ETV Bharat / city

తెలంగాణలో జోరు వానలు.. రెండ్రోజుల పాటు రెడ్‌ అలర్ట్‌

author img

By

Published : Jul 8, 2022, 4:26 PM IST

Updated : Jul 8, 2022, 6:08 PM IST

Rains in Telangana: తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వరద నీటితో పలు పట్టణాలు జలమయమయ్యాయి. ఉపరితల బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది.

rains
rains

అల్పపీడనం, ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ పరిస్థితి మరో మూడు రోజులపాటు కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రాగల మూడ్రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ప్రకటించింది. రెండు రోజుల పాటు రెడ్‌ అలర్ట్‌, ఆ తర్వాత రెండ్రోజులు ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేసింది.

హైదరాబాద్‌తోపాటు శివారు ప్రాంతాల్లోనూ.. రాత్రి నుంచి వర్షం పడింది. జిల్లాల్లో భారీ వర్షాలకు వాగులు, వంకలు పారుతున్నాయి. పలుచోట్ల చెరువులు అలుగులు పోస్తున్నాయి. సూర్యాపేట జిల్లా ఆత్మకూరులో 19.4, ఖమ్మం జిల్లా ఖానాపూర్‌లో 16.2, భద్రాద్రిజిల్లా సీతారాంపట్నంలో 10.9 సెంటీమీటర్ల వర్షం కురుసింది. ఇవాళ నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్ధపల్లి, ఖమ్మం జిల్లాల్లో.. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతోపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

rains

లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం: నల్గొండ, ఖమ్మంలో కురిసిన వర్షాలకు పట్టణాల్లో భారీగా వరద నీరు వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రహదారులపైకి నీరు చేరడంతో... వాహనదారుల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. పట్టణాల్లోని పలు కాలనీలు వరద నీటిలో మునిగిపోయాయి. ద్విచక్రవాహనాలపై కార్యాలయాలకు... ఇతర అత్యవసర పనుల కోసం బయటకు వెళ్లేవాళ్లు తడిసి ముద్దవుతున్నారు. గుంతలు ఎక్కడ ఉన్నాయో తెలియక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. మురికి కాలువలు పొంగి పొర్లుతున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లావ్యాప్తంగా రెండ్రోజులుగా ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తోంది. జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్‌ పట్టణం ముసురుతో ముసుగేసింది. చిరు వ్యాపారస్తులు గిరాకీ లేక అవస్థలు పడుతున్నారు.

నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి: మరోవైపు వరద నీటితో రామగుండం, ఇల్లందు ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఇల్లందు కోయగూడెం ఉపరితల గనిలో.. క్యాంపు కార్మికుల నివాస సముదాయాలు నీటమునిగాయి. రామగుండం పరిధిలో ఉపరితల గనుల్లో వరదనీరు చేరడంతో పనులు నిలిచిపోయాయి. బురద కారణంగా బొగ్గు తరలించే వాహనాలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో భారీ వాహనాలను నిలిపివేశారు. వర్ష ప్రభావం పూర్తిగా తగ్గితేనే... తిరిగి బొగ్గు ఉత్పత్తి పనులు యాధావిధిగా కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

నిలిచిపోయిన రాకపోకలు: మహారాష్ట్రలో కురుస్తున్న వానలకు ఇంద్రావతి, ప్రాణహిత, గోదావరి నదులు జోరుగా ప్రవహిస్తున్నాయి. వాగులు నిండి పలుచోట్ల రోడ్లు తెగిపోయాయి. మారుమూల ప్రాంతం బామరాగడ్ తాలూకాలోని 70 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.

ఇవీ చూడండి:

Last Updated : Jul 8, 2022, 6:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.