ETV Bharat / city

COVID CLAIMS: 'కొవిడ్‌ పాలసీ క్లెయింలను శరవేగంగా పరిష్కరిస్తున్నాం'

author img

By

Published : Jun 27, 2021, 5:01 PM IST

RESOLVING COVID CLAIMS FASTLY
కొవిడ్‌ క్లెయింలను వేగంగా పరిష్కరిస్తున్నాం

‘ఆరోగ్య బీమా పాలసీ ఉన్న వారికి కొవిడ్‌-19 చికిత్సలో ఆర్థిక భారం తప్పింది. క్లెయిం వచ్చిన వెంటనే దాన్ని పరిష్కరించేందుకు బీమా సంస్థలు అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాయి. సహేతుకమైన బిల్లులు వచ్చినప్పుడు, వాటిని తిరస్కరించిన సందర్భాలు చాలా తక్కువే’ అని అంటున్నారు స్టార్‌ హెల్త్‌ అండ్‌ అల్లైడ్‌ ఇన్సూరెన్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌.ప్రకాశ్‌ ఏమంటున్నారంటే..

  • కరోనా మూడో దశ వచ్చే అవకాశం ఉందంటున్నారు. బీమా కంపెనీలు ఎలా సిద్ధమౌతున్నాయి..?

కొవిడ్‌-19 తొలి, రెండో దశల తర్వాత బీమా సంస్థలు కొన్ని పాఠాలు నేర్చుకున్నాయి. బీమా పాలసీలు తీసుకునే వారు పెరగడంతో.. సాధ్యమైనంత వరకు పూర్తిగా ఆన్‌లైన్‌లోనే పాలసీలు అందించే ఏర్పాట్లు చేస్తున్నాయి. తమ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తున్నా.. బీమా సేవల విషయంలో ఎలాంటి లోపాలు రాకుండా జాగ్రత్త పడుతున్నాయి. క్లెయింలు అధికంగా వచ్చినా.. ఇబ్బంది లేకుండా ఉండేలా, క్లెయిం పరిష్కార ప్రక్రియను ఆటోమేషన్‌ చేసేందుకు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. పాలసీదారులకు ఇబ్బంది లేకుండా.. వీలైనంత తొందరగా క్లెయిం పరిష్కారానికి బీమా సంస్థలు సర్వ సన్నద్ధంగా ఉన్నాయని చెప్పొచ్చు.

  • ఆసుపత్రి బిల్లుల ప్రామాణికీకరణ వల్ల పాలసీదారులకూ, బీమా సంస్థలకు ఎలాంటి మేలు జరుగుతోంది..?

కరోనా చికిత్సలో ఆసుపత్రి బిల్లులను హేతుబద్ధీకరణ చేయడం వల్ల చాలామందిపై ఆర్థిక భారం తగ్గిందని చెప్పొచ్చు. ముఖ్యంగా మధ్య తరగతి వారిని ఇది ఆర్థిక సంక్షోభం నుంచి తప్పిస్తోంది. బీమా సంస్థలకూ కొవిడ్‌ క్లెయింలను సులభంగా పరిష్కరించేందుకు తోడ్పడుతుంది. కరోనా బాధితులకు అనవసర పరీక్షలు చేయకుండా, ఔషధాలు వాడకుండా ఇది నిరోధిస్తుందని చెప్పొచ్చు.

  • కొవిడ్‌-19 చికిత్స కోసం నగదు రహిత క్లెయింని 60 నిమిషాల్లో పరిష్కరించాలని ఐఆర్‌డీఏఐ మార్గదర్శకాలు జారీ చేసింది. బీమా సంస్థలు దీన్ని ఎంత మేరకు అమలు చేస్తున్నాయి..?

వీలైనంత తొందరగా నగదు రహిత చికిత్సకు అనుమతి ఇచ్చేందుకు బీమా సంస్థలు తమ ప్రయత్నాలు చేస్తున్నాయి. కొవిడ్‌-19 చికిత్సకు సంబంధించి 60 నిమిషాల్లో అనుమతులు ఇవ్వాలని నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ మార్గదర్శకాలు జారీ చేసింది. దీన్ని పాటించేందుకు బీమా సంస్థలు తగిన మానవ వనరులు, సాంకేతికత ఏర్పాటు చేసుకుంటున్నాయి. చికిత్స ఖర్చులను తిరిగి పొందేందుకు 7-14 రోజుల సమయం పడుతుంది. అన్ని పత్రాలనూ సరిగ్గా అందిస్తే.. ఆలస్యం లేకుండా క్లెయింలను పరిష్కరించేందుకు వీలవుతుంది. బీమా సంస్థల ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు కరోనా బారిన పడటంతో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి.

  • ఇంటి వద్ద చికిత్సకు బీమా సంస్థలు ఎంత మేరకు పరిహారం ఇస్తున్నాయి..?

తప్పనిసరి అయితేనే ఆసుపత్రిలో చేరాలని ప్రభుత్వం చెబుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో బీమా సంస్థలూ ఈ విషయాన్ని పాలసీదారులకు తెలియజేశాయి. టెలి మెడిసిన్‌ సేవలను అన్ని ఆసుపత్రులూ తీసుకొచ్చాయి. దీనికోసం దాదాపు రూ.20వేల వరకు వసూలు చేస్తున్నాయి. దీంతో బీమా సంస్థలూ రూ.10,000, రూ.20,000ల చొప్పున చికిత్స ఖర్చును చెల్లిస్తున్నాయి. మూడో దశ అనే హెచ్చరికలు వినిపిస్తూ ఉన్నాయి. అందువల్ల ఆసుపత్రులు ఈ టెలిమెడిసిన్‌ సేవలను మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఇతర వ్యాధుల చికిత్సకు ఈ విధానం ఆదరణ పొందుతోంది. బీమా సంస్థలు ఈ చికిత్సలకూ పరిహారం అందిస్తున్నాయి.

  • కరోనా చికిత్సకు సంబంధించి నగదు రహిత చికిత్సలో సమస్యలు, బిల్లుల మొత్తాన్ని తిరిగి పొందడంలో చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై మీ అభిప్రాయమేమిటి..?

ఆసుపత్రులు, బీమా సంస్థల మధ్య సమన్వయం సరిగా లేకపోవడంతో కొన్ని సందర్భాల్లో పాలసీలను తిరస్కరించిన ఉదంతాలున్నాయి. పాలసీదారులూ పాలసీ నిబంధనలను సరిగా అర్థం చేసుకోవడంలో పొరపాట్లు చేయడంతో, పాలసీలు తిరస్కరణకు కారణమయ్యాయి. పాలసీ తీసుకునేటప్పుడే.. ఆ పాలసీ నియమ నిబంధనలను కచ్చితంగా తెలుసుకుంటే.. ఇలాంటి వాటిని పరిహరించేందుకు వీలవుతుంది. ఒక చికిత్సకు ఆసుపత్రులు వసూలు చేసే ఖర్చులు పూర్తిగా హేతుబద్ధంగా ఉండాలి. ఆ ప్రాంతంలో ఎంత బిల్లులు వేసేందుకు అవకాశం ఉంది, బీమా సంస్థ దాన్ని ఏ మేరకు చెల్లిస్తుందన్నదీ కీలకమే. ఈ నేపథ్యంలో కొన్నిసార్లు అధిక బిల్లులను బీమా సంస్థలు తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయి.సరైన బిల్లులతో క్లెయిం చేసినప్పుడు బీమా సంస్థ దాన్ని వీలైనంత తొందరగా పరిష్కరిస్తుందనే చెప్పొచ్చు.

ఇదీ చూడండి:

'టీకాపై అపోహలు తొలగితేనే కరోనాపై విజయం'

పెళ్లికి నో చెప్పిన ఆమెపై 'గంజాయి కేసు' కుట్ర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.