ETV Bharat / city

ఉపాధ్యాయుల ముఖ ఆధారిత హాజరుపై అంతర్గత పోరు

author img

By

Published : Aug 16, 2022, 4:49 AM IST

ప్రభుత్వ ఉపాధ్యాయులకు నేటి నుంచి యాప్‌ ఆధారిత హాజరును విద్యాశాఖ అమలుచేస్తోంది. ఉదయం 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా సగం రోజు సెలవుగా పరిగణిస్తామని స్పష్టం చేస్తోంది. అయితే దీన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవద్దని పిలుపునివ్వడంతో ఉపాధ్యాయ సంఘాలు, విద్యాశాఖ అధికారుల మధ్య అంతర్గత పోరుకు దారితీస్తోంది.

ఉపాధ్యాయుల ముఖ ఆధారిత హాజరుపై అంతర్గత పోరు
ఉపాధ్యాయుల ముఖ ఆధారిత హాజరుపై అంతర్గత పోరు

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరును విద్యాశాఖ ఆన్‌లైన్‌ చేసింది. ఇందుకోసం పాఠశాల విద్యాశాఖ ముఖ ఆధారిత హాజరు నమోదు చేసేలా ప్రత్యేకంగా యాప్ తీసుకొచ్చింది. మంగళవారం నుంచి యాప్‌లో హాజరు వేయాల్సిందేనని, దీన్నే ప్రామాణికంగా తీసుకుంటామని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. ఉపాధ్యాయుల సెల్ ఫోన్లోనే దీన్ని డౌన్లోడ్ చేసుకుని, తమ ఫొటోలను అప్లోడ్ చేయాలి. ప్రతిరోజూ పాఠశాల వద్ద యాప్ ఓపెన్ చేసి, హాజరు నమోదు చేయాలి. ఉదయం 9 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా సగం రోజు సెలవుగా పరిగణిస్తారు. ఉదయం పాఠశాలకు వచ్చినప్పుడు, సాయంత్రం తిరిగివెళ్లేటప్పుడు రెండు సార్లు హాజరు నమోదు చేయాలి.

యాప్ హాజరుపై ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కిలోమీటరు దూరంలోని ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను హైస్కూ ళ్లలో విలీనం చేశారు. ఉపాధ్యాయులను కొత్త బడిలో సర్దుబాటు చేశారు. యాప్లో మాత్రం పాత పాఠశాలలోనే ఉన్నట్లు చూపిస్తున్నారు. వీరి హాజరు నమోదుపై అనేక ఫిర్యాదులు రావడంతో సోమవారం రాత్రి విద్యా శాఖ అధికారులు మార్గదర్శకాలిచ్చారు. అప్పటికే ఉపాధ్యాయులు ఇళ్లకు వెళ్లిపోయినందున మంగళవారం ఉదయం హాజరు ఎలాగనే ఆందోళన నెలకొంది.

ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఏదైనా కారణంతో ఉపాధ్యాయులు కొంచెం ఆలస్యంగా వస్తే.. సగం రోజు హాజరు లేకున్నా పాఠాలు చెప్పాలా ? లేకుంటే సెలవు తీసుకోవాలా ? సెలవు తీసుకుంటే అప్పటికప్పుడు వేరే ఉపాధ్యాయుణ్ని ఎలా సర్దుబాటు చేస్తారో స్పష్టతలేదు. ఉదయం 9 గంటల్లోపే హాజరు వేయాలనే నిబంధన పెట్టారని... ఎక్కడైనా నెట్వర్క్ సమస్యతో హాజరుపడకపోతే పరిస్థితి ఏంటని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.

యాప్‌ను ఉపాధ్యాయులు సెల్‌ఫోన్​లో డౌన్​లోడ్ చేసుకోవాలనే నిబంధన పెట్టారు. స్మార్ట్‌ఫోన్‌ లేని ఉపాధ్యాయులు హాజరు నమోదు ఎలా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. చాలా ప్రాంతాల్లో నెట్​వర్క్ సౌకర్యం ఉండదని ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయుణ్ని దోషిగా నిలబెట్టి., విద్యా వ్యవస్థను కార్పొరేట్ పరం చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తోందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆరోపించారు. ప్రభుత్వమే తమకు ట్యాబ్‌లు ఇచ్చి, ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. కర్ణాటక, తమిళనాడులో ఇప్పటికే ఈ విధానం అమల్లో ఉందని చెబుతున్నారు.

ఉపాధ్యాయ సంఘాల సందేహాలను విద్యాశాఖ అధికారులు తోసిపుచ్చుతున్నారు. నెట్‌వర్క్‌ సమస్య లేకుండా ఆఫ్‌లైన్‌ ఎంపిక అవకాశం ఇచ్చామని.. సిగ్నల్ వచ్చిన తర్వాత డేటా సర్వర్‌కు వస్తుందని చెబుతున్నారు. ఇప్పటికే రంపచోడవరంలో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేశామని వివరిస్తున్నారు. పాఠశాలలు ఉదయం 9 గంటలకే ప్రారంభమవుతాయని..ఉపాధ్యాయులు దీనికి అరగంట ముందే రావాలని... కాబట్టి హాజరు నమోదు ఆలస్యమ వుతుందనే సమస్య ఉండదని స్పష్టం చేస్తున్నారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.