ETV Bharat / city

తెలంగాణలో కీలకంగా మారిన మునుగోడు ఉపఎన్నిక.. పూర్తైన అభ్యర్థుల ఎంపిక

author img

By

Published : Oct 7, 2022, 9:57 PM IST

Munugode By Election: అభ్యర్థులు తేలిపోయారు. నామినేషన్లు షురూ అయ్యాయి. పోలింగ్‌కు మరో నెల రోజులు కూడా లేదు. ఇక ఉపఎన్నికల రణక్షేత్రంలోకి దూకేందుకు అస్త్రశస్త్రాలతో రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. తెలంగాణ మునుగోడులో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌ ఇప్పటికే అభ్యర్థిని ఖరారు చేయగా.. అధికార తెరాస సైతం తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. మరో ప్రధాన పార్టీ భాజపా నుంచి బరిలోకి దిగేందుకు రాజ్‌గోపాల్‌రెడ్డి దాదాపుగా సిద్ధంగా ఉండటంతో.. ఇక మునుగోడు ఉపఎన్నిక రణక్షేత్రాన్ని తలపించనుంది.

Munugode
Munugode

Munugode By Election: ఏడాదిలోపు శాసనసభ ఎన్నికలు. తెలంగాణ రాష్ట్ర వేదికగా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు సిద్ధమైన అధికార పార్టీ. ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకునేందుకు వ్యూహాలు పన్నుతున్న భాజపా. చావో రేవో తెల్చుకునేందుకు సిద్ధమైన కాంగ్రెస్‌. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో వచ్చిన మునుగోడు ఉపఎన్నిక రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్‌ తరఫున గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. ఆ పార్టీని వీడటం, ఎమ్మెల్యే పదవికి రాజీనామాతో ఉపఎన్నిక అనివార్యమైంది. ప్రధాన పార్టీల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికగా మునుగోడు పోరును రాజకీయ పార్టీలు ఛాలెంజ్‌ తీసుకుంటున్న తరుణంలో.. గెలుపే లక్ష్యంగా ఎవరికి వారు తొలి నుంచి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

ఉపఎన్నికను సవాల్​గా తీసుకున్న తెరాస.. ఎనిమిదన్నరేళ్లుగా అధికారంలో ఉండి... తిరుగులేని విజయాలు సొంతం చేసుకున్న తెరాస... అనంతరం వచ్చిన జీహెచ్​ఎంసీ, దుబ్బాక, హుజురాబాద్‌ ఫలితాలతో నిరాశకు గురయ్యే పరిస్థితి వచ్చింది. ఈ ఎదురుదెబ్బలను విశ్లేషించుకున్న గులాబీ పార్టీ.. ప్రత్యర్థులకు ఏ చిన్న అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడుతోంది. రాష్ట్రంలో బలపడుతున్న భాజపా, జాతీయ రాజకీయాల్లో అడుగుపెడుతున్న సందర్భంలో మునుగోడు ఉపఎన్నిక తెరాసకు సవాల్‌గా మారింది. సీఎం కేసీఆర్ ఇమేజ్, ప్రభుత్వ సంక్షేమ పథకాలనే ప్రధానంగా నమ్ముకొని బరిలోకి దిగుతున్న ఆ పార్టీ ఇప్పటికే తెరాస దాదాపు అన్ని గ్రామాల్లో ఒక విడత ప్రచారాన్ని పూర్తి చేసింది. ఆత్మీయ సమ్మేళనాలు, దళిత వాడల్లో సహపంక్తి భోజనాలు వంటి కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లింది. కేటీఆర్, హరీశ్​ రావు సహా 86 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు త్వరలోనే నియోజకవర్గంలో దిగనున్నారు.

సుమారు 2వేల ఓటర్లకు ఒక కీలక నేతకు బాధ్యత అప్పగించారు. తెరాస పేరు మార్పు, భారాస ప్రకటన అంశంపై ఇప్పటి వరకు నిమగ్నమైన కేసీఆర్.. ఇక పోలింగ్ ముగిసే వరకు మునుగోడుపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. గతంలో మునుగోడులో సభ నిర్వహించిన కేసీఆర్.. ప్రచార గడువు ముగిసే ఒకటి, రెండు రోజుల ముందు చండూరులో భారీ సభ పెట్టేందుకు వ్యూహాలు సిద్ధం చేశారు. సర్వేలు అనుకూలంగా ఉన్నప్పటికీ... ప్రత్యర్థులను తక్కువ అంచనా వేయకుండా చివరి వరకు అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. వామపక్షల పొత్తు మునుగోడులో కచ్చితంగా లాభం చేకూరుస్తుందనే ఆశతో గులాబీ పార్టీ ఉంది. సీపీఐ, సీపీఎం ఓట్లన్నీ తెరాసకే బదిలీ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెరాస, వామపక్షాల నేతలతో గ్రామస్థాయి నుంచి సమన్వయ కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు.

చావో రేవో తేల్చుకునేందుకు సిద్ధమైన కాంగ్రెస్‌.. మరో ప్రధాన పార్టీ కాంగ్రెస్... మునుగోడు ఉప ఎన్నికల ప్రచారాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న హస్తం పార్టీ... సిట్టింగ్‌ స్థానాన్ని కైవసం చేసుకోవటమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే దివంగత నేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె స్రవంతిని బరిలోకి దించిన కాంగ్రెస్‌... బూత్‌ స్థాయిలో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. నియోజక వర్గంలోని మొత్తం బూతులను ఒక్కో క్లస్టర్‌ పరిధిలోకి పదేసి లెక్కన 30 వరకు విభజన చేశారు.

బూతు స్థాయిలో సమన్వయకర్తలను ఏర్పాటు చేయడంతోపాటు క్లస్టర్‌ స్థాయిలో ఇంఛార్జిలను, ప్రతి మండలానికి ఇద్దరు నుంచి ముగ్గురు వరకు అటాచ్‌మెంట్‌ ఇంఛార్జిలను నియమించారు. వీరు కాకుండా మండలాలకు, మున్సిపాలిటీలకు వేర్వేరుగా సీనియర్‌ నాయకులు ఇంచార్జిలుగా కొనసాగుతున్నారు. వీరంతా కూడా రేపటి నుంచి 14వ తేదీ వరకు క్షేత్రస్థాయిలో ఉండి ప్రచారం వేగవంతం చేయనున్నారు. అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఇప్పటికే 5 మండలాల్లో ఇంటింటి ప్రచారం పూర్తి చేయగా మరో రెండు మండలాలు చేయాల్సి ఉంది. పాల్వాయి స్రవంతి తరఫున ఈ నెల 11న రెండు సెట్లు నామినేషన్లు వేస్తారు. ఆ తరువాత 14న భారీ జనసమీకరణతో మరొకసారి నామినేషన్లు వేయనున్నారు.

విజయమే లక్ష్యంగా కమలదళం కసరత్తులు.. ఇక మునుగోడులో భాజపా సైతం దూకుడు పెంచింది. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి భాజపాలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి... స్థానికంగానే ఉంటూ ప్రచారం చేస్తున్నారు. పలు పార్టీలకు చెందిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలను భాజపాలో చేర్చుకుంటూ పార్టీని స్థానికంగా బలోపేతం చేస్తున్నారు. సోమవారం రాజగోపాల్‌రెడ్డి నామినేషన్‌ వేసే అవకాశం ఉందని భాజపా నేతలు పేర్కొన్నారు. ఇవాళ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సన్నాహక సమావేశం జరగనుండగా... స్టీరింగ్‌ కమిటీ సభ్యులు, మండల ఇంఛార్జ్‌లు, ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీల నేతలు హాజరుకానున్నారు. భాజపా జాతీయ కార్యదర్శి సునీల్‌ బన్సల్‌, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ తరుణ్‌చుగ్‌ కూడా పాల్గొని విజయమే లక్ష్యంగా పనిచేయాలని శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.