ETV Bharat / city

current bill: విద్యుత్తు ఛార్జీల మోత.. అన్ని కేటగిరీల్లోనూ..

author img

By

Published : Sep 9, 2021, 7:27 AM IST

current true up charges issue in andhra pradesh
current true up charges issue in andhra pradesh

రాష్ట్రంలో సెప్టెంబరు నెలలో విద్యుత్‌ బిల్లులు భారీగా పెరిగాయి. ఇంధన సర్దుబాటు పేరుతో దక్షిణ, కేంద్ర మండల విద్యుత్‌ పంపిణీ సంస్థలు (సీపీడీసీఎల్‌, ఎస్పీడీసీఎల్‌) యూనిట్‌కు రూ.1.23 వంతున, తూర్పు మండల విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్‌) 44 పైసల చొప్పున వసూలు చేస్తున్నాయి. ఏడేళ్ల కిందటి అదనపు ఖర్చుల్ని (2014-15 నుంచి 2018-19 వరకు చేసిన అదనపు వ్యయాన్ని) ప్రస్తుత కరెంటు వాడకం ఆధారంగా సర్దుబాటు చేయడంతో వినియోగదారులకు బిల్లులు భారీగా వస్తున్నాయి.

విజయవాడకు చెందిన వెంకట్రావు ప్రైవేటు ఉద్యోగి. 2015లో చిన్న ఇంట్లో ఉన్నాడు. ఫ్యాన్‌, బల్బు తప్ప ఇతర విద్యుత్‌ ఉపకరణాలు లేవు. ప్రతి నెలా 100 యూనిట్ల లోపు విద్యుత్తు వినియోగం ఉండేది. ఇప్పుడు ఇల్లు మారడం, మిక్సి, గీజర్‌, టీవీ, ఏసీ వంటి ఇతర విద్యుత్‌ ఉపకరణాల కొనుగోలుతో వినియోగం 200 యూనిట్లు దాటింది. అప్పుడే ట్రూఅప్‌ వసూలు చేసి ఉంటే 100 యూనిట్లపై యూనిట్‌కు రూ.1.23 వంతున రూ.123 చెల్లిస్తే సరిపోయేది. ఇప్పుడు వసూలు చేయటంతో 200 యూనిట్లకు రూ.246 చెల్లించాల్సి వస్తోంది. దీనివల్ల అతనిపై సర్దుబాటు భారం రెట్టింపైంది.

దక్షిణ మండల విద్యుత్‌ పంపిణీ సంస్థ పరిధిలోని తిరుపతికి చెందిన శివాల రఘురామ్‌కు సర్వీసు నంబరు 5534402177966తో కనెక్షన్‌ ఉంది. ఆగస్టులో మీటర్‌ రీడింగ్‌ను బట్టి 142 యూనిట్లు వాడుకున్నారు. ‘కేటగిరి బి’ కింద వినియోగ ఛార్జీలు రూ.411.20; స్థిర, కస్టమర్‌ ఛార్జీలు, విద్యుత్తు సుంకం కలిపి ఇతర మొత్తం రూ.494.34 బిల్లు చెల్లించాలి. కానీ, రూ.669 చెల్లించాల్సి వస్తోంది. ఆగస్టులో వినియోగం ఆధారంగా యూనిట్‌కు రూ.1.23 చొప్పున రూ.174.66 ట్రూఅప్‌ భారం పడింది. వాస్తవ బిల్లు కంటే సర్దుబాటు భారం సుమారు 35% అధికం.

  • ప్రభుత్వం తాజాగా అమలులోకి తెచ్చిన సర్దుబాటు విధానం వల్ల పాత బిల్లుల భారం అధికంగా పడుతుంది. ప్రతి కనెక్షన్‌పై బిల్లు మొత్తం సుమారు 20-35 శాతం వరకు పెరిగింది.
  • తిరుపతికే చెందిన హరిప్రసాద్‌రెడ్డి (సర్వీసు నం. 5534100057671) ఆగస్టులో 200 యూనిట్లు వినియోగించినట్లు మీటర్‌ రీడింగ్‌ నమోదైంది. ఈ లెక్కన రూ.620 వినియోగ ఛార్జీలు, ఇతర ఖర్చులు కలిపి రూ.695 బిల్లు కట్టాలి. కానీ, రూ.941 బిల్లు వచ్చింది. ఆగస్టులో వాడకాన్ని బట్టి ట్రూఅప్‌ రూ.246 బిల్లులో కలిపారు. సర్దుబాటు భారం 26 శాతం.
  • ఈపీడీసీఎల్‌ పరిధిలోని ఓ కనెక్షన్‌పై ఆగస్టులో 88 యూనిట్ల వినియోగం నమోదైంది. దీని ప్రకారం వినియోగ ఛార్జీలు రూ.246.40, ఇతర ఛార్జీలు కలిపి రూ.301.28 బిల్లు రావాలి. కాని యూనిట్‌కు 44 పైసల సర్దుబాటు ఛార్జీల కింద రూ.38.72 బిల్లులో కలిపారు. బిల్లు మొత్తంలో ఇది 11 శాతంగా ఉంది.
  • సీపీడీసీఎల్‌ పరిధిలో 202 యూనిట్ల వినియోగానికి విద్యుత్‌ ఛార్జీలు, ఇతర ఖర్చులు కలిపి రూ.745.54 బిల్లు చెల్లించాలి. ట్రూఅప్‌ మొత్తం రూ.248.46 కలిపి రూ.994 కట్టాల్సి వస్తోంది.

రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగంలో ఏటా సగటున 8 శాతం వృద్ధి ఉంటుందని విద్యుత్‌ సంస్థలు పేర్కొంటున్నాయి. ఇంధన సంస్థలు ట్రూఅప్‌ వసూలుకు ప్రస్తుత వినియోగాన్ని (67,500 ఎంయూలు) ప్రాతిపదికగా తీసుకున్నాయి. 2014-15 నుంచి 2018-19 సంవత్సరాల్లో విద్యుత్‌ సరఫరా వ్యయం.. వాస్తవ వ్యయానికి మధ్య వ్యత్యాసాన్ని ట్రూఅప్‌ పేరిట రూ.3,669 కోట్లను సెప్టెంబరు నుంచి రానున్న 8 నెలల్లో వసూలుకు రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) అనుమతించింది. డిస్కంలు సెప్టెంబరు నెలలో జారీ చేసిన బిల్లులో ఈ మొత్తాన్ని కలిపి వినియోగదారులకు ఇస్తున్నాయి. రాష్ట్రంలో 1.47 లక్షల గృహ, 14.65 లక్షల వాణిజ్య, 1.63 లక్షల పారిశ్రామిక కనెక్షన్లపై సర్దుబాటు భారం పడుతోంది. ఇది గృహ వినియోగదారులపై మరింత ఎక్కువని విద్యుత్‌రంగ నిపుణులు చెబుతున్నారు. గృహ విద్యుత్తు వినియోగం ఏటా సుమారు 10.7 శాతం పెరుగుతుందని ఇంధన సంస్థల అంచనా.

మోదం.. ఖేదం

* 2018-19 ఆర్థిక సంవత్సరం వరకు అదనపు వ్యయాన్ని మాత్రమే సర్దుబాటు కింద ఏపీఈఆర్సీ ప్రతిపాదించింది. 2019 ఏప్రిల్‌ నుంచి తీసుకున్న కనెక్షన్లను ట్రూఅప్‌ నుంచి మినహాయించింది. ఈ నిబంధన ప్రకారం కొత్త కనెక్షన్‌ తీసుకున్న వారు.. అప్పటిదాకా వేరే ఇళ్లలో ఉంటూ వాడుకున్న కరెంటుకు ట్రూఅప్‌ భారం నుంచి ఉపశమనం పొందినట్లైంది.

* తెలంగాణ, ఇతర ప్రాంతాల నుంచి 2019 ఏప్రిల్‌ తర్వాత ఉద్యోగ రీత్యా ఏపీకి వచ్చిన వారు ట్రూఅప్‌ కోసం నిర్దేశించిన కాలంలో విద్యుత్‌ను వాడుకోనప్పటికీ.. ఏపీఈఆర్‌సీ ఆదేశాల ప్రకారం వారు భారాన్ని మోయకతప్పదు.

75 యూనిట్ల లోపు వినియోగం ఉన్న ‘ఏ’ కేటగిరీలోని పేదలు వినియోగ ఛార్జీల కింద గరిష్ఠంగా రూ.137.50 చెల్లించాలి. సర్దుబాటు ఛార్జీల కింద వారిపై ప్రతినెలా రూ.92.25 అదనపు భారం పడుతుంది. ఇతర ఛార్జీలు కూడా కలిపి నెలకు రూ.280 వరకు బిల్లు చెల్లించాలి. పేదలకు తక్కువ ధరకే విద్యుత్‌ ఇవ్వాలన్న లక్ష్యంతో 75 యూనిట్ల లోపు వాడుకుంటే యూనిట్‌కు సగటున రూ.1.83 వంతున నిర్దేశించారు. ట్రూఅప్‌ రూ.1.23 కలిపి ప్రస్తుతం యూనిట్‌కు రూ.3.06 చొప్పున ఆ వర్గాలు చెల్లించాల్సి వస్తోంది. గరిష్ఠ వినియోగాన్ని (75 యూనిట్లు) పరిగణనలోకి తీసుకుంటే ఒక్కొక్కరిపై 8 నెలల్లో ట్రూఅప్‌ కింద రూ.738 అదనపు భారం పడుతుంది.

వినియోగం 225 యూనిట్ల లోపు ఉన్న కనెక్షన్లను ‘బి’ కేటగిరిగా పరిగణించి టారిఫ్‌ అమలు చేస్తున్నారు. సుమారు 200 యూనిట్లు వాడుకుంటే.. వినియోగ ఛార్జీలు, ఇతర ఖర్చులు కలిపితే రూ.695 అవుతుంది. ట్రూఅప్‌ పేరిట రూ.246 కలిపి మొత్తం రూ.941 చెల్లించాల్సి ఉంటుంది.

225 యూనిట్లకు మించి వాడితే ‘సి’ కేటగిరీగా పరిగణిస్తారు. ఉదాహరణకు 255 యూనిట్లు వాడుకుంటే ఛార్జీల కింద రూ.1,364 చెల్లించాలి. దీనికి ట్రూఅప్‌ రూ.313.65 కలిపితే మొత్తం బిల్లు రూ.1,619 అవుతుంది.

ఇదీ చదవండి:

CHAVITHI CELEBRATIONS: వినాయక చవితికి హైకోర్టు గ్రీన్​ సిగ్నల్... ప్రైవేటు స్థలాల్లోనే మండపాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.