ETV Bharat / city

వెంబడించి.. వాహనంతో ఢీకొట్టి.. మహిళపై గ్యాంగ్​రేప్​

author img

By

Published : Oct 14, 2022, 10:02 AM IST

ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చి, తిరిగి స్వగ్రామానికి వెళ్తున్న మహిళపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రాత్రి సమయంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఆమెను వెంబడించి నిర్మానుష్య ప్రాంతంలో ఢీకొట్టి అత్యాచారానికి పాల్పడ్డారు.

సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ, పోలీసులు
సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ, పోలీసులు

ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చి, తిరిగి స్వగ్రామానికి వెళ్తున్న మహిళపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం కొప్పోలు - గుత్తికొండవారిపాలెం గ్రామాల మధ్య మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఒంగోలు తాలూకా పోలీసుల కథనం మేరకు.. ఓ వివాహిత రోజూ ఒంగోలుకు ద్విచక్రవాహనంపై వచ్చి కూరగాయలు అమ్ముకుని తిరిగి వెళ్తారు. మంగళవారం రాత్రి 10.30 సమయంలో ఆమె స్వగ్రామానికి వెళ్తుండగా.. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై ఆమెను వెంబడించారు. నిర్మానుష్య ప్రాంతంలో ఆమె వాహనాన్ని ఢీకొట్టి, మహిళను పక్కనున్న పొదల్లోకి లాక్కెళ్లారు. ఆమె కేకలు వేస్తూ ప్రతిఘటించినా వదల్లేదు.

అత్యాచారానికి పాల్పడిన దుండగులు.. ఆమెను అక్కడే వదిలేసి పరారయ్యారు. ఆలస్యమవుతున్నా ఆమె ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు ఆమెను వెతుక్కుంటూ వచ్చారు. దారిలో తారసపడిన ఆమె.. తనపై ఇద్దరు యువకులు దాడిచేసి అత్యాచారానికి పాల్పడినట్టు చెప్పారు. నిందితుల కోసం బంధువులు గాలిస్తుండగా కొత్తపట్నం రోడ్డులోని ఒక పెట్రోల్‌బంకు సమీపంలో కనిపించారు. పట్టుకునేలోపే అక్కడి నుంచి పరారయ్యారు. దీనిపై బాధితురాలు బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఒంగోలు డీఎస్పీ యు.నాగరాజు, తాలూకా సీఐ వి.శ్రీనివాసరెడ్డి బాధితురాలిని విచారించి వివరాలు సేకరించారు. సంఘటన స్థలానికి గురువారం చేరుకుని పరిశీలించారు. బాధితురాలిని వైద్యపరీక్షల నిమిత్తం ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. కొప్పోలు గ్రామ సమీపంలోని చేపల చెరువుల వద్ద కాపలాదారులుగా ఉంటున్న ఇద్దరు యువకులు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు గుర్తించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.