ETV Bharat / city

తెలంగాణ ఎంసెట్​లో ఉత్తీర్ణులైనా.. 9 వేల మందికి ర్యాంకులు లేవు!

author img

By

Published : Oct 8, 2020, 9:41 AM IST

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన ఎంసెట్​ ఫలితాల్లో ఇంటర్​ హాల్​టికెట్​ సరిగ్గా ఇవ్వక.. ఉత్తీర్ణులైనవారికి ర్యాంకులు దక్కలేదు. దరఖాస్తు చేసుకున్నప్పుడు వివరాల నమోదులో తప్పులుంటే సరిచేసుకోవాలని ఎడిట్‌ ఆప్షన్‌ ఇచ్చామని ఎంసెట్‌ కన్వీనర్‌ గోవర్ధన్‌ తెలిపారు. ఇప్పుడు ర్యాంకు రానివారి మొబైల్ ఫోన్లకు పంపించిన ప్రత్యేక లింక్ ద్వారా హాల్ టికెట్ పంపిస్తే.. ర్యాంకులు కేటాయిస్తామన్నారు.

differences-in-ts-eamcet
differences-in-ts-eamcet

తెలంగాణ ఎంసెట్‌లో కనీస మార్కులు సాధించినా.. ఇంటర్‌లో నిబంధనల మేరకు మార్కులు పొందినా.. వారికి ర్యాంకులు దక్కలేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వేల కుటుంబాల్లో బుధవారం కలకలం రేగింది. ర్యాంకులు రాకపోవడం వల్ల వందలాది విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి జేఎన్‌టీయూహెచ్‌లోని ఎంసెట్‌ కార్యాలయానికి చేరుకొని అధికారులతో మొరపెట్టుకున్నారు. ఇంటర్‌ హాల్‌టికెట్‌, ఇతర సమాచారాన్ని సరిగా నమోదు చేయకపోవడంతో ర్యాంకు కేటాయించలేదని, ఎంసెట్‌లో ఉత్తీర్ణులైనట్లు చూపామని అధికారులు వారికి సమాధానమిచ్చారు. అది తమ తప్పు కాదని, విద్యార్థుల పొరపాటే కారణమని చెప్పుకొచ్చారు.

హాల్‌టికెట్‌ నంబరు, ఇతర వివరాలను తప్పుగా నమోదు చేయడంతో ఏటా ర్యాంకుల సమస్య వస్తోంది. ఈసారి దాదాపు రెండువేల మందికి ర్యాంకులు దక్కలేదు. ఈనెల సెప్టెంబరు 14వ తేదీకి ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ఆన్‌లైన్‌ పరీక్షలు పూర్తయ్యాయి. ఫలితాలను ఈనెల 6న వెల్లడించారు. అంటే 20 రోజుల తర్వాత విడుదల చేశారు. ఫలితాలు వెల్లడించే ముందు అధికారులు పరిశీలించినప్పుడు ఎంత మందికి ర్యాంకులు రావట్లేదో తెలుస్తుంది. ఈసారి ఎంసెట్‌లో ఉత్తీర్ణులైనా 9 వేల మందికిపైగా ర్యాంకులు కేటాయించలేదు. వీరిలో ఇంటర్‌లో కనీస మార్కులు రానివారు, ఉత్తీర్ణులు కాని వారితోపాటు హాల్‌టికెట్‌ వివరాలను తప్పుగా నమోదు చేసిన వారు ఉన్నారు.

విద్యార్థి పేరుకు, ఇంటర్‌ హాల్‌టికెట్‌ సంఖ్యకు సరిపోలని వారు ఉన్నట్లు అధికారులకు ముందే తెలుసు. అయినా విద్యార్థులను సమాచారం ఇచ్చి సరిచేసుకునేలా అప్రమత్తం చేయలేదు. తమ తప్పులేదు కదా అని ర్యాంకులు ఇచ్చారు. దాంతో వేల మందిలో గగ్గోలు మొదలైంది. కనీసం ఫలితాల విడుదల నాడు కూడా ఈ సమస్య గురించి వెల్లడించకపోవడం గమనార్హం. దరఖాస్తు చేసుకున్నప్పుడు వివరాల నమోదులో తప్పులుంటే సరిచేసుకోవాలని ఎడిట్‌ ఆప్షన్‌ ఇచ్చామని ఎంసెట్‌ కన్వీనర్‌ గోవర్ధన్‌ తెలిపారు. వివరాలు సరిగా రాయక ర్యాంకులు పొందని వారు ఎంసెట్‌ కార్యాలయంలో ఆయా పత్రాలు సమర్పిస్తే మళ్లీ పాయింట్‌ ర్యాంకు కేటాయిస్తామని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

కరోనాతో రాయని వారికి నేడు పరీక్ష

కరోనాతో గత నెలలో జరిగిన ఎంసెట్‌ రాయని వారికి గురువారం హైదరాబాద్‌ ఎల్బీ నగర్‌లోని టీసీఎస్‌ ఐయాన్‌ కేంద్రంలో పరీక్ష జరగనుంది. మొత్తం 85 మంది విద్యార్థులున్నారు. వారికి పాయింట్లలో ర్యాంకులు ఇవ్వనున్నారు. ఉదాహరణకు విద్యార్థికి వచ్చిన మార్కుల్ని బట్టి 9, 10కి మధ్య 9.5 ర్యాంకు ఇస్తారు.

ఇదీ చదవండిః హాథ్రస్‌ ఘటనలో షాకింగ్‌ మలుపు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.