ETV Bharat / city

High Court verdict on Amravati : హైకోర్టు తీర్పు చరిత్రాత్మకం

author img

By

Published : Mar 4, 2022, 5:47 PM IST

High Court verdict on Amravati : రాజ్యాంగ ప్రమాణాలను పాటించడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందన్న ఉన్నత న్యాయస్థానం తాజా వ్యాఖ్య- జగన్మోహన రెడ్డి ఏకపక్ష ఏలుబడికి చెంపపెట్టే! ‘రాజధానిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నా’ అని చెప్పిన నోటితోనే సీఎం జగన్ అమరావతిపై కాలకూట విషాన్ని వెళ్లగక్కారు. అమరావతి అయిదు కోట్ల ఆంధ్రుల ఆశాదీపం. బృహత్ప్రణాళికకు అనుగుణంగా దాని నిర్మాణాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలన్న హైకోర్టు తీర్పు చరిత్రాత్మకం

amaravati
amaravati

High Court verdict on Amravati : పైత్యరోగికి పంచదార చేదన్నట్లు, ప్రజాస్వామ్య విలువలంటే వైకాపాకు ఎప్పుడూ ఏవగింపే. రాజ్యాంగ ప్రమాణాలను పాటించడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందన్న ఉన్నత న్యాయస్థానం తాజా వ్యాఖ్య- జగన్మోహన రెడ్డి ఏకపక్ష ఏలుబడికి చెంపపెట్టే! ‘మాట తప్పను... మడమ తిప్పను’ అంటూ అనితరసాధ్యంగా ఊదరగొట్టి అధికారాన్ని చేజిక్కించుకున్న ఆయన- ఆడిన మాటలను ఆ తరవాత అనాయాసంగా కృష్ణానదిలో నిమజ్జనం చేసేశారు. ‘రాజధానిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నా’ అని చెప్పిన నోటితోనే అమరావతిపై కాలకూట విషాన్ని వెళ్లగక్కారు. తమ ఎన్నికల ప్రణాళికలో, ప్రకటనల్లో ఏనాడూ ప్రస్తావించని మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చి, భిన్న ప్రాంతాల నడుమ విద్వేషాగ్నులు ఎగదోశారు. అమరావతి అయిదు కోట్ల ఆంధ్రుల ఆశాదీపం. బృహత్ప్రణాళికకు అనుగుణంగా దాని నిర్మాణాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలన్న హైకోర్టు తీర్పు చరిత్రాత్మకం. ఏపీ పునర్విభజనపై కేంద్ర చట్టం నేపథ్యంలో రాజధానిని మార్చడం, విభజించడంపై కొత్త చట్టాలు, తీర్మానాలు చేసే అధికారం రాష్ట్ర శాసనసభకు లేదని న్యాయస్థానం స్పష్టీకరించింది. దాదాపు 34 వేల ఎకరాల భూమిని తమ కలల రాజధానికి రాసిచ్చిన రైతుకుటుంబాల అసామాన్య పోరాట ఫలితమిది. రాష్ట్ర ప్రజల సమష్టి విజయమిది! తలకెక్కిన అధికారంలోంచి పొటమరించిన అహంకారం, కన్నూమిన్నూ కానని కార్పణ్యాలతో పరువుమాస్తున్న జగన్‌ పాలన- పౌరహక్కులను ఆది నుంచీ ఆబగా కబళిస్తోంది. ఆ చట్టవ్యతిరేక పోకడలకు సమర్థంగా అడ్డుకట్ట వేస్తున్న న్యాయవ్యవస్థే ప్రస్తుతం రాష్ట్రానికి అభయహస్తమవుతోంది. నిబంధనలకు అనుగుణంగా పాత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను పూర్తిచేయడం తరవాతి పాలకుల చట్టవిహిత కర్తవ్యంగా హైకోర్టు అభివర్ణించింది. తద్భిన్నంగా రూ.15 వేల కోట్ల ప్రజాధనం ధారపోసి చేసిన పనులన్నీ నిరర్థకమయ్యేలా అమరావతికి ఉరితాళ్లు పేనిన ఏలికల దుర్మదాంధత అత్యంత గర్హనీయం. రాజధానిలో కచ్చితంగా ఉండాల్సినవి అంటూ గతంలో జగనే ఉటంకించిన హైకోర్టు, శాసనసభ, సచివాలయం తదితరాలను వేర్వేరు చోట్ల కొలువు తీర్చబూనడమే ఆక్షేపణీయం. నవ్యాంధ్రకు కొత్త రాజధాని కోసం తమ జీవనాధారమైన భూమిని స్థానిక రైతాంగం స్వచ్ఛందంగా వదులుకుంది. వారితో కుదుర్చుకున్న ఒప్పందంలోని నిబంధనలను న్యాయస్థానం నిర్దేశించినట్లు ప్రభుత్వం ఇప్పటికైనా సక్రమంగా అమలుచేయాలి!

న్యాయమైన తమ హక్కుల కోసం సుమారు ఎనిమిది వందల రోజులుగా పోరుసల్పుతున్న రాజధాని రైతులపై వైకాపా సర్కారు కత్తిగట్టింది. ‘మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామన్న విషయం మీకు గుర్తుందా’ అని న్యాయపాలిక నిగ్గదీసేంతగా అణచివేతను ప్రయోగించింది. ప్రజాస్వామ్య వ్యవస్థలను ఈసడిస్తూ సర్వంసహాధికారాన్ని గుప్పిట పట్టిన జగన్‌ హయాములో ఖాకీల క్రూరత్వం అవధులు దాటిపోయింది. ‘నిబంధనలు ఎలా అమలు చేయాలో తెలియదా’ అని యంత్రాంగానికి న్యాయస్థానం తీవ్రంగా తలంటాల్సిన దుస్థితి తలెత్తింది. అమరావతిలో ‘ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌’ చోటుచేసుకుందంటూ కల్పిత కథనాలను సృష్టించిన సర్కారుకు సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. రాజధాని భూముల తాకట్టు నుంచి రాష్ట్ర భవిష్యత్తు ఆదాయాన్ని కుదువపెట్టడం వరకు వైకాపా ప్రభుత్వ విధానాలన్నీ విధ్వంసకరమైనవే. ఓట్ల పథకాలకు లాకులెత్తి ఏపీని అప్పులకుప్పగా మార్చిన జగన్‌- సమ్మిళిత, సుస్థిరాభివృద్ధిపై కొట్టిన కవుకుదెబ్బలెన్నో. స్వీయ అరాచక ధోరణుల మూలంగా పెట్టుబడులను రాబట్టడంలో విఫలమవుతున్న ఆయన సర్కారు స్థానికంగా ఉపాధి అవకాశాలను మృగ్యంచేస్తోంది. అమరావతి నగర నిర్మాణం సాకారమైతే- అభివృద్ధి పథంలో నవ్యాంధ్ర పయనానికి అది చుక్కాని అవుతుంది. దాని నిర్మాణంలో చెయ్యికలిపి చేయూతనందించడానికి ఎనిమిది దేశాలు ముందుకొచ్చాయి. ‘భావితరాలకు మనం జవాబుదారీ అనేది గుర్తించాలి’ అని లోగడ శ్రీరంగనీతులు చెప్పిన జగన్‌ పెడపోకడలే రాష్ట్ర ప్రగతికి పొగపెట్టాయి. అపరిమితమైన మొండితనం, చట్టాలంటే చులకనభావం, వ్యవస్థల పట్ల తూష్ణీకారంతో ఆయన చలాయిస్తున్న నిరంకుశాధికారమే ఏపీ భవితను పెనుచీకట్లలోకి నెట్టుకుపోయింది!

ఇదీ చదవండి : హైకోర్టు తీర్పుతో.. రాజధాని నిర్మాణంపై చిగురించిన ఆశలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.