ETV Bharat / city

Night Curfew Lifted: రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం

author img

By

Published : Feb 14, 2022, 6:22 PM IST

Updated : Feb 14, 2022, 7:37 PM IST

వైద్యారోగ్యశాఖపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష
వైద్యారోగ్యశాఖపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష

18:19 February 14

వైద్యారోగ్యశాఖపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష

రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొవిడ్ వ్యాప్తి గణనీయంగా తగ్గినందున కర్ఫ్యూను తొలగిస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. కర్ఫ్యూ తొలగించినా.. కొవిడ్ బారిన పడకుండా మార్గదర్శకాలు కచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. కొవిడ్‌పై ముఖ్యమంత్రి జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశానికి ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ టీ.కృష్ణబాబు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

రాష్ట్రంలో కొవిడ్‌ పరిస్థితులు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియను అధికారులు సీఎం జగన్​కు వివరించారు. రాష్ట్రంలో కొవిడ్‌ వ్యాప్తి గణనీయంగా తగ్గిందని.., పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. యాక్టివ్ కేసుల రేటు 0.82 శాతానికి పడిపోయిందన్నారు. గత వారం 1 లక్ష 622 పాజిటివ్‌ కేసులు ఉండగా.., ఇప్పుడు 18 వేల 929కి పడిపోయాయని తెలిపారు. వీటిలో ఆస్పత్రిలో 794 మంది చేరగా.. వారిలో కేవలం 130 మంది ఐసీయూలో ఉన్నారన్నారు. అన్ని జిల్లాల్లోనూ కేసులు గణనీయంగా తగ్గాయన్నారు.

దీంతో రాత్రిపూట కర్ఫ్యూ తొలగించాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. ప్రజలంతా మాస్క్‌లు కచ్చితంగా ధరించేలా మార్గదర్శకాలు కొనసాగాలని ఆదేశించారు. దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చూడాలన్నారు. ఫీవర్‌ సర్వే కొనసాగించాలన్న సీఎం..లక్షణాలు ఉన్నవారికి టెస్టుల ప్రక్రియ కొనసాగించాలన్నారు. వాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరంగా కొనసాగించాలని ఆదేశించారు. రాష్ట్రంలో 3 కోట్ల 90 లక్షల 83 వేల 148 మందికి రెండు డోసులు టీకాలు వేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు. 39 లక్షల 4 వేల 927 మందికి ఒక డోసు మేర వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్లు తెలిపారు. మొత్తంగా 8 కోట్ల 32 లక్షల 55 వేల 831 డోసులు వాక్సిన్లు ఉపయోగించినట్లు వివరించారు.

"మాస్క్‌లు కచ్చితంగా ధరించేలా చూడాలి. వ్యాపార సముదాయాల్లో కొవిడ్‌ జాగ్రత్తలు పాటించాలి. ఫీవర్‌ సర్వే కొనసాగించాలి. లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేయించాలి. వైద్యారోగ్యశాఖలో నియామకాలు త్వరగా పూర్తి చేసి సిబ్బంది తప్పనిసరిగా ఆస్పత్రుల్లో ఉండేలా చూడాలి. ఆస్పత్రుల్లో చికిత్స, పాలన బాధ్యతలు వేర్వేరు చేయాలి. నిపుణులకు పాలనా బాధ్యతలు అప్పగించాలి. గిరిజన ప్రాంతాల్లో చేసే వైద్యులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి." -జగన్, ముఖ్యమంత్రి

వారికి ప్రోత్సాహకాలు..

వైద్యారోగ్యశాఖపైనా సమీక్షించిన సీఎం.. ఆ శాఖలో రిక్రూట్‌మెంట్‌ను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. సిబ్బంది తప్పనిసరిగా ఆస్పత్రుల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆస్పత్రుల్లో పరిపాలనా బాధ్యతలను, చికిత్స బాధ్యతలను వేరు చేయాలని సీఎం ఆదేశించారు. నిపుణులైన వారికి పరిపాలనా బాధ్యతలను అప్పగించాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని సీఎం ఆదేశించగా.. వీటిపై మార్గదర్శకాలు తయారు చేసినట్లు అధికారులు వెల్లడించారు. స్పెషలిస్టు వైద్యులకు ఇస్తున్న మూలవేతనంలో 50 శాతం, వైద్యులకు 30 శాతం మేర ప్రత్యేక ప్రోత్సాహకంగా ఇచ్చేలా మార్గదర్శకాలు రూపొందించామన్నారు.

ఇదీ చదవండి

ఆ దాబాల్లో మద్యం అమ్మొద్దు.. డ్రైవింగ్‌ లైసెన్స్‌ విధానాన్ని పునఃసమీక్షించాలి: సీఎం జగన్

Last Updated :Feb 14, 2022, 7:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.