ETV Bharat / city

ప్రతిభావంతులకు ప్రోత్సాహం దక్కేనా? ... స్పష్టత ఇవ్వని ప్రభుత్వం

author img

By

Published : Jul 30, 2020, 9:55 AM IST

ప్రతిభావంతులైన నిరుపేద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కార్పొరేట్‌ కళాశాలల్లో ప్రవేశాలు కల్పించడంపై స్పష్టత లేకుండా పోయింది. కరోనా తగ్గుముఖం పట్టకపోవడంతో విద్యా సంస్థలను తెరిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించలేదు. దీంతో బీఏఎస్‌ పథకంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రవేశాలు కల్పించే విషయంలో రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి సమాచారం జిల్లా అధికారులకు లేదు.

lack of clarity on admissions in colleges
ప్రతిభావంతులకు ప్రోత్సాహం దక్కేనా

ప్రతిభావంతులైన నిరుపేద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కార్పొరేట్‌ కళాశాలల్లో ప్రవేశాలు కల్పించడంపై స్పష్టత లేకుండా పోయింది. ఏటా విద్యా ఏడాది ప్రారంభంలో 1, 5 తరగతుల్లో మంచి పేరెన్నిక గల పాఠశాలల్లో బీఏఎస్‌ పథకం కింద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహించి ప్రవేశాలు కల్పించేవారు. మార్చి నెలలో కరోనా వైరస్‌ నివారణకు పాఠశాలలకు సెలవులు ఇచ్చి లాక్‌డౌన్‌ అమలు చేయడంతో 2019-20 విద్యా సంవత్సరం ముగిసిపోయింది. ఏటా జూన్‌ 12న ప్రభుత్వ పాఠశాలలు పునః ప్రారంభమవుతాయి.

కరోనా తగ్గుముఖం పట్టకపోవడంతో విద్యా సంస్థలను తెరిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించలేదు. దీంతో బీఏఎస్‌ పథకంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రవేశాలు కల్పించే విషయంలో రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి సమాచారం జిల్లా అధికారులకు లేదు. 2020-21 విద్యా సంవత్సరం సెప్టెంబరు 5 నుంచి ప్రారంభమవుతుందని, పాఠశాలలను తెరుస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటించారు. ఈ నెల 27 నుంచి పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలకు అనుమతి ఇచ్చారు. కరోనాని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ గురుకుల, ఆదర్శ పాఠశాలలు, కేజీబీవీల్లో ప్రవేశాలను లాటరీ విధానంలో కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. బీఏఎస్‌ పథకంలో సీట్లకు సంబంధించి మాత్రం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు.

బీఏఎస్‌లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఏడాదికి రూ.25 వేల నుంచి రూ.35 వేలు ప్రభుత్వం బోధన రుసుం ఆయా పాఠశాలలకు చెల్లిస్తుంది. దాంతో విద్యార్థులకు ఉచిత విద్య, వసతి, భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నారు. డే స్కాలర్స్‌కు కూడా ప్రవేశాలు కల్పిస్తుండటంతో ఇంటి వద్ద నుంచే సమీప పాఠశాలలకు విద్యార్థులను పంపుతున్నారు. ప్రమాణాలున్న పాఠశాలల్లో చదవడం వల్ల విద్యార్థులు చదువులో ప్రతిభ చూపి రాణిస్తున్నారు. ప్రభుత్వం దీనిపై ప్రకటన చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

  • ఇంటర్‌ ప్రవేశాలపై సందిగ్ధత

2019-20 విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షలను కరోనా కారణంగా రద్దు చేసి పరీక్ష ఫీజు చెల్లించిన అందరు విద్యార్థులను ఉత్తీర్ణులను చేస్తూ ప్రభుత్వం ప్రకటన చేసింది. గ్రేడ్లను ఇవ్వకపోవడంతో ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించడం వీలు కాని పరిస్థితి. పదో తరగతి పరీక్షల్లో 7 జీపీఏ పైన సాధించిన వారికి ఇంటర్‌ విద్య కార్పొరేట్‌ కళాశాలల్లో ఉచితంగా ప్రభుత్వం చెప్పిస్తోంది. ఇప్పుడు గ్రేడ్లు ఇవ్వకపోవడంతో కార్పొరేట్‌ కళాశాలల్లో ఇంటర్‌ ప్రవేశాలపై సందిగ్ధత నెలకొంది. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఏడాదికి రూ.35 వేలు చొప్పున బోధన రుసుం కింద ప్రభుత్వం చెల్లిస్తుంది. ఓ వైపు ప్రైవేటు విద్యాసంస్థలు ఆన్‌లైన్‌ తరగతుల పేరిట అనధికారికంగా ప్రవేశాలు కల్పించి విద్యార్థులకు బోధన చేస్తున్నాయి. ప్రభుత్వ సాయంతో విద్యను చదివే నిరుపేద ప్రతిభావంతుల విషయంలో మాత్రం స్పష్టత లేకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. ప్రవేశాలు కల్పిస్తారా? లేదా? అనేది కూడా ఎవరూ చెప్పలేని పరిస్థితి. జిల్లా సంక్షేమ శాఖల అధికారులు దీనిపై తమకు ఎలాంటి మార్గదర్శకాలు రాలేదని చెపుతున్నారు. ప్రభుత్వం బీఏఎస్‌, ఇంటర్‌ కార్పొరేట్‌ విద్య ప్రవేశాలపై ప్రకటన విడుదల చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

విద్యా విధానంలో భారీ మార్పులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.