ETV Bharat / city

MARRIAGE: వారి రాకతో ఆగిన పెళ్లి.. అసలేమైందంటే

author img

By

Published : Aug 18, 2021, 8:04 PM IST

కొద్దిసేపట్లో పెళ్లి జరగబోతోంది. అన్ని పనులు పూర్తయ్యాయి. బంధుమిత్రులు అందరూ పెళ్లి మండపానికి విచ్చేశారు. పెళ్లి వారు అతిథి మర్యాదలు చేస్తున్నారు. మండపంలో బంధువుల కోలాహలం నెలకొంది. కాసేపట్లో వరుడు... వధువుకు తాళి కట్టబోతున్నాడు. సీన్ కట్ చేస్తే పెళ్లి మండపంలోని అధికారులు ఎంట్రీ ఇచ్చారు. సమయానికి జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. అసలేం జరిగిందంటే!

బాల్యవివాహం
child marriage

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అత్తాపూర్​లో ఓ పెళ్లి జరుగుతోంది. వివాహానికి ఇరు కుటుంబాల వారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వరుడు, వధువు తరఫు బంధువులు పెద్ద సంఖ్యలో పెళ్లికి హాజరయ్యారు. ఫంక్షన్ హాల్​ బంధుమిత్రులతో నిండిపోయింది. పెళ్లికి వచ్చే అతిథులకు అన్ని నోరురించే వంటకాలు సిద్ధం చేశారు. అంతా సవ్యంగా జరుగుతోంది అనుకున్న సమయంలో ఉన్నట్టుండి కొంతమంది అధికారులు పెళ్లిలో ప్రత్యక్షమయ్యారు.

ఫంక్షన్ హాల్​లో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఏం జరుగుతుందో పెళ్లికి వచ్చిన వారికి అర్థంకాలేదు. మండపంలోకి వచ్చిన అధికారులు నేరుగా పెళ్లి కూతురు దగ్గరకు వెళ్లారు. ఈ వివాహం ఆపాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అసలు వచ్చినవారు ఎవరు? ఎందుకు పెళ్లి ఆపుతున్నారని బంధువులు ప్రశ్నించారు. తాము చైల్డ్ లైన్ అధికారులమని వచ్చిన ఆఫీసర్లు చెప్పారు. మీ అమ్మాయి మైనర్.. చిన్న వయసులోనే పెళ్లి చేయడం నేరం. అందుకే ఈ పెళ్లిని నిలిపివేస్తున్నామని అమ్మాయి తల్లిదండ్రులకు వివరించారు.

అమ్మాయి మైనర్ కావడం వల్ల విశ్వసనీయ సమాచారం అందుకున్న చైల్డ్ లైన్ అధికారులు, షీ టీమ్​తో కలిసి బాల్య వివాహాన్ని (Child marriage) అడ్డుకున్నారు. వధువు మైనర్ బాలికకు 16 ఏళ్లు మాత్రమే ఉన్నట్లు అధికారులు తెలిపారు. మైనర్ బాలికను రాజేంద్రనగర్ పోలీస్​స్టేషన్​కు తరలించారు. ఈ అంశంపై అధికారులు విచారణ చేపట్టారు.

ఇదీ చూడండి: రసాయనాలతో కూడిన విగ్రహాలు నిమజ్జనం చేయకుండా చర్యలేంటి?: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.