ETV Bharat / city

Farmers Suicide: అప్పుల బాధతో ఐదుగురు రైతుల ఆత్మహత్య

author img

By

Published : Sep 4, 2022, 2:44 PM IST

farmers suicide
farmers suicide

Five formers sucide to Debts: బ్రహ్మంగారిమఠం, గుడిబండ, ప్యాపిలి, కొత్తపల్లి, కారంపూడి వేర్వేరు సంఘటనల్లో అప్పుల బాధతో ఐదుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతుల్లో రాయలసీమ ప్రాంతానికి చెందినవారే నలుగురు ఉండటం విచారకరం. అప్పులు తీరే మార్గం లేక, కుటుంబం గడిచే దారి తెలియక ఈ అఘాయిత్యాలకు పాల్పడ్డారు.

Farmers Suicide: బ్రహ్మంగారిమఠం, గుడిబండ, ప్యాపిలి, కొత్తపల్లి, కారంపూడి వేర్వేరు సంఘటనల్లో అప్పుల బాధతో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మరోచోట రైతు దంపతులు ఆత్మహత్యయత్నం చేయగా భర్త మరణించారు... భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఐదుగురు మృతుల్లో రాయలసీమ ప్రాంతానికి చెందినవారే నలుగురు ఉండటం విచారకరం. నంద్యాల జిల్లాలో ఇద్దరు, వైయస్‌ఆర్‌, శ్రీసత్యసాయి జిల్లాలలో ఒక్కొక్కరు బలవన్మరణానికి పాల్పడ్డారు. పల్నాడులో మరొకరు తనువు చాలించారు. అప్పులు తీరే మార్గం లేక, కుటుంబం గడిచే దారి తెలియక ఈ అఘాయిత్యాలకు పాల్పడ్డారు.

వైయస్‌ఆర్‌ జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం మల్లేగుడిపాడు గ్రామానికి చెందిన రైతు పుల్లలచెరువు కొండారెడ్డి (55) అయిదెకరాల్లో వరి, పత్తి పండించేవారు. అయిదేళ్లుగా నష్టాలు వచ్చాయి. దీంతో బ్యాంకులో భూములను తనఖాపెట్టి రూ.3.5 లక్షలు, గ్రామంలో రూ.7లక్షలు అప్పు చేశారు. అప్పులు తీరక మనస్తాపానికి గురయ్యారు. 3 రోజుల కిందట పురుగుమందు తాగడంతో కుటుంబీకులు తిరుపతిలోని స్విమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి చనిపోయారు.

మరో ఘటనలో శ్రీసత్యసాయి జిల్లా గుడిబండ మండలం కరికెరకు చెందిన రైతు నరసింహప్ప(46) కన్నుమూశారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు పెళ్లికాగా, కుమారుడు ఇంటర్‌ చదివి ఆర్థిక ఇబ్బందులతో డిగ్రీలో చేరలేదు. రెండేళ్లుగా రెండెకరాలను కౌలు తీసుకొని విత్తన పత్తి సాగు చేసి నష్టపోయారు. రూ.5 లక్షల వరకు అప్పులున్నాయి. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగారు. అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో శనివారం మృతి చెందారు.

మరో సంఘటనలో నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం నడిమిగేరికి చెందిన రైతు శ్రీహరి(42) దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. శ్రీహరి తన నాలుగెకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. మూడేళ్లనుంచి దిగుబడి లేక నష్టపోయారు. రూ.7.50 లక్షల అప్పులయ్యాయి. అప్పులను తీర్చేందుకు గతేడాది నల్లబల్లి గ్రామ సమీపంలో నర్సరీని ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకోసం బ్యాంకులో మరో రూ.7.50 లక్షల అప్పు తీసుకున్నారు. నర్సరీ నడవక రుణ భారం పెరిగింది. మనస్తాపానికి గురైన ఆయన భార్య ఉమామహేశ్వరితో కలిసి శనివారం నర్సరీలో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వారిని కర్నూలు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శ్రీహరి చనిపోయారు. ఉమామహేశ్వరి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఇదే జిల్లాలో మరో విషాదం చోటు చేసుకుంది. కొత్తపల్లి మండలం గువ్వలకుంట్ల గ్రామానికి చెందిన మంద వెంకటేశ్వరరెడ్డి (59) తనకున్న ఎకరంతో పాటు మూడెకరాలను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసేవారు. రెండేళ్లుగా వరుస నష్టాలు రావడంతో రూ.5 లక్షల అప్పులయ్యాయి. వాటిని తీర్చేందుకు కుటుంబం కర్నూలుకు వెళ్లింది. అక్కడా ఉపాధి లభించక వెంకటేశ్వరరెడ్డి మనస్తాపం చెందారు. ఈ క్రమంలో వినాయక చవితికి కుటుంబీకులతో కలిసి స్వగ్రామానికి వచ్చారు. శుక్రవారం రాత్రి ఇంటి సమీపంలోని కల్లంలోకి వెళ్లి మద్యంలో పురుగుల మందు కలుపుకొని తాగారు. కుటుంబీకులు చూసేసరికి మృతి చెందారు.

* పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచర్లలో రైతు నేలపాటి వెంకటేశ్వర్లు (51) తనకున్న మూడెకరాలతో పాటు మరో 9.70 ఎకరాలను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేశారు. ఇందుకు రూ.10 లక్షలు అప్పు చేశారు. సరైన దిగుబడి రాక, చేసిన అప్పులు తీరక మనస్తాపానికి గురై ఇంట్లో ఉరేసుకుని చనిపోయారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

ఇవీ చదవండి:


ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.