ETV Bharat / city

Floods: గోదావరి ఉగ్రరూపం.. లంకగ్రామాల్ని చుట్టుముట్టిన వరద ప్రవాహం

author img

By

Published : Jul 15, 2022, 11:13 AM IST

floods in andhra pradesh
గోదావరి ఉగ్రరూపం.. లంకగ్రామాల్ని చుట్టుముట్టిన వరద ప్రవాహం

Floods: గోదావరి వరద ఉగ్రరూపం చూపుతోంది. కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో లంకగ్రామాల్ని ప్రవాహం చుట్టుముట్టింది. గోదావరి ఉగ్రరూపాన్ని చూసి జనం హడలిపోతున్నారు. లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోగా మరికొన్నింటిని ముంపు ముప్పు వెంటాడుతోంది. ఎగువన వర్షాలు, వరద ప్రవాహంతో జనాలు అల్లాడిపోతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో.. ఓ పునరావాస కేంద్రంలో వృద్ధురాలు అనారోగ్యంతో మృతిచెందింది.

గోదావరి ఉగ్రరూపం.. లంకగ్రామాల్ని చుట్టుముట్టిన వరద ప్రవాహం

Floods: గోదావరి వరద జనాన్ని కోలుకోనివ్వట్లేదు. అల్లూరి సీతారామరాజు జిల్లా వర రామచంద్రపురం పరిధిలోని పునరావాస కేంద్రంలో.. వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. ప్రవాహం ప్రమాదకరంగా మారడం వల్ల.. ఆమె రేఖపల్లి పునరావాస కేంద్రంలో తలదాచుకుంది. ఈ క్రమంలో.. అనారోగ్యంతో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇక భద్రాచలం సమీపంలోని ఎటపాక, నూర్మూరు, నందిగామ, గౌరీదేవిపేట, గన్నవరం, గన్నేరుకొయ్యపాడు, తోటపల్లి, విరాయిగూడెం, నెల్లిపాకతో పాటు 20 గ్రామాలు ముంపులో ఉన్నాయి. చాలామంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు.

కోనసీమ లంక గ్రామాల్నీ వరద చుట్టిముట్టింది. 4 రోజులుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినవిల్లి పరిధిలోని ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు.. అధికారులు చర్యలు చేపట్టారు. గురువారం రాత్రి సైతం అయినవిల్లి పరిధిలోని వీరవల్లిపాలెం, అయినవిల్లిలంక, కొండుకుదురులంక, పొట్టిలంక, గుణ్ణంవారిమెరకలో పర్యటించారు. లోతట్టు ప్రాంత ప్రజల్ని.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. అయితే.. కొన్నిచోట్ల జనం తమ గ్రామం విడిచిరాలేమని అధికారులకు తెలిపారు. తమకు వరద అలవాటేనంటున్నారు.

ఇక..లంక గ్రామాల నుంచి రాకపోకలకు ప్రజల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. కోనసీమ జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాల్ని వరద చుట్టుముట్టింది. సుమారు లక్షా 50 వేలమంది బాధితులుగా ఉన్నారు. అవసరాల కోసం బయటికి వెళ్లేందుకు.. పడవల్ని ఆశ్రయిస్తున్నారు.

ఆలమూరు మండలం బడుగువానిలంక.. జలదిగ్బంధంలో చిక్కుకుంది. పొలాలన్నీ ముంపులో ఉండగా.. రహదారులు చిన్నపాటి జలాశయాల్లా మారాయి. పాడి పశువులను రైతులు పొలాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గ్రామానికి సంబంధాలు తెగిపోవడం వల్ల.. పడవలపై ప్రయాణిస్తున్నారు. ఆత్రేయపురం, ఆలమూరు, రావులపాలెం, కొత్తపేట పరిధిలో.. పొలాలు పూర్తిగా మునిగాయి.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.