Maoist leader RK: మావోయిస్టు అగ్రనేత ఆర్కే కన్నుమూత

author img

By

Published : Oct 14, 2021, 8:13 PM IST

Updated : Oct 15, 2021, 4:14 AM IST

top Maoist leader RK died

20:10 October 14

మరణాన్ని ధ్రువీకరించిన పోలీసులు

 

...

మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ఆర్కే (60) అనారోగ్యంతో కన్నుమూశారు. గుంటూరు జిల్లా రెంటచింతల మండలం తుమృకోట గ్రామానికి చెందిన ఆయన తీవ్రమైన మధుమేహం, కీళ్ల నొప్పులు, కిడ్నీ వ్యాధితో  ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో గురువారం మృతి చెందారు. మూడేళ్లుగా ఆయన ఎముకల క్యాన్సర్‌తోనూ బాధపడుతున్నట్లు సమాచారం. ఆర్కే మరణాన్ని పోలీసులు ధ్రువీకరించారు. ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్న ఆయన ఆంధ్ర ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ఇన్‌ఛార్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. 38 ఏళ్ల క్రితం ఉద్యమంలోకి వెళ్లిన ఆర్కే 2004లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జరిపిన చర్చలకు  ఆంధ్ర రాష్ట్ర కమిటీ ప్రతినిధిగా హాజరయ్యారు. 2004 అక్టోబరు 15, 16, 17 తేదీల్లో చర్చలు జరిగాయి. ఆ ఘట్టం మొదలై శుక్రవారానికి సరిగ్గా 17 ఏళ్లు.  సాకేత్‌, శ్రీనివాసరావు, ఎస్వీ, సంతోష్‌, గోపాల్‌, పంతులు ఆయన మారుపేర్లు.

చర్చల ప్రతినిధి

మావోయిస్టు ఉద్యమంలో అత్యంత కీలకమైన శాంతి చర్చల ప్రస్తావన రాగానే ఆర్కే గుర్తొస్తారు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పీపుల్స్‌వార్‌కు మూడు రాష్ట్ర కమిటీలు ఉండేవి. ఉత్తర తెలంగాణ నుంచి గాజర్ల రవి అలియాస్‌ గణేశ్‌, ఏవోబీ తరఫున సుధాకర్‌, ఆంధ్ర రాష్ట్ర కమిటీ వైపున రామకృష్ణ, జనశక్తి తరఫున రియాజ్‌ హాజరయ్యారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది సంస్థలో మూడు రోజులపాటు చర్చలు జరిగాయి.

ఆది నుంచీ ఉద్యమబాటే

గుంటూరు జిల్లా మాచర్లలో డిగ్రీ చదువుతున్నప్పుడు ఆయన రాడికల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ కార్యకలాపాల్లో పాల్గొనేవారు. అప్పుడే ఆయనకు పీపుల్స్‌వార్‌తో పరిచయాలు ఏర్పడ్డాయి. కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఆయన 1983లో పీపుల్స్‌వార్‌లో చేరారు. అజ్ఞాతంలోకి వెళ్లి ఎక్కువగా నల్లమల అడవుల్లోనే పనిచేశారు. గుంటూరు జిల్లా కమిటీ కార్యదర్శిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్‌ కమిటీ కార్యదర్శిగా 1996 నుంచి 2006 వరకు ఉన్నారు.2008 నుంచి 2016 వరకూ ఏవోబీ కార్యదర్శిగా పనిచేశారు. తర్వాత కేంద్ర కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొందారు. అప్పటికే మావోయిస్టు ఉద్యమంపై పోలీసులది పైచేయి కావడం, వరుస ఎన్‌కౌంటర్లలో అగ్రనేతలు చనిపోవడంతో మావోయిస్టు కేంద్ర నాయకత్వం ముఖ్యమైన నాయకులను ఛత్తీస్‌గడ్‌లోని అబూజ్‌మడ్‌కు రమ్మని ఆదేశించింది. పదేళ్లుగా ఛత్తీస్‌గఢ్‌లోనే ఉంటున్న ఆయన కొంతకాలం సెంట్రల్‌ రీజనల్‌ బ్యూరో సభ్యుడిగా కూడా కొనసాగారు.

...

పెద్దసంఖ్యలో కేసులు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌ రాష్ట్రాల్లో ఆర్కేపై పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయి. ఇందులో ప్రధానమైంది చంద్రబాబునాయుడిపై అలిపిరిలో జరిగిన ఘటన. బలిమెలలో గ్రేహౌండ్స్‌ బలగాలపై జరిగిన దాడిలోనూ ఆర్కే నిందితుడు. ఆయనపై ఒడిశా రూ.20 లక్షలు, ఛత్తీస్‌గఢ్‌  రూ.40 లక్షలు, ఝార్ఖండ్‌ రూ.12 లక్షలు, తెలంగాణ ప్రభుత్వం రూ.25 లక్షల రివార్డు ప్రకటించింది.

వ్యక్తిగత జీవితం

ఉద్యమంలోనే కందుల నిర్మల అలియాస్‌ శిరీష అలియాస్‌ శారద అలియాస్‌ పద్మ అలియాస్‌ శిరీషతో పరిచయమైంది. పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు.ఆమె డివిజన్‌కమిటీ సభ్యురాలిగా పనిచేశారు.

ఉద్యమంలోనూ ఉపాధ్యాయుడే

స్వతహాగా ఉపాధ్యాయుడైన ఆర్కే ఉద్యమంలోనూ అదే పంథా కొనసాగించారు. పెద్దమనిషి తరహాలో వ్యవహరిస్తూ ఉద్యమంలోకి వచ్చేవారికి శిక్షణ తరగతులు నిర్వహించేందుకు ప్రాధాన్యం ఇచ్చేవారు. దాదాపు 20 ఏళ్లపాటు నల్లమలలో పనిచేసి అక్కడి యువత ఉద్యమంపట్ల ఆకర్షితులు కావడంలో కీలకపాత్ర పోషించారు. కేంద్ర కమిటీకి వెళ్లిన తర్వాత ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ ముఖ్యమైన సమావేశాలకు మాత్రం హాజరయ్యేవారు. మంచంమీద పడుకోబెట్టుకొని మరీ సహచరులు ఆయనను మోసుకుంటూ వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయని సమాచారం.

చుట్టుముట్టిన గ్రేహౌండ్స్‌ బలగాలు

శాంతి చర్చలు ముగిసిన 15 రోజులకే ఆర్కేను గ్రేహౌండ్స్‌ బలగాలు చుట్టుముట్టాయి. చిత్తూరు జిల్లాలోని శేషాచలం కొండల్లో ఆర్కే ఆచూకీ కనుగొన్న పోలీసులు ఆయనను చుట్టుముట్టాయి. విషయం తెలియగానే విరసం నేత వరవరరావు మొదలు ప్రజాసంఘాల నేతలు హుటాహుటిన అప్పటి హోంమంత్రి జానారెడ్డిని కలిశారు. అయితే ఆర్కేని పోలీసు బలగాలు చుట్టుముట్టినట్లు పోలీసులు మాత్రం ధ్రువీకరించలేదు.

తృటిలో తప్పించుకొని

2016 అక్టోబరు 23న ఒడిశాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్లో ఆర్కే త్రుటిలో తప్పించుకున్నారు.ఈ ఘటనలో మొత్తం 30 మంది మావోయిస్టులు చనిపోయారు. మావోయిస్టులు ఏర్పాటు చేసిన సమావేశంపై గ్రేహౌండ్స్‌ దళాలు విరుచుకుపడ్డాయి. అప్పటికే నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ తోటి మావోయిస్టుల సాయంతో ఈ సమావేశానికి హాజరయ్యారు. పోలీసులు కాల్పులు జరుపుతుండగానే సహచరులు ఆర్కేని తప్పించారు. అయినప్పటికీ ఆయకు బుల్లెట్‌ గాయం అయిందని పోలీసులు చెబుతున్నారు. ఇదే ఎన్‌కౌంటర్లో ఆయన కుమారుడు పృథ్వీ అలియాస్‌ శివాజీ అలియాస్‌ మున్నా చనిపోయాడు. తల్లి శిరీషతో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్న మున్నా తండ్రిని కలిసి వస్తానని చెప్పి 2010లో ఒడిశా వెళ్లి ఉద్యమంలో చేరాడు. అంతకు ముందు కూడా ఆర్కే అనేకసార్లు పోలీసుల కాల్పుల నుంచి బయటపడ్డారు.

కుటుంబమంటే ఎంతో ఇష్టం

...

  తల్లిదండ్రులు, సోదరులంటే ఆర్కేకు ఎంతో ఇష్టం. ఉద్యమం కోసం అడవుల బాటపట్టిన తొలినాళ్లలో వారిని చూడటానికి రహస్యంగా మూడుసార్లు హైదరాబాద్‌కు వచ్చి వెళ్లారు. ఈ విషయాన్ని ఆయన సోదరుడు రాధేశ్యాం తెలిపారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో ఉంటున్న ఆయన, ఆర్కే చనిపోయారన్న విషయం తెలిసి, గురువారం ‘ఈనాడు’ ప్రతినిధితో మాట్లాడారు. మరో సోదరుడు సుబ్బారావుతో కలిసి అన్నతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన మాటల్లోనే... ‘‘ మా కుటుంబం 1980 దశకంలో హైదరాబాద్‌కు వచ్చింది. తల్లిదండ్రులు రాజ్యలక్ష్మి, సచ్చిదానందరావు. మేము ఆరుగురు సంతానం. అయిదుగురు మగపిల్లలు కాగా ఒక కుమార్తె. ఆర్కే పెద్దవాడు. తండ్రి కూడా ఆర్‌ఎస్‌యూ భావజాలం కలిగి ఉండేవారు. రాజేంద్రనగర్‌లోని స్ప్రింగ్‌ఫీల్డ్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా ఉండేవారు. ఆర్కే అదే పాఠశాలలో 1980 నుంచి 1981 వరకు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. తరువాత పీపుల్స్‌వార్‌లో చేరి అడవుల బాటపట్టారు. 1981-90 మధ్య తల్లిదండ్రులను చూసేందుకు పోలీసుల కళ్లుగప్పి మూడు సార్లు రాజేంద్రనగర్‌కు వచ్చారు. రోజంతా కుటుంబసభ్యులతో గడిపి రెండు పూటలా భోజనం చేసి వెళ్లారు. 1990 తరువాత ఒక్కసారి కూడా రాలేదు. చర్చల సమయంలో ఇంటికి వచ్చి తల్లిని, ఇతర కుటుంబసభ్యులను కలిసేందుకు ఆయన ఆసక్తి చూపినా, శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయన్న అనుమానంతో పోలీసులు నిరాకరించారు. దాంతో కుటుంబ సభ్యులందరం చర్చల ప్రాంతానికే వెళ్లి అన్నను కలిసి మాట్లాడటం సంతృప్తి నిచ్చింది.మూడేళ్ల కిందట బలిమెల ఎన్‌కౌంటర్‌లో ఆర్కే కుమారుడు పృథ్వీ చనిపోయినప్పుడు వెళ్లి వదినను కలిశాం. అతని అంత్యక్రియల్లో పాల్గొన్నాం. పోలీసుల నిఘా అధికంగా ఉండటం వల్ల కొన్నేళ్లుగా వదినతోకూడా మాట్లాడే ప్రయత్నం చేయలేదు.

అనుమతిస్తే అంత్యక్రియలకు సిద్ధం

ప్రస్తుతం ఇద్దరు సోదరులు నైజీరియాలో ఉండగా మరో సోదరుడు సుబ్బారావు, నేను రాజేంద్రనగర్‌లో ఉంటున్నాం. సోదరి ఎల్బీనగర్‌లో ఉంటోంది. తండ్రి సచ్చిదానందరావు 2003లో, తల్లి రాజ్యలక్ష్మి 2013లో చనిపోయారు. తల్లి చనిపోయినప్పుడు ఆర్కే వస్తాడేమోనన్న సమాచారంతో రాజేంద్రనగర్‌లో పోలీసులు కాపు కాశారు. ప్రస్తుతం తెరాస స్థానిక నాయకుడిగా కొనసాగుతున్నా. ఆర్కే చనిపోయిన విషయం అధికారికంగా గురువారం రాత్రి వరకు తెలియదు. వదినకు ఫోన్‌ చేద్దామంటే నంబరు లేదు. ప్రభుత్వాలు అవకాశమిస్తే ఆర్కే మృతదేహానికి అంత్యక్రియలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం’’ అని రాధేశ్యాం వివరించారు.

చదువరి.. వామపక్షవాది

...

     మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ఆర్కే విద్యాభ్యాసం పల్నాడులోనే సాగింది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా రెంటచింతల మండలం తుమృకోటలో 1 నుంచి 10వ తరగతి వరకు, మాచర్ల కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్‌, డిగ్రీ చదివారు. చదువుకునేటప్పుడు సౌమ్యుడిగా, చదువరిగా ఉండేవాడని ఆయనతోపాటు ఇంటర్‌, డిగ్రీ కలిసి చదువుకున్న ఓ న్యాయవాది వ్యాఖ్యానించారు.

      ఆర్కే మాచర్ల ప్రభుత్వ కళాశాలలో ఇంటర్‌, డిగ్రీ చదివే సమయంలో రాడికల్‌ విద్యార్థి సంఘంలో పనిచేశారు. డిగ్రీ తర్వాత  గుత్తికొండకు వెళ్లారు. రామకృష్ణ గుత్తికొండలో ప్రైవేటు టీచరుగా పనిచేస్తూ విద్యార్థులను పీపుల్స్‌వార్‌ ఉద్యమంలోకి తీసుకొచ్చారు. మావోయిస్టు ఉద్యమ వ్యవస్థాపకుడు చారుమజుందార్‌ను తీసుకొచ్చి గుంటూరు వైద్యకళాశాలలో సమావేశం నిర్వహించారు.

సారాపై ఉద్యమం

పల్నాడులో ఫ్యాక్షనిజానికి వ్యతిరేకంగా ఆర్కే ఉద్యమించారు. పల్నాడు కేంద్రంగా సారా గుత్తేదారులపై దాడులకు పాల్పడి వానని గ్రామాల నుంచి తరిమేశారు. పల్నాడులో ఫ్యాక్షనిజం రూపుమాపడానికి కృషిచేశారు. ఆయన భావాలకు ఆకర్షితులై జూలకల్లు, పిడపర్తివారిపాలెం, గుంటూరు నగరానికి చెందిన డేవిడ్‌, నూనె నరసింహారెడ్డి, అప్పారావు, చింతల వెంకటస్వామి వంటి ప్రధాన నేతలు ఆయనతో పాటు మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్లారు.

ఇదీ చదవండి.. 

CM REVIEW: కరెంట్​ కోతలు లేకుండా చర్యలు చేపట్టాలి: సీఎం జగన్

Last Updated :Oct 15, 2021, 4:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.