ETV Bharat / city

CM JAGAN: ఎంఎస్ఎంఈలతో 10 లక్షల మందికి ఉద్యోగాలు: సీఎం జగన్‌

author img

By

Published : Sep 3, 2021, 3:32 PM IST

Updated : Sep 4, 2021, 4:23 AM IST

రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని, పెట్టుబడులు పెట్టే వారిలో విశ్వాసాన్ని నింపుతుందని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని 97,423 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్‌ఎంఈ)ల ద్వారా 10 లక్షల మందికి ఉపాధి కల్పించడంతో పాటు.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు దోహదపడే ఈ రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాల కింద రూ.1,124 కోట్లను సీఎం శుక్రవారం బటన్‌ నొక్కి వాటి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.

cm ys jagan
release of incentives to support MSMEs

ముఖ్యమంత్రి జగన్‌

రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని, పెట్టుబడులు పెట్టే వారిలో విశ్వాసాన్ని నింపుతుందని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని 97,423 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్‌ఎంఈ)ల ద్వారా 10 లక్షల మందికి ఉపాధి కల్పించడంతో పాటు.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు దోహదపడే ఈ రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాల కింద రూ.1,124 కోట్లను సీఎం శుక్రవారం బటన్‌ నొక్కి వాటి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
‘రాష్ట్ర జీడీపీని పెంచటంలో వ్యవసాయ రంగం తర్వాత పరిశ్రమలదే పెద్ద పాత్ర. ఆర్భాటపు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టకుండా పరిశ్రమలు తీసుకురావటానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోంది. పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల వాతావరణం కల్పించటంలో భాగంగా ప్రోత్సాహకాలపై వారిలో నమ్మకం కల్పించాలి. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా వస్తు, సేవలకు డిమాండ్‌ తగ్గింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలను కాపాడుకుంటూనే వస్తుసేవలకు
డిమాండ్‌ తగ్గకుండా పరిశ్రమలను నిలబెట్టే ప్రయత్నం చేశాం. పరిశ్రమల నుంచి వచ్చే ఉత్పత్తులను కొనుగోలు చేసే శక్తి కల్పించటానికి 25 రకాల సంక్షేమ, అభివృద్ధి పథకాల ద్వారా ప్రజల చేతికి డబ్బు అందించాం. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థికాభివృద్ధి 5.2 శాతం లోటులో ఉంటే.. రాష్ట్రంలో కొంత పాజిటివ్‌ కనిపించింది’ అని వివరించారు.

పరిశ్రమల్లో పనిచేసేవారినీ ఆదుకునేలా..

‘రాష్ట్రంలో సుమారు 12 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న ఎంఎస్‌ఎంఈలు, టెక్స్‌టైల్‌, స్పిన్నింగ్‌ మిల్లులను ఆదుకునేలా రూ.1,124 కోట్లను ప్రోత్సాహకాల కింద విడుదల చేశాం. ఇందులో ఎంఎస్‌ఎంఈలకు సుమారు రూ.450 కోట్లు, టెక్స్‌టైల్‌ మిల్లులకు రూ.230 కోట్లు ఇస్తాం. మరో రూ.450 కోట్లను విద్యుత్‌ ఛార్జీల రీయంబర్స్‌మెంట్‌ కింద స్పిన్నింగ్‌ మిల్లులు భవిష్యత్తులో చెల్లించే బిల్లుల్లో రిబేటుగా అందిస్తాం. అధికారంలోకి వచ్చిన 27 నెలల్లో రూ.2,086 కోట్లను ప్రోత్సాహకాలుగా ఇచ్చాం. దీనిలో 62 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పారిశ్రామికవేత్తలు లబ్ధి పొందారు. వైఎస్‌ఆర్‌ నవోదయం కింద 1.08 లక్షల ఎంఎస్‌ఎంఈలకు సంబంధించిన రూ.3,236 కోట్ల బ్యాంకు రుణాలను రీషెడ్యూల్‌ చేశాం. 2.49 లక్షల ఎంఎస్‌ఎంఈల బ్యాంకు ఖాతాలకు అత్యవసర క్రెడిట్‌ లైన్‌ హామీ పథకం కింద రూ.5,973 కోట్లను అదనపు నిర్వహణ మూలధనంగా అందించాం’ అని వెల్లడించారు.

పెట్టుబడులను ఆకర్షించి.. ఉపాధి కల్పన

‘కొప్పర్తిలో వైఎస్‌ఆర్‌ జగనన్న మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌ను 3,155 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్నాం. దీని ద్వారా రూ.25 వేల కోట్ల పెట్టుబడులు వచ్చి సుమారు 75 వేల మందికి ఉపాధి లభిస్తుంది. కొప్పర్తిలోనే వైఎస్‌ఆర్‌ ఈఎంసీ ద్వారా రూ.10 వేల కోట్ల పెట్టుబడులు, సుమారు 30 వేల మందికి రానున్న రెండేళ్లలో ఉపాధి లభించే అవకాశం ఉంది. గత రెండున్నరేళ్లలో రూ.30,175 కోట్ల పెట్టుబడితో 68 భారీ, మెగా పరిశ్రమలు ఉత్పత్తిలోకి వచ్చాయి. వాటి ద్వారా 46,199 మందికి ఉపాధి లభించింది. మరో 62 భారీ, మెగా పరిశ్రమల ద్వారా రూ.34,384 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. వాటి ద్వారా 76,916 మందికి ఉపాధి అందుతుంది.

యూనిట్‌కు రూ.2.48 ఖర్చుతో 30 ఏళ్లపాటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ అందించటానికి రూ.30 వేల కోట్ల పెట్టుబడితో 10 వేల మెగావాట్ల సౌరవిద్యుత్‌ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నాం. రూ.కోటి లోపు పెట్టుబడి పెట్టే ఎస్సీ, ఎస్టీలకు 45 శాతం, బీసీలకు 35 శాతం పెట్టుబడిలో రాయితీ ఇస్తున్నాం’ అని వివరించారు.

పారిశ్రామిక నడవాల అభివృద్ధి

‘రాష్ట్రంలో వేగవంతమైన పారిశ్రామికాభివృద్ధికి విశాఖ- చెన్నై, చెన్నై- బెంగళూరు, హైదరాబాద్‌- బెంగళూరు పారిశ్రామిక నడవాలను అభివృద్ధి చేస్తున్నాం. ప్రైవేటు సంస్థతో కలిసి కడపలో రూ.13,500 కోట్లతో వైఎస్‌ఆర్‌ స్టీల్‌ కార్పొరేషన్‌ను నెలకొల్పుతున్నాం. 2024 నాటికి భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులను రూ.13 వేల కోట్లతో అభివృద్ధి చేస్తాం. రెండు దశల్లో 9 కొత్త చేపల రేవులను రూ.3,827 కోట్లతో అభివృద్ధి చేస్తున్నాం. వాటి ద్వారా ప్రత్యక్షంగా 76,230 మంది మత్స్యకారులకు, పరోక్షంగా మరో 35 వేల మందికి ఉపాధి దొరుకుతుంది. రూ.3 వేల కోట్లతో భోగాపురం విమానాశ్రయానికి వచ్చే నెలలో శంకుస్థాపన చేస్తాం.

గ్రామీణ స్థాయిలో ఉపాధి కల్పించటానికి ఆసరా, చేయూత కింద అమూల్‌, ఐటీసీ, హిందూస్థాన్‌ లీవర్‌, ప్రొక్టర్‌ అండ్‌ గాంబుల్‌, రిలయన్స్‌ వంటి భారీ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని 1.07 లక్షల మంది మహిళలతో కిరాణా దుకాణాలు ఏర్పాటు చేయించాం. అమూల్‌ ద్వారా 2.65 లక్షల మంది మహిళలకు గేదెలు, గొర్రెల పెంపకం ద్వారా ఉపాధి కల్పిస్తున్నాం. ‘జగనన్న తోడు’ ద్వారా 9.51 లక్షల మంది చిరు వ్యాపారులకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తున్నాం.

ఇంటి దగ్గరకే రేషన్‌ అందించటానికి 90 శాతం రాయితీతో 9,620 వాహనాలను ఒక్కొక్కటి రూ.5.8 లక్షల వ్యయంతో అందించాం. రూ.2,500 కోట్లతో 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఆహార శుద్ధి యూనిట్లను ఏర్పాటు చేయనున్నాం. స్థానికంగా ఆక్వా ఉత్పత్తుల వినియోగాన్ని పెంచటానికి రూ.1,200 కోట్ల పెట్టుబడులతో 23 ఉచిత ప్రాసెసింగ్‌ యూనిట్లు, 10 ప్రాసెసింగ్‌ ప్లాంట్లను నెలకొల్పనున్నాం. వీటితోపాటు 100 హబ్‌లు, 14,500 చిల్లర దుకాణాలు వస్తాయి. వాటి ద్వారా 1.01 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. బిజినెస్‌ రిఫార్మ్‌ యాక్షన్‌ ప్లాన్‌ రిపోర్టు ప్రకటించిన జాతీయ ర్యాంకుల్లో మన రాష్ట్రానికి మొదటి స్థానం లభించింది. ర్యాంకుల ప్రకటన కోసం కేంద్రం, ప్రపంచ బ్యాంకు మొదటిసారి పారిశ్రామికవేత్తల అభిప్రాయాలను తీసుకున్నాయి’ అని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

AP RAINS LIVE UPDATES : రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు.. రోడ్లన్నీజలమయం

Last Updated :Sep 4, 2021, 4:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.