ETV Bharat / city

DENGUE FEVER: పిల్లల్లో పెరుగుతున్న డెంగీ కేసులు.. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న వైద్యులు

author img

By

Published : Sep 5, 2021, 9:05 AM IST

చిన్నారులపై డెంగీ పంజా విసురుతోంది. తెలంగాణలోని హైదరాబాద్ నిలోఫర్​లో 9 చిన్నపిల్లల యూనిట్లు నిండిపోయాయి. నెల నుంచి 12 ఏళ్లలోపు దాదాపు 700-750 మంది ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఇందులో 30-40 శాతం మందిలో డెంగీ లక్షణాలు ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

DENGUE FEVER IN CHILDREN
పిల్లల్లో పెరుగుతున్న డెంగ్యూ కేసులు..అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న వైద్యులు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా డెంగీ విజృంభిస్తోంది. ముఖ్యంగా చిన్నారులపై పంజా విసురుతోంది. హైదరాబాద్ నిలోఫర్‌లో 9 చిన్నపిల్లల యూనిట్లు చిన్నారులతో నిండిపోయాయి. ఎన్‌ఐసీయూ(NICU)లో 250 మంది వరకు పిల్లలు చికిత్స పొందుతున్నారు. నెల నుంచి 12 ఏళ్లలోపు దాదాపు 700-750 మంది ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఇందులో 30-40 శాతం మందిలో డెంగీ లక్షణాలు ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. రోజూ వెయ్యి మందికి తక్కువ కాకుండా ఓపీ ఉంటోంది. గాంధీ ఆస్పత్రిలోనూ డెంగీతో చిన్నారులు చేరుతున్నారు. గత రెండు వారాల్లో 80 మంది వరకు చిన్న పిల్లలు చికిత్స తీసుకున్నారు. పరిస్థితి విషమించి 3, 8, 16 ఏళ్ల వయసున్న ముగ్గురు బాలురతో పాటు ఆరేళ్ల బాలిక కన్నుమూశారు. కొందరి పిల్లల్లో డెంగీతో పాటు కరోనా, టైఫాయిడ్‌, స్క్రబ్‌టైపస్‌ లక్షణాలు కనిపిస్తున్నాయి.

నీరు నిల్వల కారణంగా దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. పలు పాఠశాలల వద్ద పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంటుండటంతో కొందరు చిన్నారులు దోమకాటు బారిన పడుతున్నారు. వీధులు, కాలనీల్లో మురుగునీరు, చెత్త డంపింగ్‌ ప్రాంతాలు దోమలు ప్రబలడానికి కారణమవుతున్నాయి. డెంగీకి కారణమయ్యే టైగర్‌ దోమ పగటిపూట మాత్రమే కుడుతుంది. ఈ క్రమంలో బడులకు, ఆడుకోవటానికి వెళుతున్న చిన్నారులు దోమ కాటుకు గురౌతున్నారు.

పిల్లల్లో డెంగీతో పాటు కరోనా, మలేరియా, టైఫాయిడ్‌, స్క్రబ్‌టైపస్‌ జ్వరాలు పెరుగుతున్నాయి. ఆఖరి నిమిషంలో ఆసుపత్రులకు రావడంతో కొన్నిసార్లు పరిస్థితి విషమంగా మారుతోందని వైద్యులు చెబుతున్నారు.

పాఠశాలలకు వెళ్లే పిల్లలకు కాళ్లు, చేతులు కప్పి ఉంచేలా దుస్తులు ధరింపచేయాలి. మాస్క్‌, శానిటైజర్‌ తప్పకుండా ఉంచాలని సూచిస్తున్నారు.

పిల్లలు, పెద్దలకు జ్వరం వస్తే పారాసిటమాల్‌ తప్ప... వైద్యుల సూచనల లేకుండా ఎలాంటి మందులు వాడకూడదు. 24-48 గంటల్లో తగ్గకుంటే వైద్యులను సంప్రదించాలి. కాచి చల్లార్చిన నీరు మాత్రమే తాగాలి.

101 డిగ్రీల కంటే ఎక్కువ జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కళ్ల వెనుక నొప్పి, చలిజ్వరం, వాంతులు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, వంటిపై దద్దుర్లు, నీరసం, అలసట, రక్తంలో ఆక్సిజన్‌ తగ్గడం, బీపీ తగ్గిపోవడం, శరీర భాగాల నుంచి రక్తస్రావం కావడం లాంటి లక్షణాలు గుర్తిస్తే వెంటనే ఆస్పత్రికి తరలించాలి.

ఇదీ చదవండి : Rains in state: బంగాళాఖాతంలో అల్పపీడనం...మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.