ETV Bharat / city

తెలంగాణలో మరో పరువు హత్య.. ఈసారి కన్న కూతురినే హతమార్చిన తల్లిదండ్రులు

author img

By

Published : May 27, 2022, 4:40 PM IST

Honor Killing
పరువుహత్య

Honor Killing: ఈ మధ్య కాలంలో తెలంగాణలో పరువుహత్యలు కలకలం రేపుతున్నాయి. ఒకదాన్ని మర్చిపోయేలోపే ఇంకోటి జరుగుతూ.. భయాందోళనలకు గురి చేస్తున్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్​లోనే ఇటీవల ఒకదాని వెనక ఇంకోటి రెండు పరువు హత్యలు సంచలనం సృష్టించాయి. అవి మరవకముందే.. ఇప్పుడు ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌ మండలం నాగల్‌కొండలో మరో ఘాతుకం వెలుగుచూసింది.

ఇంతవరకు.. తమ ఇంటి ఆడపడుచులను ప్రేమించి వివాహం చేసుకున్నందుకు యువకులను హతమార్చిన ఘటనలు చోటు చేసుకున్నాయి. కానీ.. ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. కన్న కూతుర్నే తల్లిదండ్రులు దారుణంగా చంపుకున్నారు. వేరే మతానికి చెందిన యువకుడిని ప్రేమిస్తోందని తెలిసి.. కుమార్తె రాజేశ్వరి(20)ని కత్తితో గొంతు కోసి హతమార్చారు.

నాగల్​​కొండకు చెందిన పవర్ రాజేశ్వరి.. అదే గ్రామానికి చెందిన ఓ ముస్లిం అబ్బాయి ప్రేమించుకున్నారు. తమ పెళ్లికి ఇద్దరి ఇళ్లలో ఒప్పుకోరని భావించారు. రెండు నెలల క్రితం ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు.. అబ్బాయిపై నార్నూర్ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేయగా.. అబ్బాయిపై పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. చరవాణి సిగ్నల్స్ ద్వారా వీళ్లిద్దరు మహారాష్ట్రలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ఇద్దరినీ నార్నూర్​కు తీసుకువచ్చిన పోలీసులు.. అబ్బాయిని కిడ్నాప్ కేసు కింద అరెస్టు చేసి ఆదిలాబాద్​లోని జైలుకు పంపించారు. అమ్మాయిని తల్లిదండ్రుల వద్ద ఉండాలని తెలిపారు. ఇతర మతస్థుడుని ప్రేమించిందన్న కారణంతో తమ కూతురిపై తల్లిదండ్రులు ద్వేషం పెంచుకున్నారు. ఈరోజు ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో గాఢ నిద్రలో ఉన్న కూతురి గొంతుకోసి కన్న తల్లిదండ్రులే కర్కశంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉట్నూర్​లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.