ETV Bharat / city

లంచాలు ఇస్తున్నది టీచర్లే.. పుచ్చుకుంటున్నది టీచర్లే!

author img

By

Published : Mar 14, 2022, 3:34 PM IST

Telangana Teachers Transfer : తెలంగాణ సర్కార్ తీసుకొచ్చిన 317 జీవోతో ఉపాధ్యాయులు తమ కుటుంబాలకు దూరంగా ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ విషయంలో మనస్తాపానికి గురై కొందరు ఆత్మహత్యలకూ పాల్పడ్డారు. ఈ సమస్యలన్నింటికీ చెక్‌పెడుతూ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. అదే పరస్పర బదిలీలు. దీనిప్రకారం వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్న ఇద్దరు టీచర్లు పరస్పర అంగీకారంతో జిల్లాలు మారొచ్చు. అయితే.. దీన్ని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు..!

Teachers Transfers in telangana
Teachers Transfers in telangana

Telangana Teachers Transfers : తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 317 జీవోతో పలువురు ఉపాధ్యాయులు తమ కుటుంబాలను వదిలి వేరే జిల్లాలోని పాఠశాలలో పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి వారికి ఉపశమనంగా ప్రభుత్వం ఫిబ్రవరి 2వ తేదీన పరస్పర బదిలీలకు అనుమతి ఇచ్చింది. జీవో ప్రకారం వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులు పరస్పర అంగీకారంతో జిల్లాలు మారవచ్చు.

మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వికారాబాద్‌, వనపర్తి, నారాయణపేట తదితర మారుమూల జిల్లాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దీన్ని కొందరు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. హైదరాబాద్‌ శివారు జిల్లాల్లో పనిచేస్తున్న పలువురు మారుమూల జిల్లాలకు రావడానికి రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఒప్పందాలు చేసుకుంటున్నారు. హైదరాబాద్‌ శివారు జిల్లాలో హెచ్‌ఆర్‌ఏ 24 శాతం వస్తుందని, మారుమూల జిల్లాల్లో 11 శాతమే వస్తుందని లెక్కలు చెబుతున్నారు.

కాగా, పదవీ విరమణకు చేరువలో ఉన్నవారు ఎక్కడికైనా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇతరులెవరైనా మరింత ఎక్కువ ఇస్తామని చెబితే ఎక్కడ మనసు మార్చుకుంటారోనని కొందరు ముందుగా కొంత మొత్తాన్ని ఇస్తూ.. లిఖితపూర్వక ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. పరస్పర బదిలీలకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 15వ తేదీ తుది గడువు కావడంతో ఇలాంటి వ్యవహారాలు జోరందుకున్నాయి.

ఇదీ ఒప్పందాల వరస..

  • రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలంలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడొకరు వికారాబాద్‌ జిల్లాకు రావాలంటే రూ.15 లక్షలు డిమాండ్‌ చేస్తున్నారు. ఒకరు రూ.10 లక్షలు ఇస్తానన్నా ఒప్పుకోలేదు.
  • జనగామ జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయుడు తనకు హనుమకొండ వచ్చేందుకు సహకరించేవారికి ఏకంగా 150 గజాల ప్లాట్‌ రిజిస్ట్రేషన్‌ చేయిస్తానని ముందుకొచ్చారు.
  • నారాయణపేట జిల్లాలో పనిచేస్తున్న మహిళా హిందీ పండిట్ ఒకరు రంగారెడ్డి లేదా మేడ్చల్‌ జిల్లాకు రావడానికి రూ.20 లక్షలు ఇచ్చేందుకైనా సిద్ధంగా ఉన్నారు. ఆమె భర్త మేడ్చల్‌ జిల్లాలో వ్యాపారి.
  • రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయుడు ప్రస్తుతం వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలంలో పనిచేస్తున్నారు. తన సొంతూరికి చేరువలో వచ్చేందుకు మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా దుండిగల్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయుడి(ఈయన సొంత జిల్లా వికారాబాద్‌)తో రూ.6.50 లక్షలకు ఒప్పందం కుదుర్చుకొని దరఖాస్తు చేసుకున్నారు.

ఇదీ చదవండి: Bro Anil: మాట ఇచ్చానంటే తప్పుకోను.. పార్టీ పెట్టాలనే డిమాండ్​ ఉంది: బ్రదర్​ అనిల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.