తెలంగాణ రాష్ట్రంలో ప్రజా రవాణాకు అనుమతించిన నేపథ్యంలో సరిహద్దుల వద్ద వ్యవహరించాల్సిన తీరుపై ఉమ్మడి నల్గొండ జిల్లా అధికారులు సిద్ధమయ్యారు. సరిహద్దుల వద్ద విధులు నిర్వహిస్తున్న క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు.
ప్రస్తుతం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్డు వద్ద, దామరచర్ల మండలం వాడపల్లి, నాగార్జునసాగర్ వద్ద మూడు అంతర్రాష్ట చెక్పోస్టులున్నాయి. ఏపీలోని గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో వాటికి సరిహద్దుల్లో ఉన్న నల్గొండ, సూర్యాపేట చెక్పోస్టుల వద్ద అక్కడి నుంచి వస్తున్న వారికి పరీక్షలు చేసి ఇక్కడి సిబ్బంది హోం క్వారంటైన్ ముద్ర వేస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని చాలా ప్రాంతాలు ఇంకా కంటైన్మెంట్ జోన్లలో ఉండటంతో అక్కడి నుంచి మన రాష్ట్రంలోకి వస్తున్న వారితో పాటూ ఇక్కడి నుంచి అక్కడికి వెళుతున్న వారిలో చాలా మందికి ఆ రాష్ట్ర పోలీసులు అనుమతించడం లేదు.
ఇటీవల కేంద్రం అనుమతితో ఇక్కడి నుంచి వలస కూలీలను ప్రత్యేక బస్సుల్లో ఏపీ ప్రభుత్వం తమ రాష్ట్రానికి తీసుకువెళ్లింది. కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్డు వద్ద, నాగార్జునసాగర్ల వద్ద పరిస్థితి కొంత మెరుగ్గానే ఉండగా...వాడపల్లి వద్ద ఇటు నుంచి వచ్చిన ఏ వాహనాన్నీ అనుమతించడం లేదు.
నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్, గుంటూరు రూరల్ ఎస్పీతో పలుమార్లు మాట్లాడినా పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు. తాజాగా కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసిన నేపథ్యంలో సరిహద్దుల నుంచి రాకపోకలు ఏ విధంగా ఉంటాయనేది ఆసక్తిగా మారింది. నాగార్జునసాగర్ చెక్పోస్టు వద్ద సైతం ఏపీ అధికారులు ఇక్కడి నుంచి వెళుతున్న వారికి క్షుణ్ణంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
పరీక్షల అనంతరమే అనుమతి
యాదాద్రి జిల్లాకు చెందిన 29 మంది వలస కార్మికులకు కరోనా సోకడంతో అధికారులు ఉలిక్కి పడ్డారు. వీరందరికి హైదరాబాద్లోని గాంధీ, కింగ్కోఠి ఆసుపత్రిల్లో చికిత్స చేస్తున్నారు. తాజాగా మహారాష్ట్ర నుంచి వస్తున్న వలస కార్మికులను జిల్లాలోకి అనుమతించద్దని జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయించింది. అక్కడి నుంచి వచ్చే వారిని హైదరాబాద్లోనే ఆపివేసి వారిని ఆసుపత్రుల్లో పరీక్షలు చేసిన తర్వాతే జిల్లాలోకి అనుమతించాలని నిర్ణయించారు.