ETV Bharat / city

HAIR SMUGGLING: తెలుగు రాష్ట్రాల్లో జుట్టునూ వదలట్లేదు

author img

By

Published : Aug 26, 2021, 1:11 PM IST

తెలుగు రాష్ట్రాల నుంచి కోట్ల విలువైన మనుషుల వెంట్రుకల స్మగ్లింగ్ జరుగుతున్నట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు కోల్‌కతా, గౌహతి కేంద్రంగా విదేశాలకు తరలిస్తున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణలో వెలుగుచూసింది. పన్ను ఎగవేసేందుకు అక్రమ పద్ధతిలో మణిపూర్, మిజోరాం, మియన్మార్ మీదుగా చైనాకు ఎగుమతిచేస్తున్నట్లు గుర్తించారు. పన్నుఎగవేసేందుకు దొడ్డిదారిన జుట్టు సేకరిస్తున్న చైనీయులు.. ప్రతిఫలంగా ఇక్కడి వ్యాపారులకు హవాలా మార్గంలో సొమ్ము, బంగారం చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ అక్రమ దందా నడిపేందుకు మియన్మార్‌కు చెందిన కొందరు హైదరాబాద్‌లో తిష్టవేసినట్లు ఈడీ గుర్తించింది.

వెంట్రుకల స్మగ్లింగ్
వెంట్రుకల స్మగ్లింగ్

తెలుగు రాష్ట్రాల్లో వెంట్రుకల స్కాం

మనుషుల జుట్టుతో భారీ అక్రమదందా సాగుతోంది. తెలుగురాష్ట్రాల్లోని మనుషుల వెంట్రుకల ఎగుమతిదారులు పెద్దఎత్తున అక్రమ పద్ధతుల్లో చైనాకు తరలిస్తున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ దర్యాప్తులో వెలుగుచూసింది. చైనా బెట్టింగ్‌యాప్‌లపై విచారణ చేస్తున్న ఈడీ బృందాలకు అనుకోకుండా మనుషుల కేశాల అక్రమదందా బయటపడింది. చైనీయుల నుంచి సుమారు 16 కోట్లు తెలుగు రాష్ట్రాల్లోని వెంట్రుకల వ్యాపారులకు చేరినట్లు తేలడంతో.. ఈడీ అధికారులు అప్రమత్తమయ్యారు. వెంట్రుకల వ్యాపారుల అక్రమ లావాదేవీలపై ఫెమా ఉల్లంఘనల కింద మరో కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. హైదరాబాద్, తణుకులోని వికాస్ హెయిర్ ఎంటర్‌ ప్రైజెస్, నరేశ్‌ విమెన్ హెయిర్ ఎంటర్ ప్రైజెస్... హ్రితిక్ ఎగ్జిమ్, ఎస్​.ఎస్​.ఇంపెక్స్, శివ్ కేశవ్ హ్యూమన్ హెయిర్, లక్ష్మి ఎంటర్ ప్రైజెస్, ఆర్.కె. హెయిర్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాలు సహా 8 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.

ఉద్యోగుల పేరిట బ్యాంకు ఖాతాలు

మనుషుల వెంట్రుకల వ్యాపారుల కార్యాలయాల్లో భారీగా లెక్కాపత్రాలులేని నగదును ఈడీ స్వాధీనం చేసుకుంది. సుమారు 2 కోట్ల 90 లక్షలతోపాటు 12 మొబైల్ ఫోన్లు, 3 ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్, డైరీలు, ఖాతాల పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తుల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తిరుపతి, యాదాద్రి, విజయవాడ తదితర పుణ్యక్షేత్రాలతోపాటు... స్థానిక క్షౌరశాల నుంచి వెంట్రుకలు సేకరించి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రధానంగా మియన్మార్, బంగ్లాదేశ్, వియత్నాం, ఆస్ట్రియా, చైనా తదితర దేశాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఆ అక్రమ ఎగుమతుల కోసం మియన్మార్‌కు చెందిన పలువురు హైదరాబాద్‌లో తిష్టవేసినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. వెంట్రుకల ఎగుమతి దారులు అక్రమ లావాదేవీల కోసం తమ ఉద్యోగుల పేరిట బ్యాంకు ఖాతాలు తెరిచినట్లు గుర్తించారు.

హవాలా మార్గంలో సొమ్ము రాక

పన్ను ఎక్కువగా ఉండే నాణ్యమైన జుట్టును.. నాసిరకం జుట్టు లేదా దూదిగా పేర్కొంటూ విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. తద్వారా చైనా వ్యాపారులు 28శాతం దిగుమతి సుంకం తప్పించుకోవడంతోపాటు.. 8శాతం దిగుమతి ప్రోత్సాహకాలను... అక్రమంగా పొందుతున్నారు. తెలంగాణ, ఏపీతోపాటు కోల్‌కతా, గువహటి నుంచి ఎక్కువగా సరకు వెళ్తోందని ఈడీ భావిస్తోంది. మణిపూర్, మిజోరాం ద్వారా మియన్మార్‌కు రోడ్డుమార్గంలో తరలించి అక్కడి నుంచి చైనాకు పంపిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. చైనా బెట్టింగ్ యాప్‌ల కుంభకోణంలో కీలకపాత్ర పోషించిన లింక్యూన్ టెక్నాలజీస్, డాకీపే సంస్థల నుంచి హైదరాబాద్‌లోని రెండు వెంట్రుకల ఎగుమతి కంపెనీలకు సుమారు రూ. 3 కోట్ల 38 లక్షలు చేరినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు గుర్తించారు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారి ద్వారా చైనాకు తరలించినందుకు... హవాలా మార్గంలో ఆ సొమ్మును పంపించినట్లు తేలింది. తెలుగురాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల్లోని... వెంట్రుకల ఎగుమతుల వ్యాపారుల లావాదేవీలపై ఈడీతో పాటు డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌- డీఆర్ఐ, ఐటీ, కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: నకిలీ చలానాల వ్యవహారం..రూ.7.13 కోట్ల అవకతవకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.