహిళ... ‘మాకెవరూ సాయం చేయడం లేదు. ఇప్పుడెందుకు వస్తున్నారు? అవసరం లేదు’ అని దండం పెట్టి ఇంట్లోకి వెళ్లిపోయారు.

* మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి బదులు ఆయన అన్న కుమారుడు ప్రదీప్‌రెడ్డి పెద్దకడుబూరులోని తారాపురంలో పాల్గొన్నారు. తమకు జగనన్న కాలనీలో ఇళ్ల పట్టాలు ఇవ్వలేదని ఎస్సీ కాలనీలో కొందరు ఆయనను నిలదీశారు.

* పత్తికొండలోని మద్దికెరలో ఎమ్మెల్యే శ్రీదేవికి... నాణ్యమైన రేషన్‌ బియ్యం సరఫరా చేయడం లేదని కొందరు నిరసన తెలిపారు.

* శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో ఎంపీ గోరంట్ల మాధవ్‌, ఎమ్మెల్సీ ఇక్బాల్‌ పర్యటించారు. బీసీ కాలనీలో సమస్యలు చెప్పడానికి వచ్చిన స్థానికుల్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయారు.

మంత్రి రోజాపై ప్రశ్నల వర్షం : చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని టీసీ అగ్రహారం, కల్లూరు గ్రామ సచివాలయాల పరిధిలో పర్యటించిన మంత్రి రోజాపై స్థానికులు ధరల పెరుగుదలపై ప్రశ్నల వర్షం కురిపించారు. వాటికి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆమె కాసేపు మౌనం పాటించారు.

పథకాలు అందని వారిని పెద్దిరెడ్డి ముందుకే రానివ్వలేదు : చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం బోడేవారిపల్లెలో విద్యుత్తు, అటవీశాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. సోమల, రొంపిచెర్ల క్రాస్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందిన వారితోనే మంత్రి ఎదుట మాట్లాడించేందుకు స్థానిక నాయకులు తంటాలు పడ్డారు. నిరసన తెలుపుతారనే భయంతో ప్రభుత్వ పథకాలు అందని వారిని మంత్రి ఎదుటకు రాకుండా కట్టుదిట్టం చేశారు.

మా గ్రామానికి ఏం చేశారు? :* కోడుమూరు నియోజకవర్గం దేవమడలో ఎమ్మెల్యే సుధాకర్‌ని స్థానిక మహిళలు... ‘మీరు గెలిచి మూడేళ్లవుతోంది. మా గ్రామానికి ఏం చేశారు? రోడ్లు, మురుగు కాల్వలు అధ్వానంగా ఉన్నాయి’ అని నిరసన తెలియజేశారు.

‘ఆసరా’ అంటే ఏమిటో తెలియని అంబటి : పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం గోళ్లపాడులో మంత్రి అంబటి రాంబాబు.... ప్రభుత్వ పథకాలపై రూపొందించిన బుక్‌లెట్‌ను చేతిలో పట్టుకుని పర్యటించారు. అందులోని పథకాలను వరుసగా చదువుతూ ‘ఇవన్నీ మీకు అందాయి కదా?’ అని చినచెంచయ్య అనే వ్యక్తిని అడిగారు. ఈ క్రమంలో ఆసరా పేరు చదివిన మంత్రి... పక్కనున్న సచివాలయ ఉద్యోగుల్ని ఆసరా అంటే ఏంటని అడిగారు. అది డ్వాక్రా మహిళలకు రుణమాఫీ పథకమని వారు చెప్పారు.

...

మా బిడ్డను హత్య చేసిన వారికి 15 నెలలైనా శిక్ష పడలేదు : డిగ్రీ చదువుతున్న తన కుమార్తె కోట అనూషను 2021 ఫిబ్రవరిలో హత్య చేసిన నిందితుడికి ఇంతవరకు శిక్ష పడలేదని ఆమె తల్లి వనజాక్షి మంత్రి అంబటి రాంబాబు ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. అది కోర్టు పరిధిలో ఉన్నందున, ఆ విషయంలో తానైనా, ముఖ్యమంత్రైనా ఏమీ చేయలేమని, చట్టపరంగా నిందితుడికి శిక్ష పడుతుందని మంత్రి తెలిపారు.

ఊళ్లోకి వెళ్లి రోడ్లు చూడండి : గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం మేరికపూడిలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గ్రామసభలో మాట్లాడుతుండగా... ‘ఇక్కడ కూర్చుని చప్పట్లు కొట్టడం కాదు. ఊళ్లోకి వెళ్లి రోడ్లు చూడండి ఎంత అధ్వానంగా ఉన్నాయో’ అని కోటిరెడ్డి అనే వ్యక్తి నిలదీయడంతో ఆమె అవాక్కయ్యారు.

ప్రభుత్వ కార్యక్రమమైనా పార్టీ ఫ్లెక్సీ : శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం శాసనాంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి తదితరులు పాల్గొన్నారు. ఈ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ‘గడప గడపకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ’ అని ఉండటం గమనార్హం.

‘వారు తెదేపా వాళ్లు లెండి...’ అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలోని అర్జాపురంలో ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీని నిత్యావసరాల ధరలు, కరెంటు ఛార్జీలు పెరగడంపై మహిళలు నిలదీశారు. ‘మన దగ్గరే ధరలు ఇంతగా పెరిగాయా? అన్నిచోట్లా అలాగే ఉన్నాయా’ అని ప్రశ్నించారు. మంత్రి ఏదో చెప్పడానికి సిద్ధపడగా... ‘వాళ్లు తెదేపా వాళ్లు లెండి, అలాగే మాట్లాడతారు’ అంటూ ఉపసర్పంచి అక్కడితో ఆ సంభాషణను ఆపేశారు.

గ్రంధి శ్రీనివాస్‌కు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు? : పార్టీ కోసం శ్రమించినా.. ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ని ఓడించినా.. తమ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌కు సరైన గౌరవం ఇవ్వడం లేదంటూ భీమవరం నియోజకవర్గానికి చెందిన పలువురు వైకాపా కార్యకర్తలు ఆందోళన చేశారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమ నిర్వహణకు సంబంధించి భీమవరంలో బుధవారం జరిగిన సమావేశంలో ప్రజా వ్యతిరేకతను ఎలా అధిగమించాలనే దానిపై నాయకులు చర్చించినట్లు సమాచారం. అనంతరం ముఖ్య నాయకులు బయటకు రాగానే కార్యకర్తలు వారిని నిలువరించి ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌కు మంత్రి పదవి ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: వైకాపా మూడేళ్ల పాలన పూర్తి... గడప గడపకు 'పార్టీ' కాదు.. ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.