APMDC: 'ఎవరికి సబ్ లీజుకు ఇచ్చారనేది ప్రభుత్వానికి అనవసరం'

author img

By

Published : May 15, 2022, 4:46 AM IST

minister peddireddy on sand mining

Sand Mining in AP: కొత్త ఇసుక విధానంలో అంతా పారదర్శకంగా జరుగుతోందని, ఎక్కడా అక్రమాలు లేవని గనుల శాఖ డైరెక్టర్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఇసుక తవ్వకాలకు టెండర్​ దక్కించుకున్న జేపీ సంస్థ.. ఎవరికి సబ్ లీజుకు ఇచ్చిందన్న అంశం ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. మరోవైపు.. ఇసుక తవ్వకాల ఆరోపణలపై మంత్రి పెద్దిరెడ్డి స్పందించారు. సబ్‌కాంట్రాక్టు ఎవరికి ఇవ్వాలనేది ప్రభుత్వం నియంత్రించలేదన్నారు.

రాష్ట్రంలో ఇసుక మైనింగ్‌లో ఎక్కడా ఇప్పటి వరకు ఉల్లంఘనలు జరగలేదని గనుల శాఖ ప్రకటించింది. గడచిన ఏడాదిగా ప్రజల నుంచి ఇసుక తవ్వకాలకు సంబంధించి ఒక్క ఫిర్యాదూ రాలేదని గనుల శాఖ డైరెక్టర్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో జరిగిన బిడ్డింగ్​లో జేపీ వెంచర్స్ రాష్ట్రంలో ఇసుక తవ్వకాల టెండర్​ను దక్కించుకుందని వెల్లడించారు. ఆ సంస్థ ఎవరికైనా సబ్ లీజ్ ఇచ్చుకునే వెసులుబాటు ఉందన్నారు. ఎవరికి సబ్ లీజుకు ఇచ్చారన్న అంశం ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. అధికారికంగా జేపీ వెంచర్స్​తోనే ఏపీఎండీసీ లావాదేవీలు నిర్వహిస్తుందని గనుల శాఖ డైరెక్టర్ తెలిపారు.

టర్న్​కీ సంస్థ సబ్ లీజుకు తీసుకుని తవ్వకాలు చేస్తే ప్రభుత్వానికి ఏం సంబంధం అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటి వరకూ 1 కోటీ 70 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వకాలు జరిగాయన్నారు. ఇందులో 1 కోటి మెట్రిక్ టన్నుల ఇసుక విక్రయాలు చేశారని తెలిపారు. దీనికి సంబంధించిన రూ. 668 కోట్లను జేపీ వెంచర్స్ ప్రభుత్వానికి చెల్లించిందన్నారు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాల్లో ఎక్కడా అక్రమాలు చోటు చేసుకోలేదని గనుల శాఖ, ఎస్ఈబీ, పోలీసు విభాగం ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నాయని వెల్లడించారు. ఇప్పటి వరకూ ప్రజల నుంచి ఒక్క ఫిర్యాదు రాలేదన్నారు.

సబ్‌కాంట్రాక్టు ఎవరికి ఇస్తారో వాళ్లిష్టం: ఏదైనా ఒక కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ సబ్‌ కాంట్రాక్టుకు ఇవ్వడం అసాధారణం కాదని, రాష్ట్రంలో ఇసుక కాంట్రాక్టు దక్కించుకున్న జేపీ సంస్థ టర్న్‌కీ సంస్థకు అలాగే సబ్‌కాంట్రాక్టు ఇచ్చిందని గనులు, ఇంధన, అటవీ, పర్యావరణశాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ‘సబ్‌కాంట్రాక్టుకు ఇవ్వడం ప్రభుత్వం పరిధిలోకి రాదు. సబ్‌కాంట్రాక్టు ఎవరికి ఇవ్వాలన్నది ప్రభుత్వం నియంత్రించలేదు. ఒప్పందం ప్రకారం చట్టబద్ధంగా జరుగుతోందా.. లేదా? అనే ప్రభుత్వం చూస్తుంది’ అని తెలిపారు. ఇసుక తవ్వకాలపై ఈటీవీ భారత్​తో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు.

‘రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, విక్రయాల్లో తమిళం మాట్లాడేవారు ఎక్కువగా పని చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పనిలో ప్రావీణ్యం ఉన్నవారు ఉండొచ్చు. సెంట్రింగ్‌ పనికి ఝార్ఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి, రాడ్‌ బెండింగ్‌ పనికి పశ్చిమబెంగాల్‌ నుంచి ఎక్కువగా వస్తారు. ఇసుక పనులు చేసేవారు తమిళనాడు నుంచి గానీ మరెక్కడి నుంచైనా గానీ రావొచ్చు. ఇసుక తవ్వకాలు, రవాణాలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఎస్‌ఈబీని ఏర్పాటు చేశాం. ఫిర్యాదు చేసేందుకు టోల్‌ఫ్రీ నంబరు ఉంది. ఎవరు ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చేస్తున్నాం. ఇప్పటికే వేల కేసులు నమోదు చేసి, 1,400 వాహనాల్ని సీజ్‌ చేశాం. సీసీ కెమెరాలున్నాయి. 485 చెక్‌పోస్టులు, రీచ్‌ల దగ్గర వేబ్రిడ్జిలు పెట్టాం. ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లిస్తేనే టోకెన్‌, వే బిల్లులు జనరేట్‌ అవుతాయి. ఆన్‌లైన్‌ ద్వారానే చెల్లింపులు జరుగుతున్నాయి’ అని పెద్దిరెడ్డి వెల్లడించారు.

ఇదీ చదవండి: రేవుల్లో ఆ తమిళ కంపెనీదే రాజ్యం.. వాళ్లు ఎంతంటే అంతే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.