ETV Bharat / city

TRS Protest in Delhi: తెరాస ధాన్యం దంగల్‌.. నేడు దిల్లీలో కేసీఆర్​ దీక్ష

author img

By

Published : Apr 10, 2022, 9:48 PM IST

Updated : Apr 11, 2022, 4:52 AM IST

TRS Protest in Delhi: పంటల కొనుగోలులో జాతీయ విధానం ఉండాలనే డిమాండ్‌తో.. దిల్లీలో ఆందోళనకు తెరాస సిద్ధమైంది. 'రైతు దీక్ష' పేరుతో నేడు.. తెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు.. హస్తినలో నిరసన తెలపనున్నారు. యాసంగి ధాన్యం కొనే వరకూ వెనక్కితగ్గేదేలేదని నేతలు తేల్చి చెబుతున్నారు.

TRS Protest in Delhi
TRS Protest in Delhi

TRS Protest in Delhi: దేశ రాజధాని కేంద్రంగా మోదీ సర్కారుపై నిరసనకు తెరాస సిద్ధమయ్యింది. యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా గ్రామ, మండల స్థాయి నుంచి ఆందోళనలు చేపట్టిన గులాబీ దళం.. సోమవారం రైతు దీక్ష పేరుతో దిల్లీ వేదికగా..కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయనుంది. పంటల కొనుగోలులో జాతీయ విధానం అమలు చేయాలని... డిమాండ్‌ చేయనుంది. ఇందుకోసం హస్తినలో.. తెలంగాణ భవన్‌ వద్ద వేదికగా ఏర్పాట్లు చేశారు. టీఎస్ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. 15 వందల మంది ప్రతినిధులు కూర్చునేందుకు వీలుగా వేదిక నిర్మించారు.

ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ, మున్సిపల్‌, మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌లు, రైతు సమన్వయ సమితి సభ్యులు దిల్లీ చేరుకోగా.. మిగతా ప్రజాప్రతినిధులు పయనమయ్యారు. ధాన్యం కొనుగోలుపై.. తెరాస ప్రభుత్వం చేస్తున్న రైతు దీక్షకు అందరూ మద్దతు తెలపాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. రాజకీయ కోణంలోనే కేంద్రం..తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేయట్లేదని మంత్రి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు.

"దేశంలో రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండడాన్ని కేంద్ర ప్రభుత్వం తక్కువ చేసి చూడడం మంచిది కాదు. రైతుసమాజ అభీష్టాన్ని పరిగణనలోకి తీసుకుని సానుకూల నిర్ణయం తీసుకోవడం సముచితంగా ఉంటుంది. కేంద్రం తాము చెప్పిందే చెల్లుబాటు కావాలన్న రీతిలో ముందుకు వెళ్లడం మంచిది కాదు. రైతన్నలకు ఇంకా క్షోభ కలిగించడం సరికాదు. ఆరుగాలం కష్టపడి పండించిన వరిధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం దారుణం. ఇదే భాజపా ప్రభుత్వంలో వాజ్‌పేయి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు రంగుమారిన ధాన్యం కూడా మద్దతు ధరతో కొనుగోలుకు అనుమతి ఇచ్చారు. కోటాను కోట్ల వ్యవసాయ కుటుంబాలను పట్టించుకోకపోవడం మంచిది కాదు. రాష్ట్రంలో యాసంగిలో పండిన మొత్తం పంటను ఏలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలి." -నిరంజన్‌ రెడ్డి, తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి

వేదికపై వీరే: ముఖ్యమంత్రి కేసీఆర్‌ తొలుత భవన్‌ ఆవరణలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం వేదికపైకి చేరుకుంటారు. వేదికపై ముఖ్యమంత్రితో పాటు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు, లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, వ్యవసాయ, పౌరసరఫరాల మంత్రులు నిరంజన్‌రెడ్డి, కమలాకర్‌, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు కిసాన్‌నేత రాకేశ్‌ టికాయిత్‌ తదితరులు కొద్దిమందే ఉంటారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, ఆది నుంచి తెలంగాణకు చేస్తున్న సహాయ నిరాకరణ, వడ్ల కొనుగోలు వ్యవహారంలో కేంద్రం రాజకీయాలు చేస్తోందంటూ సీఎం విమర్శలు గుప్పించనున్నారు.

హిందీ, ఇంగ్లీషు భాషల్లో ఫ్లెక్సీలు: ధాన్యం దీక్షను ప్రతిబింబించేలా వేదిక ఎదుట వడ్ల కుప్పను పోయనున్నారు. దీనికి ఇరువైపులా సాగు కష్టాలను తెలిపేలా నాగళ్లతో రైతులు నిల్చోనున్నారు. తెలంగాణ భవన్‌ పరిసరాలను తెరాస జెండాలు, బ్యానర్లు, ఫ్లెక్సీలతో గులాబీమయం చేశారు. దిల్లీ వాసులకు అర్థమయ్యేలా హిందీ, ఇంగ్లీషు భాషల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

హస్తినలో "రైతుదీక్ష"కు సర్వం సిద్ధం

ఇదీ చూడండి: బీసీలంతా వైకాపా వెంటే ఉన్నారు: సజ్జల

Last Updated : Apr 11, 2022, 4:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.