ETV Bharat / city

festival travels: ఊరెళ్లొచ్చే సరికి.. తడిసి మోపెడైంది!

author img

By

Published : Oct 21, 2021, 1:36 PM IST

festival travels: ఊరెళ్లొచ్చే సరికి.. తడిసి మోపెడైంది!
festival travels: ఊరెళ్లొచ్చే సరికి.. తడిసి మోపెడైంది!

దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లొచ్చిన వారికి ఖర్చు తడిసి మోపెడైంది. హైదరాబాద్​ వాసులు ఊరు వెళ్లి వచ్చేందుకు ఏకంగా రూ.500 కోట్లు ఖర్చు చేశారు. పెరిగిన ఇంధన ధరలతో రవాణాఖర్చు నగరవాసుల జేబుకు గట్టిగానే చిల్లు పెట్టింది.

తెలుగునాట దసరా వచ్చిందంటే చెప్పలేని సంబురం. భాగ్యనగరం నుంచి సొంతూర్లకు వెళ్లి బంధుమిత్రులతో గడిపేందుకు ఎక్కువమంది ఇష్టపడుతుంటారు. గత ఏడాది కరోనా భయంతో అంతగా వెళ్లలేదు. ఈసారి వైరస్‌ వ్యాప్తి తగ్గడంతో అధిక సంఖ్యలో స్వగ్రామాలకు వెళ్లి వచ్చారు. కానీ పండగ ఖర్చు తడిసి మోపెడైంది. హైదరాబాద్‌ వాసులు ఊరు వెళ్లి వచ్చేందుకు ఏకంగా రూ.500 కోట్లు ఖర్చు చేశారు. పెరిగిన ఇంధన ధరలతో రవాణాఖర్చు నగరవాసుల జేబుకు భారీగానే చిల్లు పెట్టింది.

పండగకు ఈ నెల 14 నుంచి 17 వరకు హైదరాబాద్‌-విజయవాడ, హైదరాబాద్‌-వరంగల్‌ మార్గంలో 10.86 లక్షల వాహనాలు రాకపోకలు సాగించాయి. తిరుగు ప్రయాణాలు 18, 19 తేదీలలో కొనసాగాయి. హైదరాబాద్‌-బెంగళూరు మార్గం, హైదరాబాద్‌-శ్రీశైలం, సాగర్‌ రోడ్డు, కరీంనగర్‌.. ఇలా అన్ని వైపుల తిరిగిన వాహనాల సంఖ్య 18 లక్షల వరకు ఉంటుంది. ఇందులో వ్యక్తిగత వాహనాల వాటా 60 శాతంగా ఉంది. 10.80 లక్షల కార్లు రాకపోకలు చేశాయి. ఒకట్రెండు మినహా అన్ని మార్గాల్లో ప్రస్తుతం టోల్‌ వసూలు చేస్తున్నారు. అవుటర్‌తో కలిపి వీటి ద్వారా వచ్చిన ఆదాయం రూ.25 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇందులో వ్యక్తిగత వాహనాల వాటా రూ.15 కోట్లు. సగటున ఒక వాహనం రూ.50 టోల్‌ ఛార్జీ చెల్లిస్తే.. వంద కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించొచ్చు. ఆ ప్రకారం వాహనంలో వెయ్యి రూపాయల పెట్రోలు/డీజిల్‌ పోయించాల్సిందే. ఈ లెక్కన రూ.300 కోట్లు కేవలం ఇంధనానికి వెచ్చించారు. ఇందులో సొంత వాహనాలతోపాటు అద్దెవి ఉంటాయి. వాటి అద్దెలు, డ్రైవర్ల బత్త పెద్ద ఎత్తున ఉంటుంది. చాలామంది సెల్ఫ్‌ డ్రైవ్‌ వాహనాలను అద్దెకు తీసుకుని వెళ్లారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ ఛార్జీల ద్వారా ఈ నెల 11 నుంచి 18 వరకు రూ.111 కోట్ల వరకు వచ్చిందని ఆర్టీసీ ప్రకటించింది. సిటీ నుంచి వెళ్లిన ప్రయాణికుల ఆదాయం రూ.పాతిక కోట్ల వరకు ఉంటుంది. దూర ప్రయాణికులు ప్రైవేటు ట్రావెల్స్‌లోనూ పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగించారు. రైళ్లల్లో వెళ్లి వచ్చినవారున్నారు. ఇక్కడి నుంచి తిరుపతి, విశాఖ, బెంగళూరు, చెన్నై వరకు విమానాల్లో వెళ్లి అక్కడి నుంచి సొంత వాహనాల్లో ఊర్లకు చేరుకున్నారు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే పండగకు ఊరు వెళ్లి వచ్చేందుకు దాదాపు రూ.500 కోట్ల వరకు నగరవాసులు ఖర్చు చేశారు. ఒక్కో కుటుంబం రూ.500 నుంచి రూ.10 వేల వరకు వ్యయం చేశారు.

ప్రజారవాణా అందిపుచ్చుకోలేకపోతోంది..

పండగకు ఎక్కువ మంది సొంత వాహనాల్లో వెళ్లేందుకు మొగ్గుచూపుతున్నారు. వ్యక్తిగత వాహనంలో వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరుకు వెళ్లి రావడానికి రూ.2 వేల వరకు ఖర్చు అవుతుంది. ఆర్టీసీ బస్సులో కుటుంబంతో వెళితే రూ.ఆరేడు వందలు మించవు. మూడు రెట్లు అధికంగా ఖర్చు చేసి సొంత వాహనంలో ఎందుకు వెళుతున్నారనే దానిపై ఆర్టీసీ అధ్యయనం చేస్తే లోపాలు తెలుస్తాయి.

రద్దీగా ఉంటుందని.. లగేజీ తీసుకెళ్లడం భారమని సొంత వాహనాలకు మొగ్గు చూపుతున్నారు. రద్దీకి తగ్గట్టుగా బస్సులు ఉండవు. కనీసం సౌకర్యంగా నిలబడే చోటు కూడా ఉండదని ప్రయాణికుల భావన. ఆర్టీసీ వాటా ప్రయాణికుల పరంగా ఎక్కువే ఉన్నా.. ఆదాయం వాటా పరిమితంగా ఉంది. దీన్ని మరింత పెంచుకునేందుకు అవకాశాలు ఉన్నాయి. దూర ప్రాంతాలకు రైళ్లో ప్రయాణం సౌకర్యంగా ఉండటంతో పాటు ధరలు అందుబాటులో ఉంటాయి. కానీ పండగ పూట సరిపడా రైళ్లు నడపడం లేదు. బెర్తుల కోసం కుస్తీలు పట్టాల్సిందే. ః కొన్ని కార్లలో ఐదారుగురు ప్రయాణిస్తే.. మరికొన్నింటిలో ఒకరిద్దరు వెళ్లిన దృశ్యాలు కన్పించాయి. వేడుక రోజున బంధుమిత్రులు కలిసి వెళుతున్నారు. ఒకే మార్గంలో వెళ్లేవారు కలిసి ప్రయాణించడంతో వాహనదారుకు ఖర్చు కలిసి వస్తుంది.

బస్సులు దొరకవని...

‘ఈసారి మా, చెల్లెలు కుటుంబీకులం కారులో సొంతూరుకు వెళ్లాం. జగద్గిరిగుట్ట నుంచి యాదాద్రి సమీపంలోని మా ఊరు 80 కిలోమీటర్లు ఉంటుంది. కారులో రూ.1500 పెట్రోలు పోయించా. రానుపోనూ టోలుకు రూ.280 అయ్యింది. బస్సులు దొరుకుతాయో.. లేదోనని భారమైనా కారులో వెళ్లి వచ్చాం’

- నరేందర్‌, జగద్గిరిగుట్ట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.