ETV Bharat / city

TS CM KCR: 'కేంద్రం ధాన్యం సేకరించే వరకు విశ్రమించే ప్రసక్తే లేదు'

author img

By

Published : Mar 21, 2022, 7:33 PM IST

TS CM KCR
TS CM KCR

TS CM KCR:కేంద్రం ధాన్యం సేకరించే వరకు విశ్రమించే ప్రసక్తే లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. రేపు మంత్రులు, ఎంపీల బృందం కేంద్రమంత్రిని కలుస్తారని... అక్కడ సానుకూల స్పందన రాకుంటే... పెద్దఎత్తున ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేపడతామని ప్రకటించారు.

TS CM KCR:కేంద్రం ధాన్యం సేకరణపై అంగీకరించకపోతే తెలంగాణ ఉద్యమ పంథాలో పోరాడుతామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ స్పష్టం చేశారు. రేపు మంత్రులు, ఎంపీల బృందం కేంద్రమంత్రిని కలుస్తారని... అక్కడ సానుకూల స్పందన రాకుంటే... పెద్దఎత్తున ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేపడతామని ప్రకటించారు. కేంద్రం ధాన్యం సేకరించే వరకు విశ్రమించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఆషామాషీగా కాకుండా కార్యాచరణ మేరకు పోరాటం ఉంటుందన్నారు. పంచాయతీల తీర్మానాలను కూడా కేంద్రానికి పంపుతామన్నారు. మండల, జిల్లా పరిషత్‌ల తీర్మానాలు కేంద్రానికి పంపుతామన్న సీఎం.. మున్సిపాలిటీలు, మార్కెట్‌ కమిటీల తీర్మానాలు కూడా పంపుతామన్నారు.

'కేంద్రం ధాన్యం సేకరించే వరకు విశ్రమించే ప్రసక్తే లేదు'

పంజాబ్​ తరహాలో ధాన్యం సేకరించాలి..
రాష్ట్రంలో యాసంగి వరి ధాన్యాన్ని కేంద్రం సేకరించాలని టీఆర్​ఎస్​ఎల్పీ భేటీలో తీర్మానం చేసినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్​ వెల్లడించారు. పంజాబ్‌ తరహాలో కేంద్రం ధాన్యాన్ని సేకరించాలని తీర్మానం చేశామని సీఎం పేర్కొన్నారు. రేపు మంత్రులు, ఎంపీల బృందం దిల్లీ వెళ్లి కేంద్రమంత్రిని కలుస్తారని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. రాష్ట్రంలో పండిన పంటను కేంద్రం సేకరించాలన్నారు. ఎక్కువ పంట వస్తే ప్రాసెస్‌ చేసి నష్టం వస్తే కేంద్రమే భరించాలని ముఖ్యమంత్రి తెలిపారు.

'ఒకే దేశం-ఒకే సేకరణ' విధానం ఉండాలి..
దేశవ్యాప్తంగా ఒకే విధానమైన ధాన్యం సేకరణ విధానం ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. 'వన్‌ నేషన్‌-వన్‌ రేషన్‌' అని చెబుతున్న కేంద్రం... ధాన్యం సేకరణలో 'వన్‌ నేషన్‌-వన్‌ ప్రొక్యూర్‌మెంట్‌ ' పద్ధతిని అవలంభించాలని స్పష్టం చేశారు. ఈసారి యాసంగిలో 35 లక్షల ఎకరాల్లో ధాన్యం వస్తుందన్న కేసీఆర్‌.... పంట మార్పిడి కింద దాదాపు 25 లక్షల ఎకరాలు తగ్గిందని తెలిపారు. పంజాబ్‌లో ఎలా సేకరిస్తున్నారో అదే నీతిని తెలంగాణలోనూ అమలుచేయాలని డిమాండ్‌ చేశారు.

కేంద్రం కొనుగోలు చేయాలి..

ఆహార ధాన్య సేకరణలో దేశమంతా ఒకే విధానం ఉండాలి. ఆహార ధాన్య సేకరణలో 'ఒకే దేశం-ఒకే సేకరణ' విధానం ఉండాలి. ధాన్యం సేకరణలో గతంలోనూ కేంద్రం ఇబ్బందులు సృష్టించింది. యాసంగిలో వచ్చే వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలి. కనీస మద్దతు ధర బియ్యానికి కాదు.. ధాన్యానికి నిర్ణయిస్తారు. కనీస మద్దతు ధర ప్రకారమే పంజాబ్‌లో ధాన్యం సేకరిస్తున్నారు. కనీస మద్దతు ధర ప్రకారమే తెలంగాణ ధాన్యం తీసుకోవాలి. బాయిల్డ్‌ రైస్‌ మాత్రమే ఇవ్వాలని కేంద్రం చెబుతోంది. ధాన్యం ఇస్తే రా రైస్‌ చేస్తారా? బాయిల్డ్‌ రైస్‌ చేస్తారా? అనేది కేంద్రం నిర్ణయం. -సీఎం కేసీఆర్​

కశ్మీర్​ ఫైల్స్​పై సీఎం సీరియస్​..
కేంద్ర ప్రభుత్వం కశ్మీర్‌ ఫైల్స్‌ నినాదాన్ని లేవనెత్తిందని ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీర్‌ పండిట్‌లు తమకు అన్యాయం జరిగిందని వాపోతున్నారని సీఎం వెల్లడించారు. కశ్మీర్‌ పండిట్‌లకు జరిగిన అన్యాయాన్ని ఓట్ల రూపంలో కొల్లగొట్టేందుకే కేంద్రం యత్నిస్తోందని ఆరోపించారు. దేశ ప్రజల విభజన చేసి విద్వేషాలను రెచ్చగొట్టే యత్నం జరుగుతోందని ఆయన ఆరోపణలు చేశారు. భాజపా పాలిత ప్రాంతాల్లో సెలవులు ఇచ్చి కశ్మీర్‌ ఫైల్స్‌ చూడాలని ఉద్యోగులకు చెబుతున్నారని మండిపడ్డారు.

భాజపా పరిస్థితి దిగజారిపోతోంది..
యూపీలో భాజపా బలం తగ్గుతుందని గతంలోనే చెప్పానన్న ముఖ్యమంత్రి.. గతంలో 312కు గాను 255 స్థానాలకు భాజపా పరిమితమైందన్నారు. సీట్లు తగ్గడం దేనికి సంకేతమో భాజపా ఆలోచించుకోవాలని సీఎం అన్నారు. భాజపా పరిస్థితి నానాటికీ దిగజారిపోతోందన్నారు. భాజపా ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులు, పరిశ్రమలు తీసుకురాలేదని సీఎం మండిపడ్డారు. దేశం బాగుపడాలంటే భాజపాను గద్దె దించాలని ప్రజలు భావిస్తున్నారని సీఎం వెల్లడించారు. యూపీఏ పాలన సరిగా లేదని ప్రజలు భాజపాకు అధికారం ఇస్తే.. భాజపా మరింత అధ్వాన పాలన సాగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వరంగ సంస్థలను తాబేదార్లకు చౌకగా కట్టబెడుతున్నారని సీఎం ఆరోపించారు.

కేంద్ర విధానాలను తిప్పికొట్టాలి..

ఉక్రెయిన్‌ నుంచి భారతీయుల తరలింపులో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. విద్యార్థులను కేంద్రం ముందే అప్రమత్తం చేయలేదు. విద్యార్థుల చదువులకు ఇబ్బందులు రావద్దని మేం చెప్పాం. అభివృద్ధి, ఉపాధి కల్పన తదితర రంగాల్లో భారత్‌ ర్యాంకు అధ్వానంగా ఉంది. ఏ రంగంలో చూసినా దేశం తిరోగమనంలోనే ఉంది. కేంద్ర విధానాలను తిప్పికొట్టాలని తీర్మానించాం. కేంద్ర వ్యతిరేక ఉద్యమాలు చేపట్టాలని తీర్మానించాం. భాజపా ఇచ్చిన ఒక్క హామీ నిలబెట్టుకోలేదు. ఎన్నికలు వచ్చినప్పుడు మాయ చేయడం తప్ప ఏమీ లేదు. -సీఎం కేసీఆర్​

కేంద్రం సమాధానం లేదు..
రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని రాజ్యాంగంలో లేదని.. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు ఎక్కడా అమలు కావట్లేదని సీఎం కేసీఆర్​ అన్నారు. రిజర్వేషన్లు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉన్నాయన్నారు. రాష్ట్రాల్లో ప్రత్యేక పరిస్థితులు ఉంటే రిజర్వేషన్లు పెంచుకోవచ్చని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో రిజర్వేషన్లపై అధ్యయనం చేసి కేంద్రానికి నివేదిక పంపామన్నారు. ఎస్టీ రిజర్వేషన్లు 10 శాతానికి పెంచుకుంటామని కేంద్రానికి పంపామని సీఎం స్పష్టం చేశారు. రిజర్వేషన్ల పెంపుపై కేంద్రం నుంచి సమాధానం రాలేదని ఆయన మండిపడ్డారు. బీసీల కులగణన చేపట్టాలని కేంద్రాన్ని కోరినా స్పందించలేదన్నారు. ప్రగతిశీల ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్​ వెల్లడించారు. విభజన రాజకీయాలకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రధానికి విజ్ఞప్తి చేస్తున్నా..

తెలంగాణ ప్రజలతో పెట్టుకోవద్దని ప్రధానికి విజ్ఞప్తి చేస్తున్నా.ఉద్యమవీరులం తప్పకుండా ఉద్యమం చేస్తాం. పంజాబ్‌కు అవలంభించిన నీతి మాకు అమలు చేయాలి. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. కరవు వస్తే వారం రోజులు అన్నం పెట్టే శక్తి ఏ దేశానికి లేదు. ఆహార నిల్వలు ఉంచుకోవడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత. జాతీయస్థాయిలో ధాన్యం సేకరణ విధానం ఒకేలా ఉండాలి. -సీఎం కేసీఆర్​

ప్రశాంత్​ కిశోర్​ మంచి స్నేహితుడు..
ప్రశాంత్‌ కిశోర్‌ ఎనిమిదేళ్లుగా తనకు మంచి స్నేహితుడని ముఖ్యమంత్రి కేసీఆర్​ తెలిపారు. ప్రశాంత్‌ కిశోర్‌ ఎప్పుడూ డబ్బులు తీసుకుని పనులు చేయరన్నారు. దేశంపట్ల ప్రశాంత్‌ కిశోర్‌కు ఉన్న నిబద్ధత ఏమిటో మీకు తెలియదని మీడియా ప్రతినిధులకు చెప్పారు. ప్రశాంత్‌ కిశోర్‌ డబ్బులు తీసుకుని పని చేస్తారని ఎవరైనా నిరూపిస్తారా? అని ప్రశ్నించారు.

ఆహ్వానం మేరకే..

పార్టీల అవసరాల మేరకు 12 రాష్ట్రాల్లో ప్రశాంత్‌ కిశోర్‌ పనిచేశారు. తమిళనాడు, బంగాల్‌, ఏపీ సహా పలు రాష్ట్రాల్లో ప్రశాంత్‌ కిశోర్‌ పనిచేశారు. భాజపాకు కూడా ప్రశాంత్‌ కిశోర్‌ పనిచేశారు. దేశ రాజకీయాలపై ప్రశాంత్ కిశోర్‌కు అవగాహన ఉంది. జాతీయ రాజకీయాలు ప్రభావితం చేయడానికి నిర్ణయం తీసుకున్నా. నా ఆహ్వానం మేరకు ప్రశాంత్‌ కిశోర్‌ వచ్చి పనిచేస్తున్నారు. -సీఎం కేసీఆర్​

ముందస్తు ప్రసక్తే లేదు..
ఆరునూరైనా ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్​ స్పష్టం చేశారు. గతంలో అవసరం మేరకు ముందస్తు ఎన్నికలకు వెళ్లామన్నారు. ఈ సారి తెరాస 95 నుంచి 105 స్థానాలు గెలుస్తుందని కేసీఆర్​ ధీమా వ్యక్తం చేశారు. గతంలో అవసరం మేరకు ముందస్తు ఎన్నికలకు వెళ్లామన్నారు. చినజీయర్‌స్వామితో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. చినజీయర్‌స్వామితో అపోహలు సృష్టించేందుకు ప్రయత్నించవద్దని సీఎం విజ్ఞప్తి చేశారు.

ఉద్యోగాలు భర్తీ చేస్తాం..
ఏటా ఉద్యోగ క్యాలెండర్‌ విడుదల చేసి పోస్టులు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్​ స్పష్టం చేశారు. ఖచ్చితంగా 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. పాఠశాలలు మూస్తారని అపోహలు సృష్టిస్తున్నారన్న సీఎం.. రాష్ట్రంలో పాఠశాలలు మూసివేయట్లేదని వెల్లడించారు. పాఠశాలలో అవసరం మేరకు సిబ్బంది ఉండాలన్న సీఎం.. అన్ని సబ్జెక్టుల బోధనకు మరో 10 వేల సిబ్బందినైనా నియమిస్తామన్నారు.


ఇదీ చదవండి: బిపిన్ రావత్​కు పద్మవిభూషణ్.. స్వీకరించిన కుమార్తెలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.