ETV Bharat / city

YADADRI: 20 లక్షల మంది భక్తులు వచ్చినా ఇబ్బందులుండొద్దు: కేసీఆర్​

author img

By

Published : Jun 22, 2021, 10:50 AM IST

cm kcr at laxmi narasimha swamy temple
యాదాద్రి పునర్‌ నిర్మాణ పనులు

రెండున్నర నెలల్లో యాదాద్రి పునర్‌ నిర్మాణ పనుల్ని పూర్తిచేయాలని అధికారులను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. పెద్దసంఖ్యలో భక్తులు వచ్చినా ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలని సూచించారు. విద్యుత్తు కాంతులతో దేదీప్యమానంగా వెలుగొందుతున్న ఆలయాన్ని తిలకించారు. 3 గంటల 45 నిమిషాలపాటు సాగిన పర్యటనలో యాదాద్రి పనుల్ని సీఎం కేసీఆర్ అనువణువుననా పరిశీలించారు.

తెలంగాణలోని వరంగల్‌ పర్యటన ముగించుకుని సోమవారం సాయంత్రం ఆరు గంటల తర్వాత యాదాద్రికి చేరుకున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌.... పునర్‌ నిర్మాణ పనుల్ని పరిశీలించారు. 20 లక్షల మంది భక్తులు వచ్చినా ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. 3 గంటల 45 నిమిషాల పాటు పునర్నిర్మాణాలను పరిశీలించిన సీఎం... కొండపై కొత్తగా నిర్మించిన ఈవో కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. రింగురోడ్డు పరిధిలో ఉన్న భూములపై డీజీపీఎస్ సర్వే చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. పనుల్లో అలసత్వం పనికిరాదన్న సీఎం... క్యూ కాంప్లెక్స్ భవనం, ఎస్కలేటర్లు, ఆర్నమెంటల్ ఎలివేషన్, పుష్కరిణి, కల్యాణ కట్ట తదితర నిర్మాణాలు జరుగుతున్న తీరు గురించి ఆరా తీశారు.

వలయ రహదారి పరిశీలన

యాదాద్రి పర్యటనలో తొలుత గండిచెరువు ప్రాంగణం వద్ద... వలయ రహదారిలో గల నిర్మాణాలను పరిశీలించారు. పుష్కరిణి, దీక్షాపరుల మండపం, కల్యాణకట్ట తదితర కట్టడాలను వీక్షించారు. కొండచుట్టూ వలయ రహదారిని రెండుసార్లు చుట్టివచ్చారు. రహదారి విస్తరణ బాధితులతో వైకుంఠ ద్వారం వద్ద ఆగి ముచ్చటించిన సీఎం... వారిని ఈవో కార్యాలయానికి పిలిపించారు. తమకు న్యాయం చేయాలంటూ రింగ్ రోడ్డు పరిధిలోని భూయజమానులు వినతిపత్రం అందించగా... భూమికి భూమి ఇవ్వడంతోపాటు నిర్మాణాల విలువను చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఆలయ నగరిలో దుకాణాలు కేటాయించడంలో ప్రాధాన్యతనిచ్చే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.

5 వేల వాహనాల సామర్థ్యం గల పార్కింగ్

కొండపైన తాగునీరు సరఫరా చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్న కేసీఆర్... ఆలయం ప్రారంభమైతే ఒకేసారి భక్తులు పెద్దయెత్తున తరలివస్తారని అందుకనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బస్ డిపో, బస్టాండ్ నిర్మాణానికి అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుందని... వారం రోజుల్లోగా నిర్మాణ పనులు ప్రారంభించి మూడు నెలల్లో పూర్తి చేయాలన్నారు. రింగ్ రోడ్డు లోపల 5 వేల వాహనాల సామర్థ్యం గల పార్కింగ్ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. రెండున్నర నెలల్లో పనులన్నీ పూర్తి చేసి ఉద్ఘాటనకు సిద్ధం కావాలన్న ముఖ్యమంత్రి... వేగంగా జరగని చోట ఏజెన్సీలను మార్చాలని సూచించారు.

స్వామివారని దర్శించుకున్న సీఎం

శ్రీలక్ష్మీనృసింహస్వామి వార్లను ముఖ్యమంత్రి దర్శించుకున్నారు. బాలాలయానికి చేరుకున్న ఆయనకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి అర్చకులు ఆశీర్వచనాలు అందజేశారు. సువర్ణ పుష్పార్చన సేవను సీఎం నిర్వహించారు. స్వామివారి దర్శనం అనంతరం రాత్రి వేళలో... ఆలయ వెలుగు జిలుగుల్ని విద్యుత్తు కాంతుల ధగధగల్లో వీక్షించారు. బెంగళూరు లైటింగ్ సాంకేతికతతో రూపొందించిన దీపకాంతులను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. అంతకుముందు తూర్పు రాజగోపురం ఎదురుగా ఏర్పాటైన ఇత్తడి దర్శన వరుస సముదాయాలను పరిశీలించారు. తర్వాత ప్రధానాలయంలోకి చేరుకుని... స్వయంభువులను దర్శించుకున్నారు. హారతి అనంతరం తీర్థప్రసాదాలను అర్చకులు అందజేశారు. ముఖమండపంలో విద్యుత్తు దీపాల అలంకరణ, కాకతీయ స్తూపాలు, ఆళ్వార్ల చెంతన ఏర్పాటు చేసిన లైటింగ్అమరికను వీక్షించారు. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి... లైటింగ్ తీరును ముఖ్యమంత్రికి వివరించారు. మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, జి.జగదీశ్ రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోశ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎం కార్యదర్శులు స్మితా సభర్వాల్, భూపాల్ రెడ్డి, వైటీడీఏ వైస్ ఛైర్మన్ కిషన్ రావు ముఖ్యమంత్రి వెంట ఉన్నారు.

ఇదీ చదవండి:

Tirumala: తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.