ETV Bharat / city

Telangana Rains: ప్రజలెవ్వరూ ఇళ్లలో నుంచి బయటకురావద్దు: తెలంగాణ సీఎం కేసీఆర్​

author img

By

Published : Jul 22, 2021, 4:21 PM IST

భారీ వర్షాల కారణంగా అతాలాకుతలమవుతున్న తెలంగాణలో యుద్ధప్రాతిపదికన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణ సీఎం కేసీఆర్​
తెలంగాణ సీఎం కేసీఆర్​

భారీ వర్షాల కారణంగా ఎస్సారెస్పీ ఎగువ నుంచి గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో వరద ఉద్ధృతి పెరుగుతున్నందున యుద్ధప్రాతిపదికన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు..

నిజమాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గంతో పాటు నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. తక్షణమే పరిస్థితులను పర్యవేక్షించాలని మంత్రి ప్రశాంత్ రెడ్డిని ఆదేశించారు. అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పారు. నిర్మల్ పట్టణం ఇప్పటికే నీటమునిగిందన్న ముఖ్యమంత్రి... అక్కడకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తక్షణమే పంపాలని సీఎస్ సోమేశ్ కుమార్​ను ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని గోదావరి పరీవాహక ప్రాంత కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులను సీఎం ఆదేశించారు. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలందరూ ఇండ్లల్లోంచి బయటకు రావద్దని కేసీఆర్ సూచించారు.

ఇళ్లలో ఉండటమే క్షేమం...

గోదావరితో పాటు కృష్ణా పరివాహక ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయన్న సీఎం కేసీఆర్​.. ఎగువ రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల గేట్లు తెరుస్తున్నారన్నారు. రాష్ట్రంలోకి వరద ఉద్ధృతి మరింత పెరగనుందని తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు స్థానికంగా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెరాస నేతలు పర్యవేక్షించాలని సూచించిన సీఎం... ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని ఆదేశించారు. ప్రజలు బయటకు వెళ్లకుండా... ఇళ్లలో ఉండటమే క్షేమమని సూచించారు. వాగులు, వంకలన్నీ ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా యుద్ధప్రాతిపదికన తగిన సహాయ, పునరావాస చర్యలు చేపట్టాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. గోదావరి పరివాహక 16 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. డీజీపీ మహేందర్ రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు కూడా టెలికాన్ఫరెన్స్​లో పాల్గొన్నారు.

గండ్లు పడకుండా చర్యలు...

పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని... అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలని సీఎస్ ఆదేశించారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. అన్ని శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేయాలని, చెరువులకు ఎలాంటి గండ్లు పడకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ప్రభుత్వం తరపున సహకారం..

తాగునీరు, విద్యుత్ సరఫరా, పారిశుధ్య నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలని సోమేశ్ కుమార్ అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అవసరమైన సహకారం అందిస్తామన్న సీఎస్... విపత్తు నిర్వహణా శాఖ ప్రత్యేక కార్యదర్శి రాహుల్ బొజ్జాకు వివరాలు అందించాలని ఆదేశించారు.

ఇదీ చదవండి:

కాలనీలు జలమయం- రైళ్లలో చిక్కుకున్న 6వేల మంది!

వర్ష బీభత్సం- స్తంభించిన రవాణా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.