ETV Bharat / city

పాఠాలు చెప్పేవారు లేకనే.. పదో తరగతి పరీక్షల్లో 50%లోపే ఉత్తీర్ణత

author img

By

Published : Jun 15, 2022, 8:05 AM IST

Lack of teachers: ప్రభుత్వ, జిల్లా పరిషత్తు, పురపాలక పాఠశాలల్లో.. ఉపాధ్యాయుల కొరత కారణంగా పదోతరగతి ఉత్తీర్ణత శాతం తీవ్రస్థాయిలో తగ్గిపోయింది. రాష్ట్ర సరాసరి ఉత్తీర్ణత 67.26% కాగా.. ప్రభుత్వ ఆధ్వర్యంలోని పాఠశాలల్లో 50 శాతంలోపే ఉంది.

less percentage in tenth class due to lack of teachers in ap
పదో తరగతి పరీక్షల్లో ఎక్కువ బడుల్లో 50%లోపే ఉత్తీర్ణత

Lack of teachers: ప్రభుత్వ, జిల్లా పరిషత్తు, పురపాలక పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత కారణంగా పదోతరగతి ఉత్తీర్ణత ఘోరంగా పడిపోయింది. రాష్ట్ర సరాసరి ఉత్తీర్ణత 67.26% కాగా.. ప్రభుత్వ ఆధ్వర్యంలోని పాఠశాలల్లో 50 శాతంలోపే ఉంది. ఏపీ రెసిడెన్షియల్‌ పాఠశాలలు 91.10% ఉత్తీర్ణత సాధించగా.. ప్రభుత్వ పాఠశాలలు 50.10%తో అట్టడుగున నిలిచాయి. అత్యంత దారుణంగా 22 బడుల్లో ఒక్కరూ ఉత్తీర్ణత సాధించలేదు. వీటి డొల్లతనం బయటపడకుండా ఈ ఏడాది యాజమాన్యాల వారీగా ఫలితాలనే విడుదల చేయలేదు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, జిల్లా పరిషత్తుల్లో 1,795, పురపాలక బడుల్లో 1,450 మంది సబ్జెక్టు ఉపాధ్యాయుల ఖాళీలు ఉన్నాయి. గణితం, సామాన్య, సాంఘిక శాస్త్రం సబ్జెక్టుల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్‌ కావడానికి ఇదే కారణమైంది. మరోవైపు తక్కువ ఫలితాలకు ఉపాధ్యాయులనే బాధ్యులను చేస్తూ షోకాజ్‌ నోటీసులు ఇస్తున్నారు. ఉమ్మడి

గుంటూరు జిల్లా సాతులూరు పాఠశాలలో 13 సెక్షన్లు ఉండగా.. ఒక్కరే సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడు ఉండడంతో తెలుగు, ఆంగ్ల ఉపాధ్యాయులతోపాటు ప్రధానోపాధ్యాయుడు సాంఘిక శాస్త్రాన్ని బోధించారు. కొన్నిచోట్ల ఉపాధ్యాయుల కొరత ఉండడంతో సెక్షన్లను కలిపేయడంతో వెనక కూర్చున్న విద్యార్థులకు పాఠాలు సరిగా అర్థం కాలేదు.

నియామకాలు లేకుండా ఎన్నాళ్లు?.. ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను మూడేళ్లుగా సర్దుబాటుతోనే నెట్టుకొస్తున్నారు. విద్యార్థులు 6లక్షలు పెరిగారని ప్రకటించిన ప్రభుత్వం అదనంగా ఉపాధ్యాయులను నియమించలేదు. పదోతరగతి కీలకం కావడంతో ప్రతి ఏడాది టీచర్లు ఈ విద్యార్థులపైనే దృష్టి సారిస్తున్నారు. దాంతో 6-9 తరగతుల్లో సరైన బోధన జరగడంలేదు. వీరు పదోతరగతికి వచ్చి చతికిలపడుతున్నారు.

పురపాలక పాఠశాలల్లో వాలంటీర్లను నియమించాలని మొదట పురపాలక శాఖ కమిషనర్‌ ఆదేశాలు జారీ చేసినా ఆ తర్వాత నిలిపివేశారు. పాఠశాలల నుంచి ఒత్తిడి రావడంతో కొన్నిచోట్ల పుర, వాలంటీర్లను నియమించారు.

‘ప్రభుత్వం’లో ఫలితాలు దారుణం.. అన్నమయ్య జిల్లా చిట్వేలి ఉన్నత పాఠశాలలో 1,483 మంది విద్యార్థులు ఉండగా 15 సబ్జెక్టు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడి 288 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాస్తే 128 మందే ఉత్తీర్ణులయ్యారు. ఇలా ఉపాధ్యాయులే లేకుండా విద్యార్థులను పరీక్షలకు ఎలా సన్నద్ధం చేస్తున్నారు?

  • అనంతపురం జిల్లా డీ.హిరేహాళ్‌ మండలం గొడసాలపల్లి ఉన్నత పాఠశాలలో మొత్తం 445 మంది విద్యార్థులు ఉండగా 13 సబ్జెక్టు ఉపాధ్యాయ పోస్టులను ఖాళీగా వదిలేశారు. 74 మంది పదో తరగతి పరీక్షలకు హాజరైతే 14 మందే పాసయ్యారు. దీనికి బాధ్యులు ఎవరు? ఈ జిల్లా సరాసరినే 50శాతంలోపు ఉత్తీర్ణులయ్యారు.
  • ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ప్రభుత్వ, జిల్లాపరిషత్తు, పురపాలక, ఎయిడెడ్‌ పాఠశాలల్లో కలిపి 39.66% ఉత్తీర్ణత నమోదైంది. ప్రైవేటు బడుల్లో 87.42% మంది ఉత్తీర్ణులయ్యారు. హాస్టల్‌ వసతి ఉన్న ప్రభుత్వ ఆంగ్ల మాధ్యమ బడుల్లో 63.24% ఫలితాలు వచ్చాయి.
  • ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో 47.40% మంది ఉత్తీర్ణులవగా.. ప్రైవేటులో ఏకంగా 83.78% మంది ఉత్తీర్ణత సాధించారు. దాదాపు రెండింతలు ఎక్కువగా ప్రైవేటు బడుల్లో ఫలితాలు వచ్చాయి.
  • ఉమ్మడి అనంతపురంలో ప్రభుత్వ పాఠశాలల్లో 37.49% మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ప్రైవేటు బడుల్లో ఉత్తీర్ణత 74.73% కావడం గమనార్హం.
  • గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో 52.49%, వసతి ఉన్న ప్రభుత్వ ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లో 65.47%, ప్రైవేటు పాఠశాలల్లో 87.9% మంది ఉత్తీర్ణులయ్యారు.
  • పల్నాడు జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో 48.89% మంది ఉత్తీర్ణత సాధించగా.. ప్రైవేటులో మాత్రం 87.79% మంది పాస్‌ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ బడుల్లోనూ దాదాపు ఇలాంటి ఫలితాలే వచ్చాయి. ప్రభుత్వం ఫెయిల్‌ అయిన విద్యార్థులకు పునశ్చరణ తరగతులు ప్రారంభించిన నేపథ్యంలో ఇలాంటి వాస్తవాలు బయటకు వస్తున్నాయి.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.